ప్రభావతీ ప్రద్యుమ్నం” - 1





వారణాసి – భాగం – 1:

వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.
సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం
వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!

ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశి ఇప్పుడు మోక్షపురి అయింది. కాశి భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు.

ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణము నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది.

అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి.

అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది.

భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.

వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.
***

” ప్రభావతీ ప్రద్యుమ్నం” - 1

సాహితీమిత్రులారా!
మనం ఇంతకు మునుపు కళాపూర్ణోదయము ఆసాంతం చదివాము
ఇప్పుడు ప్రభావతీ ప్రద్యుమ్నం ఆస్వాదించండి-

(“కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ కథా రచనలు. కథాకల్పనలో ఇతనికున్న ప్రతిభ ఇంకెవర్లోనూ కనిపించదు. పురాణపాత్రల్ని వాడుకుంటూనే పూర్తిగా స్వయంకల్పిత కథల్ని అల్లటంలోనూ ఉత్కంఠత పెంచుకుంటూ చెప్పటం లోనూ ఇతనికితనే సాటి. ఇవి రెండూ కాక చిన్నతనంలోనే “రాఘవపాండవీయం” అనే రెండర్థాల కావ్యం కూడ రాసిన ప్రతిభామూర్తి పింగళి సూరన. ఈ “ప్రభావతీప్రద్యుమ్న” కావ్యాన్ని అతను 1590 ప్రాంతాల్లో రాసి వుంటాడని పరిశోధకుల అభిప్రాయం. “సంప్రదాయ కథా లహరి” ప్రాంజలి ప్రభ  లో తొలి ప్రయత్నంగా (రోజువారీ ) దీన్ని అందిస్తున్నాం. )

విష్ణువు కృష్ణుడుగా ద్వారకలో ఉన్న కాలాన ఒక నాడు
ఆయనతో ఓ ముఖ్యమైన పని కలిగి అక్కడికొచ్చేడు స్వర్గాన్నుంచి ఇంద్రుడు.
వస్తూ ఆ నగరం అందాన్ని చూసేసరికి అతనికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది.
అతనూ, అతని సారథి మాతలీ అక్కడి వింతల గురించి చెప్పుకుని ఆనందిస్తూ భూమికి దిగేరు.
వాళ్ళ రాక విన్న కృష్ణుడు సాత్యకిని ఎదురు పంపేడు. ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలైన పెద్దల్తో వచ్చి ఆహ్వానించి వాళ్లని లోపలికి తీసుకెళ్ళేడు.
“అంతా క్షేమమే కదా!” అడిగేడు కృష్ణుడు.
“కృష్ణా! నీకు తెలియందేవుంది? ఐనా నా నోటి మీదగా వినాలంటే విను, చెప్తా.
ఆ మధ్య వజ్రనాభుడనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మని మెప్పించేడు. దాంతో ఆ బ్రహ్మ వాడికి మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరం తయారుచేసి ఇచ్చేడు.అదెలాటి నగరమో తెలుసుగా! ఆ వజ్రనాభుడి అనుమతి లేకుండా చివరికి గాలీ వెలుతురూ కూడా దాన్లో ప్రవేశించటానికి వీల్లేదు!
వాడు మొన్న స్వర్గం మీద దాడికొచ్చి ఏకంగా వెళ్ళి నందన వనాన్నే తన సేనలకి విడిది చేసేడు. ఆ మోటు రాక్షసులెక్కడ, అందమైన నందన వనం ఎక్కడ? అక్కడ వాళ్ళు చేసిన రోతపన్లు చెప్పటానికి నాకు నోర్రావటం లేదు. అది తలుచుకుంటుంటే ఇప్పటికీ నా గుండె గతుక్కుమంటోంది!
ఈ గొడవతో యీ మధ్య నా బుర్ర సరిగా పనిచెయ్యక నీకిందాకే చెప్పలేదు గాని బ్రహ్మ వరంలో ఒక భాగం వాడిని దేవతలెవరూ ఎదిరించలేరనేది కూడా! దాంతో మేం ఎవరం వాడివైపు కన్నెత్తి చూట్టానికైనా కుదర్లేదు!
ఇక ఇలా లాభం లేదని బృహస్పతితో ఆలోచించుకుని, “మనం మనం దాయాదులం. ఈ గొడవలెందుకు? ప్రశాంతంగా అన్ని విషయాలూ మాట్లాడుకుందాం రా” అని నెమ్మదిగా చెప్పి వాడ్ని పట్నంలోకి రప్పించి విడుదులేర్పాటు చేయించా. అప్పుడు చూడాలి వాళ్ళ ఆగడాలు!
“నాకు తేరగా యిచ్చే వస్తువులు యివేనా?” అని కోప్పడే అనామకపు రాక్షసుడొకడు!
“నా విడిదికి రంభని పంపలేదేం?” అని బూతులు తిట్టే అణాకానీ రాక్షసుడొకడు!
“నాకు తగ్గ మర్యాదలు జరగటం లేద”ని మండిపడే నిర్భాగ్యపు రాక్షసుడొకడు!
“నాకు అమృతం పోసి పంపలేదే” అని అదిలించే రక్కస పీనుగొకడు!
వాళ్ళందరికీ సర్ది చెప్పలేక నేను పడ్డ పాట్లు ఎన్నని చెప్పమంటావ్‌! “ఎంత పాపం చేసుకున్న జంతువో కదా నాలా ఇంద్రుడయ్యేది!” అని లెంపలేసుకున్నా.

సరే, అలా కొద్దిరోజులు గడిచాయి.
ఇంతలో నేను భయపడ్ద రోజు రానే వచ్చింది!
ఆ రోజు వాడు ఏకంగా నా మందిరం మీదికే దొమ్మీకొచ్చేడు.
మెరికల్లాంటి రాక్షసులు ద్వారపాలకుల్ని చితగ్గొట్టేరు! సభలో కూర్చుని ఉన్న వాళ్ళని యీడ్చి పారేసి వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు!
దేవతలూ, మునులూ కిక్కురుమనకుండా మూలమూలల్లో బిక్కుబిక్కుమని దాక్కున్నారు!
నా గుండె గుభేల్‌ మంది. “ఇప్పుడు వీడు నన్ను బంధిస్తే దిక్కెవర్రా దేవుడా!” అనుకుంటూ ఆ భయం కప్పిపుచ్చుకోటానికి వాడికి మర్యాదలు చెయ్యమని సేవకుల్ని పురమాయించి కొంత హడావుడి చేశా.ఐతే వాడి ముందు ఆ పప్పులుడికితేనా! “చేసిన మర్యాదలు చాలు. ఐనా నాకు రావాల్సిందాన్ని యింకేవరో నాకిచ్చేదేవిటి నే తీసుకోలేకనా? జాగ్రత్తగా విను. ఒక తండ్రి బిడ్డలం మనం. కనక నువ్వెన్నాళ్ళు స్వర్గాన్ని పాలించేవో నేనూ ఇకనుంచి అన్నాళ్ళు దాన్నిపాలించబోతున్నా. కాదన్నావా, నిన్ను బంధించటం నాకో పని కాదు” అని కర్కశంగా గర్జించేడు వాడు.
నేను మాత్రం నవ్వు నటిస్తూ, “నువ్వన్నట్టు మనం ఒక తండ్రి బిడ్డలం. కనక ఆయన దగ్గరికే వెళ్ళి ఈ విషయం అంతా చెప్పి ఆయన ఎలా చెయ్యమంటే అలా చేద్దాం” అని వాడికి సర్ది చెప్పి మా తండ్రి కశ్యప మహాముని దగ్గరికి తీసుకెళ్ళా. నా అదృష్టం బాగుండి ఆ సమయాన ఆయనో యాగం చేస్తున్నాడు. అదయాక మా తగువు తీరుస్తానని చెప్పి అప్పటిదాకా వజ్రపురంలోనే వుండమని వాణ్ణి ఆజ్ఞాపించేడాయన. ఏ కళనున్నాడో గాని వాడూ దానికి కిక్కురుమనకుండా ఒప్పుకుని తిరిగెళ్తే మేం పులి నోట్లోంచి బయటపడ్డట్టు పడి చావుదప్పి కన్ను లొట్టబోయి స్వర్గానికి చేరుకున్నాం.

                                                                                     మిగతా భాగము రేపటి ప్రభలో చదవండి 

కృష్ణా, ఇదీ ఇప్పటికి జరిగింది! ఐతే, వాడి మనసు ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు మళ్ళీ మా మీదికొస్తాడో ఎవరు చూడొచ్చారు? ఇక నా ఎత్తు బంగారం పోసినా నేను స్వర్గానికి తిరిగిపోయేది లేదు. ఇక్కడే ఉండి నీ కొలువు చేసుకుంటా” అని తన బాధంతా వెళ్ళగక్కేడు ఇంద్రుడు.
కృష్ణుడు చెవులు మూసుకున్నాడా మాటలకి!
“ఏం మాటలివి, నీలాటి వాళ్ళు అనొచ్చునా? ఓడలు బళ్ళౌతాయి, బళ్ళు ఓడలౌతాయి. ఇదివరకు ఎంతమంది వీడి తలదన్నిన రాక్షసులు గర్వంతోటి కన్నూమిన్నూ కానకుండా విర్రవీగలేదు? చివరికి వాళ్ళంతా నాశనం అయ్యారా లేదా? వీడి పనీ అంతే.
ఐతే ప్రస్తుతం వసుదేవుడో యజ్ఞం చెయ్యబోతున్నాడు. అది కావటం తోటే ఏకాగ్రతగా ఈ పని మీదే కూర్చుందాం.ఈలోగా నువు కూడా ఆ వజ్రపురం లోకి ఎలా వెళ్ళొచ్చో, అలా వెళ్ళి వాణ్ణి చంపేవాళ్ళెవరో కాస్త ఆలోచిస్తూ ఉండు” అని ఇంద్రుణ్ణి ఓదార్చి పంపేడు కృష్ణుడు.

ముందు వసుదేవుడి యాగాన్ని విజయవంతంగా చేయించటానికి పూనుకున్నాడు.
కృష్ణుడే స్వయంగా పూనుకున్నాక ఇక చెప్పాలా! ఎలాటి లోటూ లేకుండా పూర్తయ్యింది యాగం.
దేశదేశాల్నుంచీ వచ్చిన బంధుమిత్రులకి రకరకాల బహుమతులిచ్చి ఆనందపరుస్తున్నాడు కృష్ణుడు.
అప్పుడక్కడికొచ్చేడు
భద్రుడనే మహానటుడొకడు!
తన అద్భుతమైన నటనతో, వేషాల్తో అందర్నీ ముగ్ధుల్ని చేసేడు.
ఆ ఆనందంలో వాడికి రకరకాల వరాలిచ్చేరు అక్కడున్న మునులు!
ఎన్నో బహుమానాలిచ్చేరు మిగిలిన వాళ్ళు!
అవి తీసుకుని అతను దాతలందర్నీ ఘనంగా పొగుడ్తూ ఉండగా
కొందరు కోతిమూక బ్రహ్మచారులు వచ్చేరక్కడికి!
దగ్గరున్న మారుగోచులు తీసి వాడి మీద పడేసి, “ఇదుగో, ఈ గోచులు మా బహుమానం! వీటిని తీసుకుని మమ్మల్నీ పొగుడు!” అని నవ్వేరు వాళ్ళు హేళనగా.
భద్రుడు ఆ గోచుల్ని పైకెగరేస్తూ పట్టుకుంటూ వాటితో ఆడుతూ వాళ్ళనీ పొగడ్డం మొదలెట్టేడు. ఐతే వాళ్ళు వచ్చింది అందుకా?
“నీ పొగడ్తలు ఏడిచినట్టే ఉన్నయ్‌. వీటికోసమా నీకు మా గోచుల్నిచ్చుకుంది? నువ్వు ముట్టుకున్న గోచుల్ని తిరిగి తీసుకోలేం గనక యిక్కడే యింకేదన్నా వస్తువు తీసుకుంటాం” అని వాళ్ళు అటూ ఇటూ చూస్తుంటే
“ఈ కుర్రాళ్ళ వాలకం చూస్తుంటే మన సొమ్ములేవన్నా కొట్టేసేట్టున్నారు. జాగ్రత్తగా కనిపెట్టి చూస్తుండం”డని తన మేళగాళ్ళని హెచ్చరించేడు భద్రుడు.
దాంతో ఆ వానరజాతి వాళ్ళు నిప్పులు తొక్కినట్టు గెంతేరు!
“ఎవర్రా దొంగలు? మేమా మీరా? ఏదో నాటకాలాడుతారు గదా అని మిమ్మల్ని అన్ని ఊళ్ళకీ రానిస్తారా, మీరేమో పగలు ఆటల పేరు పెట్టుకుని సందులు గొందులు తిరిగిచూట్టం, రాత్రులు ఇళ్ళకి కన్నాలేసి దొంగతనాలు చెయ్యటం! ఎవరన్నా అడ్దం వస్తే వాళ్ళని చంపటం! మీ సంగతి మాకు తెలీదనుకున్నారా?” అంటూ చిందులేసేరు.

ఆ తమాషా చూస్తున్న కృష్ణుడికి వజ్రపురంలోకి ఎలా వెళ్ళాలా అనే సమస్యకి సమాధానం దొరికింది!
ఇక మిగిలిన సమస్య ఎవర్ని పంపాలా అనేది!

ఈ లోగా ఇంద్రుడు కూడా అదే పన్లో ఉన్నాడు.
ఆకాశగంగలో విహరించే రాజహంసల్ని తన దగ్గరికి పిలిపించాడో రోజు.
“మీతో ఓ ముఖ్యమైన పని వచ్చి పిలిపించా. నేను చెప్పబోయేది అతి రహస్యం సుమా!
కొన్నాళ్ళ నాడు వజ్రనాభుడనే రాక్షసుడు మమ్మల్ని పెట్టిన పాట్లు మీకు తెలుసు. ఇప్పుడు వాణ్ణి చంపటానికి ప్రయత్నాలు జరుగుతున్నయ్‌. ఐతే ఈలోగా వాడేదన్నా అఘాయిత్యం చేస్తే కొంపలు మునుగుతయ్‌. వాడి కొలన్లకి మీవల్ల అలంకారం అని మీరంటే ఆ రాక్షసుడికి ఎంతో ఇష్టం కనక మీరు వజ్రపురంలో తిరుగుతూ అక్కడి సంగతులు కనిపెట్టి నాకు తెలియపర్చాలి.ఈ పని మీవల్లనే కావాలి” అని వాళ్ళకి చెప్పేడు ఇంద్రుడు.
అప్పుడో మగహంస “దేవరా! ఆ వజ్రనాభుడి వాలకం చూస్తే యిక ఎప్పటికీ యీవైపు కన్నెత్తి చూసేట్టు లేడు. అంతే కాకుండా అతని రాజ్యం కూడ ఎక్కువ కాలం ఉండేట్టు లేదని ఏదో విన్నట్టుగా నా భార్య నాతో అంది. తనే ఆ విషయం చెప్తుంది వినండి” అని తన భార్యని పిలిచి “ఇందాక నువ్వు నాతో చెప్పిన విషయం ఆయంతో కూడా చెప్పు” అన్నదా హంస.
శుచిముఖి అనే హంసిక ముందుకొచ్చింది.
“మహారాజా! కడుపు కక్కుర్తి కోసం మేం మీ శత్రువైన ఆ వజ్రనాభుడి నగరానికి వెళ్తుంటాం. మమ్మల్నిక్షమించు. పోనీ మానేద్దామా అంటే ఆకాశగంగలో మేలైన బంగారు తామరలన్నీ అతనే కోసుకుపోయె! మానస సరోవరంలో రుచికరమైన తామరతూళ్ళే లేకుండా చేశాడాయె! బిందుసరంలో బంగారు తామరనేది మిగల్చలేదాయె! సౌగంధికా సరస్సులో నీళ్ళు తప్ప మరేం లేవాయె! అన్ని దివ్యసరసుల్లోంచి బంగారుతామర జాతులన్నిట్నీ తన కొలన్లలో నాటుకున్నాడాయె! మరి మాకు పొట్ట గడిచేదెలాగ? అంచేత తన కొలన్లలో తిరగటానికి అతన్ని అనుమతి అడిగేం. అతను కూడ మేం తిరుగుతుంటే ఆ కొలన్లు కన్నుల పండగ్గా ఉంటాయని ఆ నగరంలో ఏ కొలన్లోకైనా వెళ్ళొచ్చని మాకు సెలవిచ్చేడు!

నిన్న మేం కన్యాంతఃపురంలో ఓ కొలన్లో ఉన్నప్పుడు ఓ విచిత్రం జరిగింది.
సామ్రాజ్యలక్ష్మిలా ఉన్న ఓ కన్య తన చెలికత్తెతో వచ్చి ఆ కొలను పక్కనే గురివింద పొదరింట్లో కూర్చుంది!కూర్చుని, చెలికత్తెతో, “వేకువజామున నాకో అద్భుతమైన కలొచ్చింది. ఇలాటి సంఘటన ఎప్పుడూ ఎక్కడా విన్నదీ కన్నదీ కాదు. నిజానికి సగం కల, సగం నిజం..” అంటూ సిగ్గు పడి ఆపేసింది. ఐతే ఆ చెలికత్తె వదలకుండా “మన్లో మనకి ఎలాటి రహస్యాలు ఉండవని ఒట్టేసుకున్నాం కదా! చెప్పాల్సిందే” అని పట్టు పట్టింది. దానికా కన్య, “హిమగిరిరాజ కన్యక ఆ పరమేశ్వరి నా కల్లో కనిపించి చిరునవ్వుతో దగ్గరికి పిల్చింది. ఓ చేత్తో నా ఒళ్ళు నిముర్తూ, “నీకొక భర్తని చూసేను, తెలుసా!” అంటూ ఒక్క క్షణంలో సంకల్పమాత్రంగా ఓ బొమ్మని గీసి నాకిస్తూ, “ఇతనే నీ భర్త. ప్రద్యుమ్నుడనే రాకుమారుడు. మీ యిద్దరికీ పుట్టే బిడ్డ యీ రాజ్యానికి రాజౌతాడు” అని చెప్పింది. గమ్మత్తేమిటంటే, ఆ బొమ్మ ఇంకా నా దగ్గరే ఉంది” అని వివరించిందా కన్య తన కలని!
ఆ దగ్గర్లో ఉండి అంతా విన్నాన్నేను!
ఆ అమ్మాయి పేరు ప్రభావతని, ఆమె వజ్రనాభుడి కూతురని వాళ్ళ మాటల బట్టి నాకు తెలిసింది.
దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆ వజ్రనాభుడికి ఇంక ఎక్కువ కాలం లేదని!
అంతే కదా మరి ఆ అమ్మాయి భర్త ప్రద్యుమ్నుడన్న పార్వతి మాట అబద్ధం కాబోదు.
కృష్ణుడి కొడుకైన ప్రద్యుమ్నుడికి ఆ రాక్షసుడు తనంత తను పిల్లనివ్వడు.
ప్రద్యుమ్నుడు ఆ ప్రభావతికి భర్త కావాలంటే అతనికీ వజ్రనాభుడికీ యుద్ధం తప్పదు.
ప్రద్యుమ్నుడి కొడుకు రాజు కావాలంటే మరి ఆ వజ్రనాభుడికి యుద్ధంలో అపజయం కలగాల్సిందే.
ప్రద్యుమ్నుడి చిత్రం ప్రభావతి దగ్గర ఉండటం నిజం కాబట్టి ఆమె కల కూడా నిజమే అయుండాలి! అదీ తెల్లవారుజామున వచ్చిన కల గనక ఈ విశేషాలు తొందర్లోనే జరగబోతూ ఉండాలి.
దేవేంద్రా! నువ్వే ఆలోచించి చూడు!

ఆ అమ్మాయి వజ్రనాభుడి కూతురని ఎలా తెలిసిందో చెప్తాను నీకేమైనా పనికొస్తుందేమో!” అంటూ ఆ విషయం ఇలా చెప్పింది శుచిముఖి.

ఆ అమ్మాయి అలా తన కల గురించి చెప్తే, చెలికత్తె, “నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. అసలే పార్వతి వరాన పుట్టేవు. నీమీద ఆమెకి ఎంత అనుగ్రహం లేకపోతే యిలా నీ భర్త చిత్రాన్ని స్వయంగా వేసి మరీ ఇస్తుంది చెప్పు! కాకపోతే ఓ మాట. పోతుటీగ కూడా దూరటానికి వీల్లేని ఈ అంతఃపురంలో ఇలాటి బొమ్మ కనిపిస్తే నీ తండ్రి వజ్రనాభుడు అగ్గిబుగ్గౌతాడు.పార్వతి పేరు చెప్పి ఎవరో యిక్కడున్న వాళ్ళే యీ బొమ్మ వేసేరని చెప్పి ముందు మా అంతు చూస్తాడు. కనక దీన్నిమనిద్దరం తప్ప యింకెవరూ చూట్టానికి వీల్లేదు. ఎక్కడ పెట్టేవో తీసుకొచ్చి ఒక్కసారి నాకు చూపించు. నీ అందానికి తగ్గవాడు అసలీ సృష్టిలో ఉన్నాడా అని నా అనుమానం. మరి ఆ దేవి గీసిన వ్యక్తి ఎలా ఉంటాడో చూసేదాకా నేనాగలేను” అంది. అప్పుడా ప్రభావతి వెళ్ళి ఒక్కక్షణంలో ఆ చిత్రాన్ని తెచ్చి చూపించింది.
ఎంత గొప్పగా ఉందో అది!
జీవకళ ఉట్టిపడుతూ నిజంగా అతనే వచ్చి ఎదురుగా ఉన్నట్టనిపించింది!
“సరిగ్గా మీ ఇద్దర్నీ ఒకరికొకరికి యీడూ జోడుగా సృష్టించాడు బ్రహ్మ! ఏమాత్రం సందేహం లేదు!” అన్నదా చెలికత్తె ఆ చిత్రాన్ని కళ్ళార్పకుండా చూస్తూ.
“నీ మాటలకేం గాని, నిజంగా ఈ చిత్రంలో వున్నలాటి వ్యక్తే గనక ఉంటే నా అందం అతని కాలిగోటికైనా సరిపోతుందా?” అంది ప్రభావతి ఆశ్చర్యం తోనూ ఆనందంతోనూ!
అప్పుడామె మాట్టాడిన రకరకాల మాటల బట్టి నాకర్థమైంది ప్రద్యుమ్నుణ్ణి త్వరలో కలుసుకోవటానికి ప్రభావతి తన చేతనైన ప్రయత్నాలన్నీ చెయ్యబోతోందని! ఈ వర్తమానం మీ పనికి ఉపయోగిస్తుందనే అనుకుంటా” అని ముగించింది శుచిముఖి.

శుచిముఖి మాటలు విన్న ఇంద్రుడికి మహానందమైంది తన పని జరిగే అవకాశం కనిపిస్తున్నందుకే కాదు,శుఖిముఖి మాటల చాతుర్యానికి కూడ! “నీలా మాట్టాడ గలగటానికి ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని ఉండాలి!ఎంత ముచ్చటగా ఉన్నయ్‌ నీ మాటలు! అసలు నువ్వో హంసవు కావు, సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవివో లేక ఆమె స్వయంగా తయారుచేసిన కవివో!” అని ఆశ్చర్యపోయేడతను.
“నీ మాటల్లో ఏమీ అబద్ధం లేదు. బ్రహ్మ రథాన్ని తిప్పే హంస సారంగధరుడి బిడ్డని నేను. ఆ శారదాదేవే నన్ను పెంచి అన్ని విద్యలూ నేర్పింది” అంది శుచిముఖి వినయంగా.
“అందుకే నువ్వింత గొప్పదానివయ్యేవ్‌. ఇక ఈ పని పూర్తి చేసే బాధ్యత నీకే అప్పగిస్తున్నా. ఎలాగైనా సరే ప్రభావతికీ ప్రద్యుమ్నుడికీ ప్రేమ కలిగించి వాళ్ళిద్దరూ త్వరలోనే కలుసుకునే మార్గం నువ్వే చూడాలి .. కనక వెంటనే నేను పంపేనని చెప్పి కృష్ణుడి ఆలోచన కూడ తీసుకుని వజ్రపురానికి వెళ్ళు” అని శుచిముఖిని కోరి మిగతా హంసల్తో, “యిక నుంచి మీరు శుచిముఖి మాట ప్రకారం నడుచుకుని దేవకార్యం అయ్యేట్టు చూడండి” అని ఆజ్ఞాపించేడు ఇంద్రుడు.

హంసలన్నీ ద్వారకానగరానికి దారి తీసేయి.
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, ఈమాట సౌజన్యంతో
-------------------------------------------------------

” ప్రభావతీ ప్రద్యుమ్నం” 3

సాహితీమిత్రులారా!
ప్రభావతీ ప్రద్యమ్నం మూడవ  భాగం ఆస్వాదించండి-

తలగడగా రుక్మిణి తొడలు. కాళ్ళొత్తుతూ సత్యభామ. సురటి (గుండ్రటి విసనకర్ర)తో భద్ర. వింజామర వీస్తూ మిత్రవింద. కాళంజి (తాంబూలం వూసే పాత్ర) ధరించి కాళింది. తమలపాకులిస్తూ జాంబవతి. గొడుగు, పాంకోళ్ళు పట్టుకుని నాగ్నజితి. నీళ్ళ గిన్నెతో లక్షణ మెరుపుతీగల పక్క నల్లమబ్బులాగా అష్టభార్యల్తో కృష్ణుడుంటే నిండు నెలవంకలా అక్కడికొచ్చింది శుచిముఖి!
ఆడవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు అలా నదురు బెదురూ లేకుండా వస్తున్న రాజహంసిని చూసి.
కృష్ణుడి దగ్గరగా వెళ్ళి “ఇంద్రుడు పంపగా వచ్చేను ఓ మాట చెప్పి వెళ్దామని ఏకాంతంగా!” అంది శుచిముఖి తన కొడుకుని రాక్షసుడి మీదికి పంపటం రుక్మిణికి నచ్చకపోవచ్చని అనుమానిస్తూ.
దాని ఆలోచనకి ముచ్చట పడి లేచి కూర్చున్నాడు కృష్ణుడు.
అతని భార్యలంతా దూరంగా వెళ్ళేరు.
ఇంద్రుడు తనని పిలిపించిందగ్గర్నుంచి జరిగిందంతా వినిపించింది శుచిముఖి.
చిరునవ్వుతో కృష్ణుడు, “ఔను. ఇది మంచి ఆలోచన. ప్రభావతికి భర్తయ్యే వాడు నిశ్చయంగా ప్రద్యుమ్నుడే! అందగాడు,వీరుడు, రాక్షసుల కన్న ఎక్కువగా మాయలు నేర్చిన వాడు! తప్పకుండా ఆ వజ్రనాభుణ్ణి చంపుతాడు! .. ఇక ఆ వజ్రపురానికి వెళ్ళటానికి దారి కూడ సిద్ధం చేసేన్నేను. భద్రుడనే నటుడు నా తండ్రి యాగానికి వచ్చి తన ఆటల్తో మునుల్ని మెప్పించి ఎన్నో వరాలు పొందేడు. వాటి వల్ల ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతూ ప్రదర్శన లిస్తున్నాడు. నువ్వు వజ్రనాభుడికి అతని గురించి చెప్పి అతన్ని వజ్రపురానికి ఆహ్వానించేట్టు చెయ్యి. ప్రద్యుమ్నుడు భద్రుడిగా అక్కడికొస్తాడు… ఇక నువ్వు వెళ్ళి ఆ పని జరిగేట్టు చూడు” అని ఆదేశించేడు.

వజ్రపురం వైపుకు బయల్దేరేయి హంసలన్నీ.

ద్వారకానగరం బయట
ఆటలాడుతున్నాడు ప్రద్యుమ్నుడు
తనెక్కిన గుర్రం తన మనసు తెలుసుకుని పరిగిడుతుంటే బంతిని కింద పడకుండా బంగారు కోలతో కొడుతూ!
బంతిని నేలకి కొట్టి అది పైకి లేస్తే దాన్ని కొట్టటం ఎవరైనా చేస్తారు. అతనలా కాకుండా బంతిని వేగంగా పైకెగరేసి అది కింద పడకుండా కొడుతూ ఆకాశంలోనే ఉంచి అడుతున్నాడు వాయువేగంతో గుర్రం మీద అటూ ఇటూ తిరుగుతూ! చూసేవాళ్ళు అతని వేగానికి, చాతుర్యానికి ముగ్ధులౌతున్నారు.
కాసేపలా ఆడి తృప్తిగా ఆపి గుర్రం దిగేడు.

పైనుంచి ఇదంతా చూసింది శుచిముఖి.
“మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా. ఇతంతో రెండు మాటలు మాట్టాడి వెళ్దాం” అంది పెద్దగా, అతనికి వినపడేటట్టుగా.
అంటూండగనే హంసలన్నీ కిందికి దిగేయి, అతనికి దగ్గర్లో!
కుతూహలంగా వాళ్ళని చూస్తూ, “ఇక్కడెవర్తోనో మాట్టాడాలన్నారు కదా! ఎవరతను? ఏ పని మీద వెళ్తున్నారు మీరు?” అనడిగాడతను.
మనోహరమైన స్వరంతో శుచిముఖి చెప్పింది “ఇంకెవర్తోనో కాదు, నీతోనే మా పని! ఇంద్రుడు పంపితే నీ తండ్రి దగ్గరికొచ్చి వాళ్ళిద్దరి ఆజ్ఞలు తీసుకుని ఓ చోటికి వెళ్ళబోతున్నాం. కృష్ణుడికి కుడిభుజం లాంటి వాడివి నువ్వు. కనక ఓ సారి నిన్నూ పలకరించి వెళ్దామని దిగేం. వస్తాం మరి”
“మీ పని గురించి అడగను గాని, ఇందాక “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నారు కదా! నా విషయం ఎందుకొచ్చిందో ఎక్కడొచ్చిందో ఐనా నాకు చెప్పకూడదా?”
“అది రహస్యం. పైగా ఒక్క క్షణం కూడ ఆలస్యం చెయ్‌ కూడదు మేం. కాని నీకూ కృష్ణుడికీ తేడా లేదు గనక యిదివరకు నీ విషయం ఎక్కడొచ్చిందో చెప్తా” అంటూ అనుమానంగా చుట్టూ చూసింది శుచిముఖి. దాని చూపు వెంటనే తిరిగిందతని చూపు కూడ. ఆ చూపు తోటే దూరంగా తప్పుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా.
“వజ్రనాభుడనే రాక్షసుణ్ణి చంపటానికి ఇంద్రుడూ, నీ తండ్రీ కలిసి చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఐతే వీళ్ళ కన్నా ముందు వాడే ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమో కనిపెట్టమని పంపితే మేం యిప్పుడా వజ్రనాభుడి పురానికి పోతున్నాం” అంది శుచిముఖి గుట్టుగా.
“ఇంత చిన్న పనికి వాళ్ళిద్దరూ ఇన్నాళ్ళు ఆలోచించాలా? నన్నొకణ్ణి పంపితే ఎప్పుడో పూర్తిచేసేవాణ్ణే!” అన్నాడు ప్రద్యుమ్నుడు బాధ పడుతూ.
“నిజంగా వీరుడివంటే నువ్వు. ఇంద్రుడూ, కృష్ణుడూ కూడ చాలా రోజులుగా ఆలోచిస్తున్నారంటే ఆ రాక్షసుడెలాటి వాడో అన్న ఆలోచనైనా లేకుండా ఒక్కడివే వెళ్ళి వాణ్ణి చంపుతానంటున్నావ్‌!.. సరే, యిదివరకు నీ విషయం ఎందుకొచ్చిందో చెప్తా. ఆ మధ్య ఓ సారి వజ్రపురానికి వెళ్ళినప్పుడు ఆ వజ్రనాభుడి కూతుర్ని చూసేన్నేను. ఆమె అందం గురించి చెప్పాలంటే లోకాలన్నీ చూసిన నాకే మాటలు దొరకటం లేదు! ఏవైనా ఉపమానాలు వాడి వర్ణిద్దామంటే సిగ్గేస్తోంది! ఎంత చెప్పినా ఆ అందం దానికి కోటి రెట్లుంటుంది! .. నాకు భాషలో పాండిత్యం లేక్కాదు చెప్పలేంది సరస్వతీ దేవి స్వయంగా తనంత దానిగా చేసింది నన్ను… అసలు, గొప్ప శబ్దసంస్కారం ఉంది గనకే నాకు “శుచిముఖి” అని పేరు పెట్టిందా దేవి. ఓ రోజు తన పెంపుడు చిలక్కీ నాకూ కవిత్వంలో పోటీపెట్టి నన్ను మెచ్చుకుని “ఉపమాతిశయోక్తి కామధేను” అనే బిరుదు కూడ స్వయంగా తన చేత్తో రాసి నా కాలికి తొడిగింది. కావాలంటే ఇదుగో చూడు” అంటూ తన బిరుదు నూపురం అతనికి చూపించింది శుచిముఖి. “అలాటి నాకే ఆ కన్య రూపం వర్ణించటం అలివి కాని పని. పోనీ బొమ్మ గీద్దామా అంటే బ్రహ్మకే అలాటి దాన్ని మరొకర్ని సృష్టించటం చేతకాలేదంటే ఇక గియ్యటం నా వల్లనౌతుందా? .. అసలు బ్రహ్మే ఓ సారి అంటుంటే విన్నా, ఆమెని తను సృష్టించ లేదని, పార్వతీదేవే సృష్టించిందని! అన్నట్టు నీకు చెప్పలేదు గదూ, ఆమె పేరు ప్రభావతి. ఆ ప్రభావతి తన కల్లో ఆ పరమేశ్వరి రాసిచ్చిందని తన చెలికత్తెకి ఓ చిత్రపటం చూపిస్తుంటే చూసేన్నేను. ఆ బొమ్మలో ఉన్నతను అచ్చం నీ పోలికల్తోనే ఉన్నాడు. దాని గురించే “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నదిందాక… సరే,ఇప్పటికే చాలా ఆలస్యం ఐంది. ఇంక వస్తాం” అంటూ ఆకాశాని కెగిరింది శుచిముఖి మిగిలిన హంసల్తో.

వజ్రపురానికి చేరి కన్యాంతఃపురంలో కొలన్లలో తిరగసాగేయవి!

ఇక్కడ ప్రద్యుమ్నుడు ప్రభావతి గురించి శుచిముఖి చెప్పిందంతా మళ్ళీ మళ్ళీ తల్చుకుంటూ ఉంటే, ఆమెని చూడకపోయినా ఆశ్చర్యంగా ఆమె రూపం అతని మనసులో హత్తుకుంది! చుట్టూ ఉన్నవాళ్ళని, పరిసరాల్ని మర్చిపోయి ప్రభావతినే తల్చుకుంటూ బాధపడసాగేడతను “అయ్యో, ఆ శుచిముఖి నాలాటి వాణ్ణే చిత్రంలో చూశానంటే ఆ విషయం ఏదో ఖచ్చితంగా కనుక్కుని ఉండొచ్చు కదా! ఆ హంస ఏమనుకుందో గాని ఆ తర్వాత ఒక్క క్షణం నిలబడకుండా ఎగిరిపోయింది! ఆలోచించి చూస్తే అది ప్రభావతి అందాన్ని నా దగ్గర అంతగా వర్ణించటానికి కారణం నా స్పందన ఎలా వుంటుందో చూడ్డానికిలా ఉంది. అది తనంత తనే ఇక్కడ దిగి నా తండ్రీ, ఇంద్రుడూ కలిసి వజ్రనాభుణ్ణి చంపే ఆలోచనలో ఉన్నట్టు చెప్పటం, నేను నా తండ్రికి కుడిభుజం లాంటి వాణ్ణని అనటం వీటిని బట్టి ఆ వజ్రపురానికి వాళ్ళు నన్ను పంపాలని అనుకుంటున్నట్టు కూడా అనిపిస్తోంది. ఆ విషయం తెలిసిన హంస నాకా కన్య చక్కదనాన్ని గురించి అంతగా చెప్పిందంటే ఆ చిత్రం నాదేనని నమ్మకం కలుగుతోంది! ఐనా, ఆ హంస ప్రభావతి తన సృష్టి కాదని బ్రహ్మ అంటుంటే విన్నానంది కదా! అప్పుడతను ఆమెక్కాబోయే భర్త ఎవరో కూడా చెప్పాడేమో ఆ హంసని అడిగుండొచ్చు కదా, నా బుద్ధి ఏమైపోయింది? ఇక ఇప్పుడా హంస మళ్ళీ ప్రభావతి దగ్గరికి వెళ్తుందో లేదో!” 
                                                                                                 ఇంకా ఉంది 
                                                                                
ఉద్యానవనంలో తిరుగుతున్నాడతను. పూలలో, లతల్లో, కొమ్మల్లో, ప్రకృతి అంతట్లో ప్రభావతే కన్పిస్తోంది! ఇలా లాభం లేదని తన విషయం అంతా ఆ హంసకి ఓ లేఖ రాసి పంపుదామనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం రాసేశేడు.ఐతే దాన్ని శుచిముఖికి తీసుకెళ్ళి ఇచ్చేదెవరు?

విరహంతో అతని వివేకం నశించిపోతోంది. లేఖని తీసుకెళ్ళగలరా లేదా అన్న ఆలోచన లేకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళే వాళ్ళందర్నీ పిల్చి వజ్రపురానికి వెళ్తున్నారా అంటూ అడగసాగేడతను చిలకల్ని, తుమ్మెదల్ని,కోయిలల్ని, గాలుల్ని, మేఘాల్ని, హంసల్ని!

హఠాత్తుగా ఓ చిలక ఆకాశాన ఎగుర్తూ అతని పరిస్థితి చూసి ఆగింది. “నేను వజ్రపురానికే వెళ్తున్నా. నీ పనేవిటో రెండు మూడు ముక్కల్లో టక్కున చెప్పెయ్‌.” అన్నదది హడావుడిగా. “ఈ లేఖని అక్కడున్న శుచిముఖి అనే హంసకివ్వాలి, అంతే” అన్నాడతను ఆనందంగా. “సరే ఐతే. ఎవరికీ కనపడకుండా నా రెక్కల మధ్య ఉండేట్టు దాన్నిచకచక కట్టెయ్‌” అంటూ అతని దగ్గర వాలిందది. అతను అలా చెయ్యటం, అది ఎగిరి పోవటం క్షణంలో జరిగేయి.

ఈలోగా శుచిముఖి ప్రభావతితో పరిచయం కలిగించుకోటానికి సరైన అవకాశం కోసం చూస్తోంది. ప్రభావతి మళ్ళీ అదివరకు వచ్చిన సరస్సు దగ్గరికే వచ్చిందో రోజు.

ఆమె కూడ ప్రద్యుమ్నుడి గురించిన కలవరింతల్లోనే ఉంది!
మళ్ళీ ఓ సారి అతని చిత్రాన్ని చూస్తేనన్నా తాపం కొంత తగ్గుతుందని దాన్ని తెప్పించి చూసుకుంది, ఇంకా విరహంలో మునిగిపోయింది!
ఇదే సరైన సమయం అని వాళ్ళ దగ్గరగా వెళ్ళింది శుచిముఖి!
రకరకాలుగా అనేక చోట్ల నుంచి ఆ చిత్రం వంక చూస్తూ ఏదో ఆలోచనలో వున్నట్టు నటిస్తూ అటూ ఇటూ నడవసాగింది.
అది గమనించింది ప్రభావతి!
“ఈ పక్షికి ఏం తెలుసో, పదేపదే ఈ చిత్రాన్నిలా చూస్తోంది!” అంది తన చెలికత్తెతో.
వెంటనే అందుకుంది శుచిముఖి!
“ఆ చిత్రాన్ని నేనింతగా చూట్టానికి కారణం ఉంది! ఇదివరకు నేనొక అందగాణ్ణి చూశా. అంత అందం ఉన్న మనిషి నాకు మళ్ళీ కనిపించనే లేదు! ఇప్పుడీ చిత్రం అతందిలా అనిపిస్తే, అతని బొమ్మేనా, లేక యింకెవరైనా అలాటి వాళ్ళున్నారా అని ఆలోచిస్తున్నా, అంతే” అని చెప్పీచెప్పనట్టుగా చెప్పింది.
ప్రభావతికి ఎక్కడలేని కుతూహలం కలిగిందా మాటల్తో.
“ఏమిటేమిటీ, మళ్ళీ చెప్పు! ఇలా వచ్చి జాగ్రత్తగా దగ్గరగా గమనించి చూడు అతనో కాదో! మా దగ్గరికి రావొచ్చు,నీకేం భయం అక్కర్లేదు” అంది కంగారుగా.
“మనుషుల్ని చూట్టంతోనే వాళ్ళకి భయపడాలో లేదో చెప్పగలన్నేను. కాకపోతే మీరిద్దరూ ఏకాంతంగా మాట్టాడుకుంటుంటే మీరు పిలవకుండా మీ మధ్య కొచ్చేంత అమర్యాదస్తురాల్ని కాను గనక యిప్పటి దాకా ఆగా” అంది శుచిముఖి ఖచ్చితంగా.
ఆ మాటలకి ఆశ్చర్యపడిపోయారు వాళ్ళిద్దరూ!
“నువ్వు నిజంగా బుద్ధిమంతురాలివి. ఇలాటి వ్యక్తి ఉన్నాడా లేడా అని మేం పందెం వేసుకున్నాం. ఒక్కసారి చూసి చెప్పు” అని బతిమాలింది చెలికత్తె రాగవల్లరి.
“పందెం కోసమో మరోదాని కోసమో నాకెందుకు? బొమ్మని చూడమని కోరేరు, చూస్తా” అంటూ దగ్గరగా చూసి,
“సందేహం లేదు, అతనే ఇతను” అని తీర్పిచ్చింది శుచిముఖి.
పొంగిపోయింది రాగవల్లరి. జాగ్రత్తగా ఆ హంసనెత్తుకుని ప్రభావతి దగ్గరి కెళ్ళింది, “నిజంగా నువ్వు నాపాలిటి దేవతవి, నా పందెం గెలిపించావ్‌” అని దాన్ని ముద్దు చేస్తూ.
“ఉండుండు, ఈ చిత్రంలో అతని గుర్తులేవైనా కనిపిస్తున్నాయేమోకనుక్కుందాం” అంది ప్రభావతి అసహనంగా.
“ఇంకా అనుమానం ఎందుకు? అవిగో అతని వక్షాన ఉన్నవి శంకరుడితో యుద్ధం నాటి దెబ్బల గుర్తులు! మెడమీద రతీదేవి కంకణాల ముద్రలు కూడ కన్పిస్తున్నాయి! ఈ బొమ్మ వేసిందెవరో అతన్ని బాగా ఎరిగిన వాళ్ళే!” అంటూ,”ఏదేమైనా మీ పందెం తేలటానికి యిప్పటికి నేనిచ్చిన సమాచారం చాలు. మిగిలిన విషయాలు మీకక్కర్లేదులే” అని పైకెగరబోయింది శుచిముఖి. సున్నితంగా పట్టి ఆపింది ప్రభావతి. “దయచేసి మమ్మల్నొదిలి వెళ్ళకు. మాతో స్నేహం చెయ్యవా?” అనడిగిందా హంసని జాలిగా. “మీరిద్దరూ రహస్యాలు మాట్టాడుకుంటుంటే మధ్యలో నేనెందుకు? ఇంక వెళ్ళొస్తా” అని బయల్దేరబోయింది శుచిముఖి మళ్ళీ. “మాట్టాడితే పోతాపోతానంటావ్‌! నువ్వుండటం మా ఏకాంతానికి అడ్డం కాదు. నిజానికి మంచిది కూడా. ఈ చిత్రంలో ఉన్నతని మీద మా ప్రభావతి ఆశలన్నీ పెట్టుకుని ఉంది. అతని విషయాలన్నీ మాకు చెప్పాలి నువ్వు. అప్పుడు గాని ఆమె ప్రాణాలు నిలబడవు. ఆ తర్వాత మా రహస్యం అంతా నీకు చెప్తాం” అని ప్రాధేయపడింది రాగవల్లరి.

ఇక తన వంకరమాటలు ఆపొచ్చని గ్రహించింది శుచిముఖి.
“సరే చెప్తా వినండి. ద్వారకానగరం అనే అద్భుత పట్టణానికి రాజు కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణువు. అతనికి ఎనిమిది మంది భార్యలు. వాళ్ళలో పెద్ద భార్య రుక్మిణీ దేవి. ఆమె కొడుకే ఈ చిత్రంలో ఉన్న ప్రద్యుమ్నుడు. సౌందర్యానికి సరిపడే మంచి గుణాలున్నవాడు” అంటూండగా ప్రభావతి పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది.
“ఇంకేం, పార్వతీదేవి చెప్పిన పేరు కూడా సరిపోయింది! ఈ హంస వాలకం చూస్తుంటే ఇక మిగిలిన పని కూడా సాధించే చాతుర్యం వున్న దాన్లానే ఉంది” అంది రాగవల్లరి కూడా సంతోషంగా. ఇంతలో శుచిముఖి కాలికున్న పెండెరం కనిపించిందామెకి. గబగబ దాన్ని చదివి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ “ప్రభావతీ! మన పని చేసిపెట్టటానికి ఇంతకు మించిన వాళ్ళు దొరకరు” అని చెప్తూ శుచిముఖికి ప్రభావతి కల విషయం, ఆ తర్వాత జరిగిన విషయాలూ అన్నీ చెప్పేసింది.శుచిముఖి కూడా తను ఆమె విషయం అంతకు ముందే ప్రద్యుమ్నుడికి చెప్పినట్టు, ఐతే అతను దానికి ఏమీ స్పందించనట్టూ చెప్పేసరికి
ప్రభావతి తెల్లబోయింది.
శుచిముఖి వెంటనే, “రాకుమారీ, నీకేం భయం అక్కర్లేదు. అతను కాకపోతేయేం? ఏ లోకంలో ఉన్నవాణ్ణైనా ఎవర్నైనా మరొకర్ని కోరుకో. అతన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. పార్వతీదేవి అందుకు ఒప్పుకోదేమో అని సందేహం వద్దు నీకు. నీ ఇష్టమే ఆమె ఇష్టం … నీ అందాన్ని అంతగా వర్ణించినా కిక్కురుమనకుండా ప్రద్యుమ్నుడున్నాడంటే అదతని సౌందర్య గర్వం. నీ సంగతి నీకు తెలీకపోవచ్చు గాని నిన్ను గురించి నేను వర్ణిస్తే విని నీ కాళ్ళ మీద వచ్చి వాలని వాడు ఏలోకంలోనూ ఇంకెవడూ ఉండడు. నువ్వు కావాలంటే నా ప్రయాణాల్లో చూసిన చక్కటి యువకుల చిత్రాలు రాయించి తెస్తా. నువ్వు ఊఁ అను చాలు” అని హుషారుచేసింది.
ప్రభావతికి నచ్చలేదా మాటలు.
“అంతా విని మళ్ళీ యిలా అడ్డంగా మాట్టాడతావేం? ఐనా నువ్వు తెచ్చేదేమిటి నా తండ్రే యింతకు ముందు అన్ని లోకాల్లోనూ ఉన్న యువకుల చిత్రాలు రాయించి చూపించేడు నాకు. వాళ్ళెవర్నీ ఒక్క చూపు మించి చూడలేదు నేను.తనకి శత్రువని ఈ ప్రద్యుమ్నుడి చిత్రం మాత్రం చూపించలేదతను. ఏదేమైనా నా ప్రతిజ్ఞ విను ఎన్ని జన్మలకైనా ఆ ప్రద్యుమ్నుడే నా భర్త!” అని నిశ్చయంగా తెగేసి చెప్పింది ప్రభావతి.

కొంచెం సేపు ఆలోచించి, “శుచిముఖీ! నాకొక్క ఉపకారం చేసి పెట్టు. ఇంకో సారి నువ్వు ద్వారకకి వెళ్ళి ప్రద్యుమ్నుడితో నా విషయం చెప్పి చూడు. ఆ తర్వాత ఎలా జరగాలో అలా జరుగుతుంది” అంది ఆఖరిప్రయత్నంగా.
ఆమెకి ప్రద్యుమ్నుడి మీద ఎంత ప్రేమ కలిగిందో స్పష్టంగా అర్థమైంది శుచిముఖికి.
“ప్రభావతీ! నీ ప్రేమ ఎంత లోతైందో చూట్టానికి నీకిష్టం లేని కొన్ని మాటలన్నా, క్షమించు. ప్రద్యుమ్నుడిని నీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాకొదిలిపెట్టు. అప్పుడేదో పరాకున ఉండి అతను మాట్టాడలేదు గాని అతను నీ భర్త కాక తప్పదు. ఎందుకంటే, ఒకసారి బ్రహ్మకీ సరస్వతికీ ప్రణయకలహం వచ్చి ఆమె అలిగితే అమెకి సర్దిచెప్పటానికి అతను నన్ను పిలిచేడు. ఆ మాటల సందర్భంలో మన్మథుణ్ణి తిడుతూ, “ఒరేయ్‌ మన్మథా! నన్నింత బాధిస్తున్నావిప్పుడు. నీక్కూడా తొందర్లో ప్రభావతి విరహంతో వేగే రోజులొస్తున్నాయిలే చూసుకో!” అన్నాడు. ఆ మన్మథుడే ఈ జన్మలో ప్రద్యుమ్నుడు. కనక, అతనిప్పుడు నీ విరహంతో బాధ పడుతుంటాడని తెలుస్తోంది కదా! ఇక నే త్వరగా వెళ్ళి ఆ విషయం చూస్తా” అంది శుచిముఖి ఆమెని ఓదారుస్తూ.

ఐతే ప్రభావతికి నమ్మకం కలగలేదు. “ఈ హంస అక్కడికి వెళ్ళేదెప్పటికి? వెళ్ళి అతన్ని చూడాలి. అతనికి నామీద కోరిక కలగాలి. ఇక్కడికి రావటానికి అతని తండ్రి ఒప్పుకోవాలి. ఇక్కడ నా తండ్రి అతను రావటానికి ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగేదెప్పుడు? నాకోరిక తీరేదెప్పుడు?” అంటూ దిగాలుపడిపోయింది.
అంతలో
ఓ చిలక రెక్కలు టపటప కొట్టుకుంటూ కేకలు పెట్టింది ఎదురుగా ఉన్న ఓ చెట్టు మీద వల్లో తగులుకుని!
అంత దిగుల్లోనూ దాని అవస్థకి మనసు కరిగి దాన్ని విడిపిద్దామని పరిగెత్తింది ప్రభావతి. దాన్ని వల్లోంచి తప్పించింది.
ఐతే హడావుడిగా ఆమె చేతులు విడిపించుకుని వేగంగా ఎగిరిపోయిందా చిలక, ఆమెకి తన ముఖం చూపించకూడదన్నట్టుగా!
ఆ గడబిడలో జారిపడిందో లేఖ, దాని రెక్కల్లోంచి!
“శుచిముఖీ, ఇదేదో విచిత్రంగా ఉందే! నువ్వెళ్ళి ఆ చిలకని పట్టుకురాగలవా?” అనడిగింది ప్రభావతి. “అదెంత పని? ఇప్పుడే తెస్తా” అని చిలక వెంట పడిందా రాజహంసి.
“ఇంతకీ యీ చెట్టు మీద వలెవరు పెట్టారో, దుష్టులు!” అని ప్రభావతి కోపగించుకుంటే,
“కోయిల్లొచ్చి కూసి నీ విరహాన్ని పెంచుతున్నాయని వాటిని పట్టటానికి నేనే పెట్టా .. సరేగాని, యీ లేఖలో ఏవుందో చూద్దామా?” అని దాన్ని లాక్కుంది రాగవల్లరి.
ఇలా ఉంది దాన్లో
“సరస్వతీదేవి చేత ఉపమాతిశయోక్తి కామధేను బిరుదు పొందిన శుచిముఖికి ప్రద్యుమ్నుడు స్నేహపురస్సరంగా పంపిన రహస్యలేఖ. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ ..” అని చదువుతూనే ఆనందంగా గెంతుతూ,
“నిన్ను గురించి నీ ప్రియుడు పంపిందే యీ ఉత్తరం. నీ అదృష్టం పండింది” అనరిచింది రాగవల్లరి.
“నువ్వు చదివింది నిజంగా దాన్లో ఉందేనా?”
“దేవుడి మీద ఒట్టు, నిజం”
“ఐతే ఆ ప్రప్రభాభావతి ఎవరో! ఇంకా ఏముందో చూడు” అని ప్రభావతి అంటే, “నీ వెర్రి గాని అది నీపేరే. కంగారులో అలా రాశాడంతే. చదువుతా విను. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ తలుచుకునే కొద్దీ నా మనసంతా ఆమే నిండిపోయి విరహంతో కాగిపోతున్నా. ఆమె అధరామృతం కావాలని చెప్పు ..” అంతవరకు రాగవల్లరి చదివేసరికి ఆమె చేతిలోంచి లేఖని లాగేసుకుంది ప్రభావతి. “ఔన్లెమ్మా. తరవాత్తరవాత యింకెంత పచ్చిగా రాశాడో! నువ్వే చదువుకో!” అంది రాగవల్లరి గడుసుగా. దానికి సిగ్గు పడుతూ కోపం నటిస్తూ ప్రభావతి ఆ ఉత్తరం చించబోతే, “భలే దానివే. అది శుచిముఖికి రాసిన ఉత్తరం. నువ్వు చించేస్తే ఎలా? పైగా ప్రియుడు నీ గురించి రాసిన తొలి ఉత్తరం చించటం అమంగళం కూడా” అంటూ లాలించి, బుజ్జగించి, బెదిరించి ఆపింది రాగవల్లరి.

ఈలోగా శుచిముఖి చిలకని చిక్కించుకుంది!
“ఓసి దొంగచిలకా! నీ రెక్కల్లో ఉత్తరం తీసుకుని ఎక్కడికెళ్తున్నావ్‌? రాక్షసరాజు కూతురు నిన్ను పట్టుకురమ్మంది పద!” అని గద్దించింది దాన్ని తన కాళ్ళ సందున ఇరికించుకుని.
“చంపితే చంపు గాని నన్నక్కడికి మాత్రం తీసుకుపోవద్దు. ఇక్కడ చస్తే నేనొక్కదాన్నే. అక్కడికి తీసుకుపోతే ఇంకెంతమందో!” అని గింజుకుంది చిలక.
“ఎంత గింజుకున్నా ఏవీ ఉపయోగం లేదు. ఎలాగూ ఆ ఉత్తరం మాకు దొరికింది. నువ్వు గనక బుద్ధిగా నాతో వస్తే ప్రభావత్తో చెప్పి నిన్ను విడిపిస్తా” అని ఆశ చూపించింది శుచిముఖి.
“అలా కాదు. దయచేసి నా మాట విను. ఎక్కడన్నా ఆగుదాం. నా పరిస్థితి నీకు చెప్తా. విన్నాక నీకే తెలుస్తుంది నేనెందుకింత పట్టు పడుతున్నానో” అంది చిలక.
సరేనని ఆ చిలకని తీసుకుని ఓ కొండ శిఖరం మీద దిగి దాన్ని తన రెక్కల్తో పట్టుకుని “ఇక నీ విషయం మొత్తం చెప్పు నాకు” అంది శుచిముఖి.
“నేనో పని మీద ద్వారకకి వెళ్ళి తిరిగొస్తుంటే ఆ వూరి బయట ఒకతను ఉత్తరానికి వెళ్తున్న పక్షుల్నీ, మేఘాల్నీ,గాలుల్నీ కూడ మీరు వజ్రపురానికి వెళ్తున్నారా అని అడుగుతుంటే నేను జాలిపడి ఆగా. అతను నాకో ఉత్తరం ఇచ్చి దాన్ని శుచిముఖి అనే హంస కిమ్మంటే నేనిక్కడ కన్యాంతఃపురంలో హంసల్ని చూసి వాళ్ళలో శుచిముఖి ఉందేమో కనుక్కుందామని చెట్టు మీద దిగి వల్లో చిక్కా. దాంతో ఈ పాట్లన్నీ వచ్చి పడినయ్‌” అన్నదా చిలక.
“దీనికి తెలిసింది ఇంతేలా ఉంది. కనక ఇంకెక్కడా యిది ఈ విషయం చెప్పకుండా చూడాలి” అనుకుంది శుచిముఖి.
“పక్షికి పత్రిక పంపేవాడు వెర్రివాడై వుంటాడు. అలాటి ఉత్తరంలో ఏముంటుంది ప్రేలాపన తప్ప! కనక దాని సంగతి మర్చిపో నువ్వు… అది సరే గాని .. అసలు నువ్వు ద్వారకకి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందో చెప్పు ముందు” అంది శుచిముఖి తీవ్రంగా.
-----------------------------------------------------------రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో
-----------------------------------------------------------

ప్రభావతీ ప్రద్యుమ్నం – 3

సాహితీమిత్రులారా!

ప్రభాతీ ప్రద్యుమ్నం మూడవ భాగం చివరిభాగం
ఆస్వాదించండి-

నీళ్ళు నవుల్తూ ఉండిపోయింది చిలక!
“చెప్తావా, చంపమంటావా?” బెదిరించింది శుచిముఖి దాన్ని నొక్కిపడుతూ.
“నన్ను కొట్టూ, చంపు. ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే గాని ఆ విషయం బయటపెట్టను” అంది చిలక మొండిగా. అలాగే ఒట్టేసింది శుచిముఖి.
ఇలా చెప్పింది చిలక “వజ్రనాభుడికి సునాభుడనే తమ్ముడున్నాడు. అతనికి చంద్రవతి, గుణవతి అనే యిద్దరు కూతుళ్ళు. ఒకనాడు నారదుడు యిక్కడికి వస్తే వాళ్ళిద్దరూ ఆయన ఆశీర్వాదం కోసం ఆయన్ని పూజించేరు. ఆయన దానికి సంతోషించి “మీ భర్తలకి మీమీద చెరగని ప్రేమ ఉండుగాక! మీకు చక్కటి సంతానం కలుగ్గాక!” అని దీవించేడు. ఐతే అప్పుడు పక్కనున్న దాదులు ఊరుకోలేక “వీళ్ళకి ఎవరు భర్తలౌతారో కూడా దయచేసి మీరే చెప్పండి” అనడిగారాయన్ని.
కొంత సేపు ఆలోచించేడు నారదుడు.
“ద్వారకానగరంలో వుండే గద సాంబులనే వాళ్ళు వీళ్ళకి భర్తలౌతారు” అని ఆనతిచ్చేడు నారదుడు.
దాంతో బిత్తరపోయేరు వాళ్ళు!
“తిని కూర్చుని తిప్పలు తెచ్చి పెట్టుకున్నాం కదా! ఎక్కడి ద్వారక, ఎక్కడి గదసాంబులు? ఈ సంగతి రాజుకి తెలిస్తే ఇక మన మెడల మీద తలలుండవ్‌” అని గప్‌చుప్‌గా ఊరుకున్నారు వాళ్ళంతా.
ఐతే గుణవతీ చంద్రవతులు మాత్రం అప్పట్నుంచీ గదసాంబుల్నే తల్చుకుంటూ వాళ్ళకోసం నోములూ వ్రతాలూ చేస్తున్నారు. వాళ్ళు చిన్నప్పట్నుంచీ నన్ను పెంచి పెద్ద చేసేరు గనక వాళ్ళకి కొంత ఉపకారం చేద్దామని నేనే ద్వారకకి వెళ్ళి రాయబారం నడుపుతానని వాళ్ళతో చెప్పి వెళ్ళొస్తూ దార్లో ఆ ఉత్తరం తీసుకొచ్చా.నన్ను ప్రభావతి చూస్తే కొంపలంటుకుంటయ్‌. నేను త్వరగా వెళ్ళి వాళ్ళకి కనపడకపోతే వాళ్ళెంతో బాధపడతారు కూడా. దయచేసి నన్నొదులు” అని బతిమాలింది చిలక శుచిముఖిని.
“ఐతే వాళ్ళచేత ఈ కథ నిజం అని చెప్పించు. అప్పుడొదిలేస్తా నిన్ను”
అందుకు ఒప్పుకుంది చిలక. వాళ్ళ అంతఃపురానికి తీసికెళ్ళింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి వాళ్ళని పిలిచింది.
ఆనందంగా పరిగెత్తుకొచ్చారు అక్కచెల్లెళ్ళు!
హంస రెక్కల్లో చిక్కుకుని ఉన్న చిలకని చూసేసరికి తెల్లబోయేరు!
“మీరేం భయపడొద్దు. ఈ హంస ప్రమాణం చేసింది “నీకూ నిన్ను పంపిన వాళ్ళకీ మంచేగాని ఏమీ చెడు జరగనియ్యన”ని.” అంటూ తనకీ ఆ హంసకీ జరిగిన కథ వినిపించింది చిలక, ప్రభావతి విషయం రానివ్వకుండా.
శుచిముఖి చిలకని వదిలేసింది.
“గదసాంబులిద్దర్నీ కలిసి మీ విషయాలు చెప్పేను. వాళ్ళకి మీరంటే ఇష్టం కలిగింది. మిమ్మల్ని తప్పక పెళ్ళాడుతామన్నారు. త్వరలో ఇక్కడికి వచ్చే ఉపాయం చూడబోతున్నారు” అని తను చేసుకొచ్చిన పని చకచక వినిపించింది చిలక.
శుచిముఖి కూడా, “వాళ్ళిక్కడికి రావటానికి నేనో ఉపాయం చేస్తాను. నేను మీ అక్క ప్రభావతి మిత్రురాల్ని.ఆమె యీ చిలకని పట్టుకు రమ్మంటేనే ఇలా వచ్చా. ఇప్పుడు మీతో కూడా స్నేహం కుదిరింది. మీ రహస్యం ఆమెకి తెలీకుండా సర్ది చెప్తాలే, మీరు భయపడకండి” అని వాళ్ళకి చెప్పి ఎగిరి ప్రభావతి దగ్గరికెళ్ళింది.

“అదృష్టం అంటే నీదే! అది ప్రద్యుమ్నుడు పంపిన లేఖేనటగా! చదువుకున్నావా?” అని పరామర్శించింది ప్రభావతిని.
ఆమె కూడా నవ్వుతూ, “అది సరే, ఆ చిలకెక్కడ? దాన్నెందుకొదిలేసొచ్చావ్‌?” అనడిగింది.
“ఇంకా దాని గొడవెందుకు? నీ ప్రియుడు నీకు రాసిన లేఖ ఇంకెవరి చేతా పడకుండా మనకే దొరికింది కదాని సంతోషంలో దాన్ని వదిలేశా” అని దాటేసింది శుచిముఖి. “ఆ లేఖంతా చదువుకున్నావ్‌ కదా! అప్పుడు నేను నీగురించి అంత చెప్పినా కిక్కురుమననివాడు యిప్పుడింతగా తపించిపోవటం ఆశ్చర్యమే! ఐనా నీ అందం గురించి విన్న వాడు నీరుగారి పోకుండా ఉండటానికి అతని గుండె ఇనుమా, రాయా? .. అంతా బాగానే ఉంది. ఇక అతన్ని యిక్కడికి రప్పించటానికి ఓ ఉపాయం ఉంది. నువ్వు అవకాశం చూసుకుని నీ తండ్రికి నా గురించి గొప్పగా చెప్పు. కథలు చెప్పటంలో నాకు నేనే సాటి అనీ, నాకు అన్ని విద్యలూ తెలుసుననీ, అతన్ని మెప్పించగలననీ బాగా బోధించు. ఆ తర్వాత విషయం నేను చూసుకుంటా” అని మార్గం ఉపదేశించింది ప్రభావతికి.

ఇంతలో ఓ రోజు వజ్రనాభుడు అంతఃపురానికి వచ్చేడు. ఆ సందర్భంలో, “మన కొనన్లలో తిరిగే హంసల్లో శుచిముఖి అనేదొకటి కనీవినీ ఎరగని విద్యలన్నీ తెలిసింది ఉంది. మాటల్లో, కథల్లో, రకరకాల విద్యల్లో దానికదే సాటి! మీరొకసారి దాని ప్రతిభని చూడాలి” అని చెప్పిందతంతో ప్రభావతి. “అలాగే, ఇప్పుడే చూద్దాం, పిలిపించు దాన్ని” అన్నాడతను ఆసక్తిగా.
శుచిముఖిని రప్పించింది ప్రభావతి. తన ముందు కూర్చోబెట్టుకుని, “శుచిముఖీ, నీ విద్యల గురించి చెప్తే ముచ్చట పడి నా తండ్రి వినాలనుకుంటున్నాడు. ఏదీ, నీకు తెలిసిన శాస్త్రాల గురించి చెప్పు” అనడిగింది.
ఇక విజృంభించింది శుచిముఖి. కాణాదం, గౌతమీయం, సాంఖ్యం, జైమినీయం, యిలా అన్ని మతాల్నీ పూర్వపక్షాలు పెంచుతూ,తర్వాత వాటిని ఖండిస్తూ సిద్ధాంతాలు చేసింది. కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రాలు, కామశాస్త్రం కరతలామలకాలుగా చూపించింది. వజ్రనాభుడు ఆనందపారవశ్యంతో ఉక్కిరిబిక్కిరయేడు.

ఆ శాస్త్రప్రసంగం అయాక, “నువ్వు అన్ని లోకాలూ తిరిగేదానివి. నీక్కూడా వింతగా అనిపించిన విశేషాలేవైనా ఉన్నాయా?” అనడిగేడతను కుతూహలంగా.
“ఎన్నో చూశా గాని అన్నిట్లోకీ విచిత్రంగా అనిపించింది భద్రుడనే ఓ నటుడి నాట్యప్రదర్శన. ఇదివరకో మునుల సభలో గొప్పగా నాట్యం చేసి వాళ్ళచేత వరాలు పొంది ఇప్పుడు ఏడుదీవుల్లోనూ ప్రదర్శనలిస్తున్నాడు” అంటూ అతని ప్రదర్శనలో చూసిన అద్భుతాల్ని వినిపించింది శుచిముఖి. వజ్రనాభుడికి కుతూహలం పెరిగిపోతోంది. “నేనూ అతని గురించి కొంత విన్నా. అతని నాట్యం చూడాలని అనుకుంటున్నా. నువ్వెలాగైనా అతనిక్కడికి వచ్చేట్టు చెయ్యి” అనడిగేడు శుచిముఖిని. “అలాగే” అని అతంతో చెప్పి, “ఇంక వెళ్ళి రానా?” అని ప్రభావతితో అంటూ ఆమె తనతో కొన్ని అడుగులు నడుస్తుంటే, “ఇదంతా నీ ప్రియుడి కోసమే చేస్తున్నా. తొందర్లోనే నీ కోరిక తీరబోతోంద”ని ఆమెకి చెప్పి వెంటనే ద్వారకకి వెళ్ళి కృష్ణుడితో భద్రుడికి వజ్రనాభుడి అనుమతి దొరికిందని చెప్పింది శుచిముఖి. అలాగే, గదసాంబుల గురించి నారదుడన్న విషయం కూడ చెప్తే ప్రద్యుమ్నుడితో వాళ్ళిద్దర్ని కూడా సహాయంగా పంపటానికి నిర్ణయించేడు కృష్ణుడు.
ఇక ఇంద్రుడికి యీ విషయం చెప్పాలి.
అంతలో ప్రద్యుమ్నుడు తన కోసం ఎదురుచూస్తూంటాడని గుర్తొచ్చి అతని భవనంలో దిగింది శుచిముఖి. వజ్రపురంలో ప్రభావతి అతని కోసం ఎదురుచూస్తూ తపిస్తోందని వివరించిందతనికి.
“ఇప్పుడే రెక్కలు కట్టుకు వెళ్ళి ఆమె ముందు వాలాలనుంది నాకు. కాని ఆ రాక్షసుడి అనుమతి దొరకటం ఎలా?” అని వాపోయేడు ప్రద్యుమ్నుడు.
“నీకేం బెంగక్కర్లేదు. దానిక్కావల్సిన పథకం అంతా సిద్ధంగా ఉంది. ఆ పని మీదే నీ తండ్రి నిన్ను పంపబోతున్నాడిప్పుడు. నేను కూడా స్వర్గానికి వెళ్ళి ఈ విషయం ఇంద్రుడికి చెప్పి అక్కణ్ణించి వజ్రపురానికి వెళ్ళి నీకోసం చూస్తుంటా” అని బయల్దేరింది శుచిముఖి.

కృష్ణుడు ప్రద్యుమ్నుణ్ణీ, గదసాంబుల్నీ పిలిపించేడు వెంటనే.
వాళ్ళు ముగ్గురూ కలిసి వజ్రపురానికి వెళ్ళి వజ్రనాభుణ్ణి చంపాలని ఆదేశించేడు.
ప్రద్యుమ్నుడు భద్రుడిగా, గదుడు పారిపార్శ్వకుడిగా, సాంబుడు విదూషకుడిగా వెళ్ళాలని వివరించేడు.
నటుల వేషాల్లో, అందుకు తగిన పరివారాల్తో, భద్రుడి కున్నలాటి సంగీత వాద్యాల్తో వెళ్ళి వజ్రపురం చుట్టుపక్కల ప్రదర్శన లివ్వసాగేరు వాళ్ళు.
వజ్రనాభుడు విన్నాడీ విషయం. వెంటనే వచ్చి తన ముందు ఆడమని కబురు పంపేడు.
అలా వజ్రపురం లోకి ప్రవేశించారు వజ్రనాభుడి పాలిటి యములు! కూతుళ్ళ ప్రియులు!!

ప్రదర్శన సమయం వచ్చింది!
శుచిముఖి కన్యలు ముగ్గురికీ వాళ్ళ ప్రియుల విషయం చెప్పి వుంచింది.
ప్రద్యుమ్నుడికి ప్రభావతి అతని ప్రదర్శనకి వస్తున్నట్టు చెప్పి ఆమె ఎక్కడ కూర్చుంటుందో కూడా చూపించింది.
తన వైభవాన్నంతా ప్రదర్శిస్తూ కొలువు తీరేడు వజ్రనాభుడు!
అంతఃపుర స్త్రీలు ఎవరికీ కనపడకుండా నాట్యప్రదర్శన చూట్టానికి వచ్చి కూర్చున్నారు.
తన అద్భుత మాయా ప్రభావంతో గంగావతరణం నాటకం ఆడించేడు ప్రద్యుమ్నుడు. దాన్లో ఉన్న పాత్రల ఆకారాలు ధరించటంలో, గంగ గమనాన్ని చూపటంలో, కైలాసం లాటి పర్వతాల్ని కళ్ళక్కట్టినట్టు చిత్రించటంలో, అడవులు, పక్షులు, మృగాల్ని సైతం పుట్టించటంలో అతని ఇంద్రజాలం జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. దగ్గరున్న డబ్బునీ సొమ్ముల్నీ బహుమతులుగా అతని మీదికి విసిరేరు వాళ్ళు.
అతను ఇన్ని వేషాల్లో అందరికీ కనిపిస్తున్నా ప్రభావతికి మాత్రం అతని అసలు రూపమే కనబడుతోంది!
ప్రదర్శన దిగ్విజయంగా ముగిసింది.
ప్రభావతి ఉన్న చోటు వంకా, వజ్రనాభుడి వంకా మార్చి చూస్తూ అతను చివరగా, “ప్రభావతీ! నా మీది నీ ప్రేమతో నా జన్మ తరించింది. నువ్వు పంపిన రాజహంసి నీ విషయం చెప్పిందగ్గర్నుంచి నిన్నే తల్చుకుంటున్నా. ఈ రాత్రికే మన కలయిక. ఇక నీ సేవకే నా జీవితం అంకితం” అనే సరికి
ఆమెకి ఎక్కడలేని సిగ్గూ, భయం ముంచుకొచ్చేయి.
చెక్కిళ్ళు ఎరుపెక్కేయి.
అది చూస్తున్న శుచిముఖి ఆమెని మందలించింది సున్నితంగా “ఇంత మంది మధ్య నువ్వంతగా సిగ్గుపడక్కర్లేదు. అతనన్న దాన్లో రెండో అర్థం నీకు తెలీలేదా ఏమిటి?”
“రెండో అర్థం ఏమిటింక మరీ ఇంత విచ్చలవిడిగా అందరిముందూ ఈ రాత్రికే వస్తున్నానంటుంటే!” అంది ప్రభావతి కంగారుగా.
“నీ ప్రియుణ్ణి మరీ అంత తేలిగ్గా అంచనా వెయ్యకు. అతనన్న మాటలు నీకలా అర్థమయ్యాయి తప్ప వజ్రనాభుడికి అవి తనని పొగుడ్తూ అన్నట్టు అనిపిస్తాయి. అలా ఎవరిక్కావల్సిన అర్థం వాళ్ళకొచ్చేట్టు మాట్టాడేడతను. కనక నీకేం బెంగక్కర్లేదు. నీ రహస్యం యింకెవరికీ తెలియదులే” అని వివరించింది శుచిముఖి.

ప్రదర్శకులు వాళ్ళ విడుదులకి బయల్దేరేరు.
ప్రభావతి కూడ రాగవల్లరితో కలిసి తన అంతఃపురాని కెళ్ళింది.
సిగ్గు, భయం, లజ్జ, కోరిక అన్నీ కలగలిసి ఆమెని ముంచెత్తుతున్నాయి.
చెలికత్తెలు ఆమె కోసం తెస్తున్న పూలలో తుమ్మెదగా మారి దూరి వెళ్ళేడు ప్రద్యుమ్నుడు!
సంపెగ నూనెతో తలంటి ఆమెకి సుగంధస్నానం చేయించింది రాగవల్లరి.
అద్భుతంగా అలంకరించుకుంది ప్రభావతి.
రకరకాల బొట్లు పెట్టుకుని చూసుకుంది.
అనేక విధాలైన ఆభరణాల్ని మార్చి మార్చి పెట్టుకుచూసింది.
ఐనా తన ప్రియుడికి ఏవైతే యిష్టమౌతాయో తెలిసేదెలా?
ఒకచోట నిలవలేక చేసిన పన్లే చేస్తూ చూసిన వస్తువులే చూస్తూ తిరుగుతోంది.
కాలం గడుస్తోంది. ఆమె ఆరాటం పెరిగిపోతోంది.
“ఒక్కో క్షణం ఒకో ఏడాదిలా గడుస్తుంటే యింకా రాడేమిటి? ఏదైనా అడ్డొచ్చిందేమో! ఎవరికైనా తెలిసిందో ఏమో! అసలు ఈ అంతఃపురంలోకి ఎలా రాగలుగుతాడు తను? … ఇదంతా నా దురదృష్టం ఎవర్ననుకునీ ఏముందీ” అంటూ బాధపడింది శుచిముఖినీ రాగవల్లరినీ పిలిచి.
తన విరహాన్ని పెంచుతున్న చంద్రుణ్ణీ చల్లగాలినీ తిట్టిపోసింది.
మన్మథుణ్ణి కోపగిద్దామంటే తన ప్రియుడు ఆ మన్మథుడి మరో రూపమాయె!
వ్యథ భరించలేక మూర్ఛ పోబోతుండగా
నిజరూపంతో ముందు నిలిచేడు ప్రద్యుమ్నుడు!

“నేను వచ్చేశాను చూడు” అంటూ కౌగిలించుకున్నాడామెని.
భయం, వణుకు, లజ్జ పుట్టుకొచ్చాయామెకి!
అతని చేతులు విడిపించుకుని పారిపోయింది లోపలికి!
శుచిముఖినీ, రాగవల్లరినీ చూసి వేడుకున్నాడు ప్రద్యుమ్నుడు “నా పుణ్యాలఫలం మీ చెలి. ఆమెని త్వరగా తీసుకొచ్చి మీరే పెళ్ళిపెద్దలై మాకు గాంధర్వ వివాహం చేయించాలి”
“సరే, ఇప్పుడే వస్తాం” అని ప్రభావతి దగ్గరికి వెళ్ళేరు వాళ్ళు.
ఎన్నో రకాలుగా బుజ్జగించి, బెదిరించి, లాలించి మెల్లగా ఒప్పించి తీసుకొచ్చేరు.
పాణిగ్రహణం చేయించేరు.
పెళ్ళిమంత్రాలు చదివింది శుచిముఖి.
గాంధర్వ వివాహం జరిగిపోయింది.
తెల్లవారటంతో నిద్రలేచేడు ప్రద్యుమ్నుడు.
“రాత్రులు ఇక్కడికి వస్తా గాని పగలు విడిదిలో కనపడకపోతే ప్రమాదం. కనక యిక్కడినుంచి నా విడిదికి సొరంగం కల్పిస్తా. నువ్వు దాని ద్వారం రహస్యంగా ఉండేట్టు చూడు” అని ఆమెకి చెప్పి అలాగే వెళ్ళేడు తన విడిదికి.
ప్రభావతి దగ్గరి కొచ్చేరు శుచిముఖీ రాగవల్లరులు.
ఆమె వాలకం చూసి రకరకాల చతురోక్తుల్తో సరసాలాడేరు.
ఇంతలో అక్కడికొచ్చేరు
గుణవతీ చంద్రవతులు
ప్రభావతిని చూట్టానికనే నెపం పెట్టుకుని
శుచిముఖితో తమ ప్రియుల విషయం మాట్టాట్టానికి!

ప్రభావతిని చూసేసరికి వాళ్ళకీ విషయం అర్థమైంది.
“అక్కకి రాత్రి ఏదో విశేషమే కలిగినట్టుంది చూశావా! గడుసుదే! బయటివాళ్ళెవరూ రావటానికి లేని అంతఃపురంలో ఎలా సాధించిందో!” అని ఆమెని ఆటలు పట్టించటం మొదలెట్టేరు వాళ్ళు.
తన రహస్యం వాళ్ళకి తెలిసిందని తెల్లబోయింది ప్రభావతి.
ఆమె పరిస్థితి గమనించిన శుచిముఖి వాళ్ళ గుట్టు కూడ బయటపెడితేగాని పరిస్థితి అదుపులోకి రాదని గుర్తించింది.
“ఆగండాగండి. మీరు చదివిన ఆకే తనూ చదివింది మీ అక్క కూడా. కాకపోతే మీకన్నా పెద్దది కాబట్టి ఆమె కోరిక ముందు తీరింది. మీలో ఎవరూ తక్కువ కాదులే” అంది వాళ్ళ గుట్టు రట్టు చేస్తూ.
ప్రాణం లేచొచ్చింది ప్రభావతికి.
“ఎలాగెలాగ? వీళ్ళక్కూడా ఏదో రహస్యం ఉందన్నమాట! నా మీదొట్టు. నువ్వు చెప్పాల్సిందే” అని శుచిముఖిని బలవంతం చేసింది.
వాళ్ళ వ్యవహారం అంతా ఆమెకి వినిపించింది శుచిముఖి.
“ముగ్గురం తోడుదొంగలం అయ్యాం” అని నవ్వుకున్నారు వాళ్ళు.
“బాగానే ఉంది గాని నీ ప్రియుడితో చెప్పి వాళ్ళ ప్రియుళ్ళు కూడా వచ్చేట్టు చూడాలి” అని ప్రభావతితో చెప్పి, “ఆమె ప్రియుడికి మాయశక్తులున్నయ్‌. వాళ్ళని రప్పించటం అతని వల్లే ఔతుంది. అందుకే మీ విషయం చెప్పాల్సొచ్చింది. ఇక మీరు మీ యిళ్ళకి వెళ్ళండి. అతంతో మాట్టాడి ఈ రాత్రికే మీ ప్రియులు వచ్చే ఏర్పాటు నేను చేస్తా” అని పంపింది గుణవతీ చంద్రవతుల్ని.

ఆ రాత్రికి ప్రద్యుమ్నుడి విడిదికి వెళ్ళి అన్నదమ్ములు ముగ్గుర్నీ ఓ చోట కూర్చోబెట్టి అందరి ప్రేమ కథల్నీ వినిపించింది శుచిముఖి. “హన్నా! నువ్వేదో ఇంద్రుడి పని మీద వచ్చావనుకుంటే అసలు విషయం యిదా!” అని ఒకర్నొకరు అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు.
తను తయారుచేసిన సొరంగం ద్వారా వాళ్ళని వాళ్ళ ప్రేయసుల దగ్గరికి పంపేడు ప్రద్యుమ్నుడు.
అలా కొంత కాలం ఆనందంగా గడిపాయి ఆ మూడు జంటలూను.
ఇంతలో అమ్మాయిలు ముగ్గురూ గర్భవతులయేరు.
తొమ్మిదినెలల తర్వాత ప్రభావతి ప్రభావంతుణ్ణి, చంద్రవతి చంద్రప్రభుణ్ణి, గుణవతి గుణవంతుడు, కీర్తిమంతుడు అనే కవలల్నీ కన్నారు.
ఆ పిల్లలు పుట్టటమే పూర్ణ యవ్వనంతో, వేదవేదాంగ పారంగతులుగా, అస్త్రవిద్యా దక్షులుగా పుట్టేరు.
అంతలో వాళ్ళ విషయం తెలిసింది వజ్రనాభుడికి!
కోపంతో మండిపడ్డాడు.
“ఈ అంతఃపుర ద్రోహం చేసిన వాళ్ళు ఏలోకం వాళ్ళో ఆ లోకానికి ఆఖర్రోజులొచ్చినయ్‌. వాళ్లని ప్రాణాల్తో పట్టుకురండి పొండి” అని తన సేనాపతుల్ని పంపేడు వీరావేశంతో ఊగిపోతూ!
అలా ఎందరో వెళ్ళేరు గాని
ఒక్కరూ తిరిగి రాలేదు!
ఇంక లాభం లేదని తన సైన్యం అంతటితో వెళ్ళి తన కూతుళ్ళ అంతఃపురాన్ని ముట్టడించేడు వజ్రనాభుడు!
“చిన్నపిల్లలు ఇంతసేపు యుద్ధం చేసేరు. ఇక మనం కూడా రంగం లోకి దిగాల్సిందే” అని ప్రద్యుమ్న గద సాంబులు సొరంగం ద్వారా అంతఃపురంలోకి వెళ్ళేరు.
వజ్రనాభుణ్ణి చంపటానికి ప్రద్యుమ్నుడు వెనకాడుతుంటే
ప్రభావతే అతని కత్తి తీసి చేతి కిచ్చి, “నీకేం అనుమానం వద్దు. యుద్ధానికెళ్ళి అతన్ని చంపు” అని పంపింది.

మిగిలిన వాళ్ళందర్నీ అంతఃపుర రక్షణకి ఉంచి తనొక్కడే రాక్షససైన్యాన్ని ఊచకోత కోసేసేడు ప్రద్యుమ్నుడు!
చివరికి వజ్రనాభుడే అతంతో తలపడ్డాడు.
ఇంతలో హంసలు వెళ్ళి యుద్ధవార్తని కృష్ణుడికీ ఇంద్రుడికీ అందించినయ్‌.
వెంటనే వచ్చి వాలేరు వాళ్ళు కూడా.
ఇంద్రుడు అద్భుతమైన రథాల్ని వాళ్ళ ముగ్గురికీ ఇచ్చేడు.
కృష్ణుడు తన చక్రాన్ని ప్రద్యుమ్నుడి దగ్గరికి పంపేడు.
దాన్ని ధరించి అతను వజ్రనాభుణ్ణి సంహరించేడు!

దేవదుందుభులు మోగేయి!
పుష్పవృష్టి కురిసింది!
వజ్రనాభుడి రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసి నలుగురు బిడ్డలకీ పంచి ఇచ్చేడు కృష్ణుడు.
కొడుకులూ, కోడళ్ళతో ఆనందంగా ద్వారకకి చేరుకున్నాడు!
అందరూ ఎంతో కాలం ఎన్నో సౌఖ్యాలనుభవించేరు!
----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, ఈమాట సౌజన్యంతో
----------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

శ్రీమహాభారతం లోని "ధర్మవ్యాధుని" కథ!! 


విలువ : ధర్మము 

అంతర్గత విలువ : సత్ప్రవర్తన 

పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది. 

ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా. 

అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది. 

కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది. 

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”. 

ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు. 

నీతి : 

“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు. 
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది. 
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు. 
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.🙏 


" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! " 








Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు