Big story




----------------------------------------------------------- 
రచన: కృష్ణ వేణి, ఈమాట సౌజన్యంతో 
----------------------------------------------------------- 


సాహితీమిత్రులారా! 
ఈ కథను ఆస్వాదించండి............ 
- ఏ.వి.రమణరాజు


సాహితీమిత్రులారా! 
ఈ కథను ఆస్వాదించండి............ 

బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ

సాహితీమిత్రులారా!
స్వగతం అనే శీర్షికలో వ్రాయబడిన
అంశం ఇది ఈమాట మాసపత్రికలో
చూడండేమిటో ఇది ........
-------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, ఈమాట సౌజన్యంతో
---------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
సాహితీమిత్రులారా! 
ఆదివారం కావడంతో, పొద్దున్నే కూడా జనంతో కిట కిట లాడి పోతోంది సికింద్రాబాదు బస్ స్టాండు. సూర్యుడు యదావిధిగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 

“ఏమోయ్ ఎక్కడికి వెళ్తున్నావోయ్..” బాగా పరిచయమైన కంఠం విని పక్కకి చూసాడు గోపి. ఆ పిలిచింది తన ఇంటి ఓనరు వెంకట్రావుగారు. చూట్టానికి సన్నగా, పొడుగ్గా బుర్ర మీసాల్తో పాత సినిమాల్లోని రమణారెడ్డి లాగా అదోరకమైన కామెడీ ముఖంతో కనిపిస్తాడు. 

“ఏమిటీ యేదైనా దూర ప్రయాణమా?” ‘అబ్బే, సరదాగ కొన్ని బస్సులు కొనుక్కుందామని వచ్చాను. పొద్దునే ఇక్కడకు దాపురించాలా స్వామీ అని మనసులో అనుకొని పైకి చెప్పాడు. 

“అవునండి రేపు సోమవారం శలవే కదానీ నాగార్జునసాగర్ కు బయల్దేరాము. 

“ఊహూ! మాటవరసకైనా అన్నావు కాదేం, నేను కూడా అక్కడికే. వీళ్ళు ముగ్గురూ ఎవరూ? మీ ఆఫీసు వాళ్ళా?” 

“కాదండీ కాలేజీనుంచే ఫ్రెండ్సు. ఇతను రంగరాజు.. మలక్ పేట ఆంధ్రాబాంక్ లో పని, ఇతను చంచలమూర్తి, వాడు మురళి.. వీళ్ళిద్దరూ పోస్టల్ డిపార్ట్మెంటు, ప్రస్తుతం ముషీరాబాదులో రూమ్మేట్స్.” ఇంటి ఓనర్ని అందరికీ పరిచయం చేసాడు గోపి. 

“ఐతే ఇకనేం పదండి అందరం కలిసే సాగర్కి పోయివద్దాం. ఒక్కణ్ణే వెళ్ళాల్సొస్తుం దనుకుంటే తోడుగా మీరందరూ దొరికారు” ఉషారుగా చిటికెలేస్తూ ఊగిపోతున్నారు వెంకట్రావుగారు. 

“అవును నిజంగానే దొరికిపోయాం మరి!” నీరసంగా గొణిగాడు గోపి. ఉదయాన్నే వడ దెబ్బ తగిలి సోష వచ్చినట్టుగా ఉంది గోపి ఫ్రెండ్స్ కి. పక్కకి లాగి గోపి చెవిలో చెప్పారు 
“పెళ్ళికి వెళ్తూ పిల్లిని తెచ్చుకున్నట్టు ఈ శనేశ్వరం గాడేమిట్రా మనతో కూడా వస్తా నంటున్నాడు. మనం వేరే ఏదైనా టాక్సీలొ గాని, లేకపోతే మాచెర్ల దాక రైల్లో వెళ్ళి అట్నుంచి బస్సులో గానీ పోదాం. ఆయన్ని మాత్రం త్వరగా వదిలించేస్కోరా..”. 

“ఇదిగో నాకసలే ఈ టైపు ముసలి వాళ్ళంటే ఎలర్జీ. కోపం వచ్చి ఏమన్నా రాంగ్ పెట్టుకున్నా నంటే ఆపైన నీకే నష్టం, మీఇంటి ఓనర్ కదా..” వార్నింగ్ ఇచ్చాడు రంగరాజు. 

“వూర్కోండి రా.. నెను తెల్లార్లేస్తే ఆయన గారి మొహమే చూడాలి. ఈంకొ విషయం.. ఏంటంటె యీయన గారొక పేద్ద చాదస్తం చ్చాటర్ బాక్సు. మనకీ దార్లో మంచి కాలక్షేపం కూడ అవుతుంది.. రానీండిరా పోనీ..” భరోసా ఇచ్చాడు గోపి. 

“ఏంటయ్యోయ్, మా గోపీ చెవులో వూదర గొడుతున్నట్టున్నారే.. నాకేమన్న చెముడనుకున్నారా, మీ గుసగుసలన్నీ వినిపిస్తునే వున్నాయ్. నా నిమిత్తం ఖర్చులేవీ మీరు పెట్టక్కర్లేదులే.. ప్రయాణం పూర్తవగానే అణా పైసల్తొ సహా లెక్క గట్టి మరీ ఇచ్చేస్తా. కాకపొతే తిరిగొచ్చిందాకా మీలొ ఎవ్వరో ఒక్ఖరే ఖర్చులనీ పెడితే లెక్కలు తేలిగ్గా చూసుకోవచ్చు. ఏమంటావోయ్ గోపీ?” 

“ఆహ డబ్బు గురించి కాదండీ. మేమంతా బాచిలర్ గాళ్ళం.. చాన్నాళ్ళ తర్వాత యీ ప్రోగ్రాం వేసుకున్నాం. సాగర్లో మాకోసం హోటల్ రూములవీ ముందే బుక్ చేసుకున్నాం. మాతో జాయిన్ అయితే మీకు బోర్ కొడుతుందేమోననీ…” ఆఖరి ప్రయత్నంగా కన్విన్స్ చెయ్య బోయాడు. 

“ఇదిగో అబ్బాయీ, నీ పెరేమిటన్నావ్.. చెంచా మూర్తా?? మీరిద్దరూ..” ఆయన్ను మధ్యలోనే ఆపుతూ “ఆగండాగండీ. చెంచా మూర్తి కాదు – చంచల.. చంచల.. మూర్తి. ఆది గూడ నేను కాదు. నన్ను ముద్దుగ మురళి అంటారు “క్రిష్ణుడిలా ఫ్లూటు వాయిస్తున్న పోజు పెట్టాడు. 

“అదే లేవయ్య, చెంచల మూర్తి.. దేముడి పేరేలే… నా నోరు తిరక్క అలా వచ్చి చచ్చింది” “ఆమాట కొస్తే అస్సలు ఎవ్వరికీ కూడ నోరు గిరగిరా తిరగదండి. ముఖంలో ఆ వున్నచోటేదో అక్కడె వుంటుంది. బుర్ర సరిగ్గా పంజేయకే ఇలా అవాకులూ చవాకులూ నోట్లోంచి పేలతాయి మరి.” నలుగురి లో చెంచా మూర్తి అన్నందుకు కాస్తంత ఉక్రోషంతో చెప్పాడు. 

“వొరేయ్ మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అసలు పాయింటుకు రారా మూర్తిగా. ఇదిగోండి వెంకట్రావు గారూ మీరు మాతో పాటు రావటానికి అభ్యంతరాల్లేవు గానీ, మా ఫ్రెండ్సుకు కొంచెం నోటి దురద (బొటన వేలుని మందు తాగే లాగా పెట్టి), అలాగే చేతి వాటం (ఎడం చేతిని కుడి చేతిలో పేక కలుపుతున్నట్టుగా రాస్తూ) కూడ కాస్త యెక్కువ. సో, మావల్ల మీకు యిబ్బందిగా వుండచ్చేమో..” గట్టిగా మీ దారిన మీరు వెళ్ళండి అని అందామన్నా కూడా ఆయంతో కష్టమేనని, వచ్చే వారమే రూం ఖాళీ చెయ్య మన్నాడంటే హైదరాబాద్ లో బాచిలర్లకి యిల్లు దొరకటం యెంత బ్రహ్మ ప్రళయమో అనుభవైక నైవేద్యం మరి.. అందుకే కొంచెం అర్ధింపు గానే నసిగాడు గోపి. 

“యిదిగోండి అబ్బాయిలూ, మళ్ళీ చెబుతున్నా, నాకు మీవల్ల యెటువంటి యిబ్బందులూ వుండవ్, బస్సొచ్చే టైమౌతోంది.. మరి అలోచించకుండా మొత్తం అయిదు టిక్కెట్లూ తీసేస్కోండి.” ఘంటాపధంగా డిసైడ్ చేసేశారు. ఇంకా తప్పదన్నట్లు కౌంటర్ కేసి కాల్లీడ్చు కెళ్ళాడు గోపి. యీ లోగా వెంకట్రావు గారు మిగతా ముగ్గురినీ ఏడు తరాల వెనకనుంచీ బయోగ్రఫీ స్కానింగు తీసే కార్యక్రమంలొ మునిగి పోయారు. 



యిదిగో కండక్టరూ, నాకు ఇంకో ఎగస్ట్రా టిక్కెట్టు యివ్వవోయ్. కదుల్తున్న బస్సు లోంచి పొలికేక పెట్టాడు వెంకట్రావు గారు.”అదేంటి సార్,అయిదుగురికీ ఇందాక టిక్కట్లు కొన్నాం గదా నమ్మకంలేదా?” 

“నమ్మకం లేక కాదయ్యా, ఒక వేళ నాది పోతే.. సేఫ్ సైడుగా మరొకటి ఉంటుందని” 

” ఆ అలాగా? మరి ఈ ఎక్స్త్రా టిక్కట్టు కూడా పోతే” రెట్టించాడు రంగరాజు. 

” పిచ్చివాడా, నేను వొంటరి వాణ్ణి కదా. ఈ సమ్మర్లో ఎక్కడెక్కడకి తిరగాలని పిస్తుందోనని సీనియర్ సిటిజెన్ బస్పాస్ కూడా ముందే కొన్నాలే “. ఆయన సంగతిబాగా తెల్సిన గోపీ మాత్రం అది మామూలే అన్నట్టు కిక్కురు మనకుండా కూర్చున్నాడు. 

“ఈయన అతిజాగ్రత్తకి,చ్చాదస్తానికి వీరతాడు వెయ్యాల్సిందే, తప్పదు ” తల అడ్డంగా తిప్పి నుదిటిమీద అరచేత్తో కొట్టుకొంటూ లోపల్లోపల అనుకోబోయి పైకే గొణిగాడు చంచల మూర్తి. 

“అదిగో అదే భగవంతుడి సృష్టి లోపం అంటాన్నేను. చూశావా లోపల అనుకోబోయినా ఒక్కోసారి పైకే వచ్చేస్తాయి ఇలా మాటలు. నా మటుకు నేను ఏదీ లోపల్లోపల అనుకోను. అంతాపైకే, అదే బెస్టు కదా? ” ఈయనతో మాట్లాడటం కష్టం గానీరా, సాగర్ వెళ్ళాక మన రెండు రూముల్లో ఒకటి ఇచ్చి రెండో దాంట్లో మనం అడ్జస్టు అవుదాం”. ఒళ్ళు విరుచు కోవడానికి కూడా వోపిక లేకుండా నాలుగ్గంటలు బుక్కయిపోయిన గోపీని జాలిగా చూసి బస్సు దిగుతూ చెప్పాడు చంచల మూర్తి. 



“ఇటు చూడవయ్య మురళీ, యీ డాము పైనుంచి క్రింద నీళ్ళ అడుగు దాక యెంత లోతు వుంటుందంటావ్?” 

“ఎమో తెలియద్సార్, అయినా దిగితే గాని లోతు తెలీదంటారు కదా? ఒకవేళ నన్ను కొంపదీసి వో తాడు పట్టుకొని క్రిందకి దూకి కొలిచి చెప్పమంటల్లేదుగదా?” 

“నువ్వు మరీ వెర్రి బాగులాడివి లా వున్నావే.. ఉట్టుట్టి నే అడిగా, నీకు యెంత అంచనా వుందో నని” 

“మీ అంచనాలు తరుమారవ్వ, ఆ గిలిగింతలు నా దగ్గరెందుకులెండి. అంతా సవ్యంగా వుంటే వచ్చే యేడు పెళ్ళి గూడ చేసుకొని సెటిలవుదామనుకొంటున్నా. యిలా డాముల మీదనుంచి దూకే ఆలోచనలు పెట్టకండి ప్లీజ్..” 

” ఏమో అనుకొన్నా నీఫ్రెండు గోపీలా కాకుండా.. నీకు కాస్త భవిష్యత్తు మీద ఆశ వున్నట్టుగ తోస్తోంది నాకు.” 

“స్వామీ మీ దయ. పాపం గోపీ కూడ మీయింట్లో అద్దెకు దిగక ముందుదాకా గొప్ప ఆశావాదే. నాకు మటుకు యీ ప్రయాణం సజావుగా పూర్తయి ఇంటికి ఆరోగ్యంగా చేరగలిగితే గాని మిగతా భవిష్యత్తు ఎట్లా వుంటుందో ఆలోచించే ధైర్యం లేదు.” ఖచ్చితంగా చెప్పేశాదు రంగరాజు. 

“వొరేయ్, భవిష్యతు మాటలకేం గానీ ముందు కాస్త వర్తమానంలోకి రండి. ఇంతాదూరం వచ్చాం, ఇక్కడకి 10 – 12 కి. మీ. దూరంలో యీ క్రిష్ణ ఒడ్డునే ఒక పల్లెటూరు వుంది, మంచి సీనిక్ గా కూడ వుంటుంది. త్వరగా లంచ్ చేసి వెళ్ళొద్దాం పదండి” చెప్పాడు గోపి. 

” ఊ పదండి, సీనరీ లన్నా ఫోటోలన్నా నాకు మా చెడ్డ సరదా.” ముచ్చట పడ్డాడు వెంకట్రావు గారు. 

“తియ్యడానికా.. దిగడానికా?” ముందు యీయన ప్రతిచోటకీ రడీ అవుతాడేంటిరా బాబూ ” గొణుగు తున్న మురళి కేసి వెంకట్రావు గారు గుర్రుగా చూడటంతో- పదండి చస్తామా అన్నట్టు మొఖనికి నవ్వు పులుముకొన్నాడు. 

“యేం తగులు కున్నాడురా పొద్దున్నించీ యీయన. పోనీ కాం గా ఫాలో అయి వస్తాడా అంటే అదీ లేదు. గ్రామ రాజకీయాలనుంచి ప్రపంచ యుధ్ధాల దాకా.. తెరచిన నోరు ముయ్యకుండ దంచి కొడుతున్నాడయ్యే. పొరపాటున ‘ఊ’ కొట్టక పోయినా, లేదా మధ్య మధ్యలో వింటున్నామా లేదా అని అనుమానం వచ్చినా చిన్న చిన్న క్విజ్ లు పెడుతున్నాడు కూడ.” వాపోయాడు మూర్తి. 

“యిప్పుడు చెప్పవోయ్, క్రిందటి దశాబ్దంలో ఇరాన్ వార్ జరిగినప్పుడు వాడిన మిస్సైళ్ళ పేర్లేమిటి?” 

“శుభమా అని సాగర్ కి వస్తే, యీ మిస్సైళ్ళ గోలేమిటి మహానుభావా. ఈ క్రిష్ణ లో గనక మొసళ్ళూ గట్రా వుంటే వాటి నొట్లో తల పెట్టినా కొంచెం బెటరుగా వుండేలా వుంది” దూరంగా నడుస్తూ, రంగరాజు బలి అవటం చూసి అన్నాడు మురళి. 

“చెప్పే తీరలంటారా, వేరే దారి లేదా” రోషంగా అన్నాడు రాజు, “నాకు అంత G.K. గనక వుంటే యెప్పుడో IAS అయ్యే వాడిని.” 

“ఆ మాత్రం తెలీదుటయ్య, స్కడ్లయ్యా.. స్కడ్లు. మరియు పేట్రియాటికు మిసైళ్ళూనూ. ఇకపోతే.. యీ సాగర్ దేనికి ప్రసిధ్ధో అదయినా తెలుసా?” 

“సుమారుగా కూడ తెలియదు సార్, యే మాత్రం అంచనా వేసే పరిస్తితి లో కూడా లేను. మెదడు మొద్దు బారి పోయి.. మొత్తం మర్చిపోయాను. నన్ను వదిలెయ్యండి స్వామీ..” ఆయన దగ్గర్నుంచి యివతల పడి మిత్రులతో చెప్పాడు” జీళ్ళ పాకంలా తగులుకొని, చెవిలో జోరీగ లాగా, కుట్టడానికి వచ్చే కందిరీగ లాగా.. వెంటాడుతున్నాడు గదరా మీ ఇంటాయన. పోనీ ఓ పదో పన్నెండో కిలో మీటర్లు నడిస్తే కాస్తంత ఆ చ్చాట్టర్ బాక్స్ నీరసం వచ్చి వాగుడు తగ్గించి మనల్ని బతికిస్తాడేమో చూడాలి ” 

“యేంటయ్య మళ్ళా మీలో మీరే గొణుక్కుంటారూ? త్వరగా బయల్దేరండీ” 

“యీయన గారి తిరుగుడు తొందర.. తిరపతెళ్ళ! అయినా యేం బాడీరా బాబూ, ఒక అలుపూ సొలుపూ లేదు. బుర్రమీసాలు మెలేసుకుంటూ మరీ మన బుర్రలు తాటి ముంజెల్లా భోంచేస్తూ మనతో సమానంగా తిరిగేస్తున్నాడు.” 

“మెల్లగా.. మెల్లగా..నీ కామెంట్లు అయనగ్గానీ చెవిన బడితే నాకు డేంజర్రోయ్.” గొపీ బాధ గొపీది మరి. 

“అందుకేరా.. వీడీమధ్య ఓనరు గారి ఉపన్యాసాలు వినీ వినీ యెదుటి వాడు చెప్పడం పూర్తి కాకుండానే అవునన్నట్లుగా తలాడించేస్తున్నాడు. అదుగో ఇప్పుడు రాజు గాడు ఎలా దొరికాడో విను” వానకి కాస్త వెనగ్గా నడుస్తూ కిసుక్కు మన్నారు గోపి, మురళి, ముర్తి. 

“మొన్నో కొత్త తెలుగు సినిమా చూశానోయ్ రాజూ. అందులో హీరో చిన్న విలన్ని ముందే మర్డర్ చేసి, పెద్ద విలన్ని చంపేలోపు పోలీసులు అడ్డు పడతారు. వెంటనే జేబు లోంచి ఒక పేద్ద వీరప్పన్ మీసం తీసి మూతికి అంటించుకుంటాడు. అంతే.. పిచ్చి పోలీసులు హీరో పక్క పక్కనే తిరుగుతూ కూడ అతన్ని గుర్తు పట్టి చావలేరు. పైగా అతన్నే అడుగుతారు ‘ఇటు వైపు.. ఎర్ర చొక్కా వేసుకొని మూతికి మీసాల్లేని ఒక వ్యక్తి పరిగెట్టటం చూశావా అని..” 

కొత్త సినిమాలంటే వెంకట్రావు గారికి ఎలర్జీ అని అర్ధమయ్యింది రాజు కి. ఇంక అంతే రెచ్చి పోసాగాడు” నేను కూడ మొన్న ‘ గిలి గిలి గోల ‘ అనే తెలుగు సినిమా చూశానండి. అందులో అయితే, హీరో తన గుడ్డి చెల్లినీ మూగ తల్లినీ, అందమైన హీరోయిన్నీ ఆటోలో గుడికి తీసుకెల్తుంటాడు. హీరో చేతిలో కొబ్బరి కాయని పదే పదే క్లోజప్పులో యెందుకు చొపిస్తున్నారో ముందు మనకు అర్ధం కాదు. ఆ కొబ్బరి కాయను గుళ్ళో దేవీ పాదాల దగ్గర గట్టిగ విసిరి కొట్టగానే అది రెండు చెక్కలై, ఒక చెక్క అతని తల్లి గొంతు మీద, రెండోది చెల్లి నుదుటిమీద తగుల్తుంది. ముందుగ చెల్లి గావు కేక” 

అన్నయ్యా.. అమ్మా.. నాకు మీరందరూ కనిపిస్తున్నారోచ్ !” తర్వాత తల్లి కూడా కీచు కేక “బాబూ.. అమ్మాయ్.. నాకు మాటలు వచేస్తున్నాయర్రా! అంతా ఆ దేవి మహిమర్రా!’ ఆ తర్వాత సీను మారి హీరొ హీరోఇన్ లతో ‘ తోట కొస్తావా.. బీటుకాస్తావా’ అనే గ్రూపు సాంగ్ సింగపూర్ లో మొదలౌతుంది” ఇంతసేపటికి.. తను మాట్లడుతూ, వెంకట్రావు చేత వూ కొట్టగలిగించాను అని విచిత్రంగా మురిసిపొతున్నాడు రంగరాజు. 

“వీడి సినిమాల గోల సిగ దరగా. ఇంకా యెంత దూరం రా? నడిచి నడిచి చేతులు పీకుతుంటె..” చెప్పాడు చంచల మూర్తి. 

“విచిత్రంగా వుందే.. బాగా నడిస్తే కాళ్ళు గుంజాలి గానీ చంచాల మూర్తి చేతులు పీకుతున్నాయంటాడు?” అర్ధంగాలా మురళికి. 

“పిచ్చివాడా మనవాడి పేకాట పిచి మర్చిపొయ్యావా? ఇప్పుడు మనం ఓ కే అనాలే గానీ హొటల్ రూం వెళ్ళే దాకా యెందుకూ, యీ చెట్టు కింద దుప్పటి పరిచి ముక్కలు పంచినా ఆశ్చర్య పడక్కర్లా” మురళి సందేహాన్ని పటాపంచలు చేశాడు గోపి. 

“బాగా గుర్తుచేశావ్.. యీ పక్కనే అడ్వాన్సు గా ఒక సిట్టింగు వేద్దామేంటీ? చెట్ల మధ్యలో పేకాట వెరైటీగా కూడ వుంటుంది” 

“వెరైటీయే గాదు.. గండు చీమలు, తేళ్ళు గట్రా కుడితే మంటగా కూడా వుంటుంది మరి. పేకాట పోగ్రాం- రాత్రి మందు సిటింగు లో కానిద్దాం గానీ ముందర అక్కడెదో చిన్న కొట్టు లాంటిదేదో కనిపిస్తోంది కాస్త పొట్టకేమన్నా దాణా కొట్టిద్దాం పదండి.” కసిరాడు గోపి. 

“అప్పుడే ఆకలేమిటయ్యా ఏకంగా రాత్రి హోటల్కెళ్ళాక డిన్నర్ చెయ్యొచులే.” తిండి కంటే సైటు సీయింగే ముఖ్యం అన్నుట్టు చెప్పాడు వెంకట్రావు గారు. 

“అయ్యా పొద్దున్నుంచీ మా బుర్రల్ని వరసపెట్టి బిర్యానీ మాదిరి భోజనం చేస్తున్నారు కాబట్టి మీకు ఆకలి వుండకపోవచ్చు ఆ కనపడే కొట్లో యేది దొరికితే అది అర్జంటుగా తినకపోతే అడుగు ముందుకు పడేట్టు లేదు మాకు.” చెప్పాడు రాజు. ఆ కొట్టు కం ఇన్ల్లు సెటప్పు దగ్గరకు రాగానే చంచల మూర్తి చూపు చురుగ్గా పని చేసింది. ” ఏంటి.. ఇది కలా నిజమా. ఇంత మారుమూల వూళ్ళోని సాధారణ మైన కొట్లో ఇంత టెక్నాలజీ పార్కు వెలిసిందా? విచిత్రం కాకపోతే ఇక్కడ కంప్యూటర్లు వుండటం యేమిటి? యెవడన్నాడ్రా ఇండియా ముందుకు పోవటం లేదని? వాళ్ళ గొంతుల్ని పేక ముక్కల్తో కోసేస్తా” ఆవేశంతో వూగి అరిచాడు.”నీ వీరంగం ఆపవయ్యా మగడా… కొంపదీసి ఇదేమన్నా తాకట్టు కొట్టేమో” వెంకట్రావు గొంతులో అనుమానం తొంగి చూసింది. షాపు వాడిని అడిగాడు.. “యెవరివి బాబూ యీ కంప్యూటర్లూ సెటప్పూనూ?” 

“ఓర్ కిసీకా హైతో హమారే పాస్ క్యోం రెహ్తా… మావే హై బుడ్ఢా” స్టీలు ప్లేటు మీద మట్టి రాయితో గీరినట్టుగా వురిమాడు షాపు వాడు. 

“వండర్ఫుల్. ఇండియాలో పల్లె పల్లెల్లో ఐ. టీ. ఇంత పురోగమిస్తోందా. గ్రామీణ వాతవరణంలో బడ్డీ కొట్లల్లో కూడా ‘e కామర్సు’ మూడు ‘మైక్రో సాఫ్ట్ లు’ ఆరు సన్ సాఫ్టుల్లా విరబూస్తోందన్న మాట. ఆనందంతో రాజు గట్టిగా ఓ సారి బల్ల గుద్దాడు. షాపు వాదు కోపంగా చూడటంతో, “ఆ అబ్బే ఏంలేదూ.. ఈ బల్ల ఏ మెటీరియల్ తో చేసివుంటారా అని..” నీళ్ళు నముల్తూ నాలిక్కర్చు కున్నాడు. 

“ఇక్కడ సిర్ఫ్ ఇంటర్నెట్టే నహీ.. షాం కో హం ఒరాకిల్, జావా భీ సిఖా దేగా. పొద్దు గూకులా పేకాట భీ ఇధర్ చలేగ ” 

“యేంటి పేకాట కూడానా?” ఆ మాట వింటూనే చంచల్ మూర్తి ఎగిరి గంతేసి లోపలికి దూకి, వెనకాలున్న మరో ముగ్గురితో నాలుగో హేండుగా మారిపోయి చతుర్ముఖ పారాయణంలొ క్షణాల్లో సెటిల్ అయిపోయాడు. 

“చచ్చాంపో. ఇంక యీ మూర్తి గాణ్ణి ఇప్పట్లో బయటకి లాగటం మన వల్ల కాదు. కొంచెం సేపు వేడి వేడి బజ్జీలు, టీ లాంటివేమైనా కొట్టిస్తాడేమో షాపు వాడినడగండిరా” నీరసంగా కూలబడ్డారు మిత్ర బృందం. ఓ అరగంట పోయాక మూర్తి ని పిలిచాదు గోపి “మా టిఫిన్లు అయినాయి, ఇంక నీ పేకాట నించి లే.., ఇప్పుడు టైము ఎంతయ్యిందో తెలుసా?” 

కుడిచేత్తో ఆఠీణ్ రాణిని కింద పడేసి, కళావరు రెండు తీసుకుని, పేకని మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకొని ఎడం చెయ్యి గొపి ముఖం కెసి ముందుకు చాపాడు. టైము చూసుకో మన్నట్లుగా. “వీడి పేకట పిచ్చ పందులు తోల.. కనీసం టైము చూసుకొనే టైము కూడా లేదు వెధవ కిప్పుడు. ముక్కూ మొహం తెలీక పోయినా వాళ్ళతో రెచ్చిపోయి మరీ ఆడేస్తున్నాడు చూడు” బిల్లు కట్టడానికి షాపు వాడి చేతిలో వంద రూపాయల నోటు పెడుతూ చెప్పాడు. నోటుని యెగా దిగా చూసి వెనక్కి పావలా చిల్లర ఇచ్చాడు. “యేమిటీ యీ బజ్జీలు, చాయి కలిపి తొంభై తొమ్మిది రూపాయల ముప్పావలానా?” వెంకట్రావు గారు తన గణిత పరిజ్ఞానాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ వేళ్ళు తెరుస్తూ మూస్తూ అవస్తలు పడుతున్నారు. 

“ఫిర్? ఉస్ చారనా భీ అక్కర్లేకపోతే వాపస్ దేవ్.” హుంకరించాడు షాపు వాడు. గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసిన బిన్ లాడెన్ లా వున్న షాపు వాడు.. కొట్టినా కొట్టవచ్చు నని కొంచెం తగ్గాడు వెంకట్రావు గారు. ఒకవేళ కొంపదీసి బిన్లాడెనే ఇండియా పారిపోయీ యీ పల్లె ప్రాంతాల్లో ఇలా కంప్యూటర్లూ, ఇంటర్నెట్టూ పెట్టుకు బతికేస్తున్నాడేమొ అన్న అనుమానం కూడ పెద్దాయనకు రాక పోలేదు. తొందరగా అక్కడ్నుంచి కదలకపోతే ఏ. కే. 47 తో కాల్చినా దిక్కులేదని , “ఇదిగో చెంచు ముర్తీ.. పద పద మిగతా పేకాట రాత్రికి హోటల్లో ఆడుకోచ్చులే”లోపల చంచల మూర్తి మాత్రం నిదానంగా మూడు సార్లు పేకని అటూ ఇటూ షఫుల్ చేసి, కట్టలోంచి వచ్చిన ఒక ముక్కని చిద్విలాసంగా తన ముక్కల మధ్య వుంచాడు. పక్కన ప్లేటు లోంచి ఒక మెరపకాయ బజ్జీని మధ్యకు కొరికి, కచా పిచా నముల్తూ, అక్కడి ముగ్గురి అగంతకులనీ ఒకసారి తేరిపార జూసి, చిన్నగా నవ్వి, చేతిలోని ముక్కల్ని మరొసారి విడి విడిగా బ్రేక్ చేసి టేబుల్ మీద పరిచి గట్టిగా చెప్పాడు, “షో”. “వీడి పేక చాతుర్యానికి పాడె కట్టా.. పెద్ద పండితుడి లా ఆ పోజు చూడు. షో చెప్పడానికి పెద్ద సీనే చేస్తున్నాడిక్కడ. బాబూ ఇంకా లే.. కాసేపు ఇక్కడే వుంటే, యీ బిన్ లాడెన్ గాడు మన అందరి దగ్గరున్న డబ్బంతా లాక్కునేలా వున్నాడు.” ఆ నలుగురూ చంచల మూర్తిని బలవంతంగా రెక్కలు పట్టి బయటకు లాగారు. 



ఆ రాత్రి ముందుగా అనుకున్నట్టుగా వెంకట్రావు గార్ని హొటల్లో ఒక రూంలో వుండమని, బుక్ చేసిన రెండో రూములో మిత్రులు నలుగురూ చేరారు. తిరిగి తిరిగి వున్నందువల్ల పెద్ద శాల్తీ తొందరగానే నిద్రలోకి జారుకుంది. పక్కరూం లోంచి వెంకట్రావు గురక ఇవతలి రూం లోని మిత్రులకు గులాం ఆలిఖాన్ వాద్య నాదం లా లయ బధ్ధంగా వినిపిస్తోంది. మొదటి సారిగా జాతికి స్వాతంత్రం వచినంత సంతోషం గా వుంది వాళ్ళకి. గంతులు వేస్తున్నారు. ఈంక రక రకాల రంగుల మందు సీసాలు, సొడా బుడ్లు, వేడీఇ వేడీ బిర్యానీ పొట్లాలూ, చిప్సూ, జీడిపప్పు ప్యకెట్లూ ఏదీ తక్కువ లేకుండా సిసలైన బ్యాచిలర్ల మందు పార్టీకి ఆ రూంలొ రంగం సిధ్ధం చేశారు. చంచల మూర్తి అయితే ఎందుకైన మంచిదని మరో రెండు కొత్త పేక దొంతులు కూడ కొని తెచ్చాడు. నైటు క్లబ్బుని తలదన్నే మందు వాతవరణం వెల్లి విరుస్తోందా గదిలో. 

రాత్రి సుమారు మూడు గంటల దాక ఆడుతూ ..చిత్తుగా తాగుతూ తలుపులు మూసుకోకుండానే నిద్రలోకి జారు కున్నారు మిత్రులు. అప్పుడే వూహించని సంఘటనొకటి జరిగింది. ఆ హోటల్లో యేవో డ్రగ్సు మారకం, బ్లూ ఫిల్ములూ, వ్యభిచారల్లాంటివి జరుగుతున్నయని టిప్పు దొరికి, వానులోంచి పోలీసులు సడెన్ గా ప్రతి రూమూ చెకింగు కోసం రైడుకు దిగబోతున్నారు. అయితే తెల్లవారుజామునే నిద్ర లేచే అలవాటున్న వెంకట్రావు పోలుసుల వాను అగిన అలజడి కి లేవటం, రాబోతున్న ప్రమాదాన్ని గ్రహించి.. పక్క రూము లో అస్తవ్యస్తం గా లుంగీలు ధరించి చెల్లా చెదురుగా పడుకొని వున్న గోపీ బృందాన్ని చూసి, ఖాళీ బాటిళ్ళనీ, తినేసిన ఫుడ్డు పొట్లాల్నీ పేక ముక్కల్నీ చక చక కవర్లల్లో పడేసి కిటికీ లోంచి బిల్డింగు వెనక వైపు దూరంగా పారేసి క్షణాల్లొ శుభ్రం చేసేశారు. పైగా అదే రూం లో పక్కనే ఖాళీగా వున్న సోఫా కుర్చీలో తానూ ముడుచుకొని అమాయకంగా పడుకొన్నారు కూడా. పోలీసు బూట్ల చప్పుడు చేసుకొంటూ ఆ గదిలోకి వచ్చి బాచిలర్సుతో తమ దైన శైలిలో అనుమానపు ప్రశ్నలు మొదలెట్టారు. 

అపుడు వెంకట్రావు గారు కలగ చేసుకొని…” అయ్యా వీళ్ళు నా మనవళ్ళండీ.. అందరం విహార యాత్రకని హైద్రాబాదు నుంచి వచ్చాం..” ఆయన నాన్ స్టాప్ పాతకాలం వాగ్ధాటికి పొలీసులకి ఇంక అక్కడ టైము వేస్టనిపించి సారీ చెప్పి మరీ వెళ్ళి పోయారు. ఇంత ఆట పట్టించిన వెంకట్రావు గారు సమయానికి అడ్డు చక్రం వెయ్యక పోయి వున్నట్లయితే, యీ పాటికి పోలీసు వ్యాన్లో వుండి పొద్దున్నే వూచలు లెక్కబెట్టే వాళ్ళం అన్న నిజం తల్చు కుంటుంటే వాళ్ళకి వెన్నులొ ఎక్కడో వణుకు తగ్గట్లేదు. తాము చేసిన వీరంగానికి జైల్లో ఇరుక్కున్నట్టయితే నిజంగా ఎంత పరువు నష్టమో కదా! అమాంతం నలుగురూ వెంకట్రావు గారి కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడాయన వాళ్ళకి ఆ ఉషొదయాన చ్చాట్టర్ బాక్స్ చ్చాందసుడి లా కాదు.. సాక్షత్తూ తమని కాపాడిన చక్రధారి లాగ కనిపిస్తున్నారు! 
---------------------------------------------------------- 
రచన - ప్రసాద్ కొమ్మరాజు, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో 
--------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు


పౌర్ణమి

సాహితీమిత్రులారా!
డైరీ శీర్షికలో మంజీర గారి రచన ఈ పౌర్ణమి
ఆస్వాదించండి-

ఎన్ని సార్లు అడిగాను, ఒక్క పౌర్ణమికైనా కలిసుందామని.
-------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
హరిః ಓమ్
కళాపూర్ణోదయం -7: శల్యాసురుడు

సాహితీమిత్రులారా!

కళాపూర్ణోదయం ఏడవభాగం ఆస్వాదించండి-

(క్రితం భాగంలో రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్రి స్త్రీ అని చెప్తుంది. అందరూ ఆశ్చర్యంతో అదెలా జరిగిందో చెప్పమంటారు. ఆమె సుముఖాసత్తి మణిస్తంభులు అతని కన్నవారని, ఆ వృత్తాంతం వివరిస్తోంది. సుముఖాసత్తిని మణిస్తంభుడు కాళికాలయంలో బలి ఇచ్చి నప్పుడు ఆమె “నా మాట నిజమయ్యేట్టు చూడు” అని చివరి మాటగా అని మరణించినందువల్ల అది నిజమై ఆమె మాట వరసకి అన్న మాట “నువ్వు స్త్రీవి ఐతే నేను పురుషుడి నౌతాను” అనేది అక్షరాల జరుగుతుంది. అలా సుముఖాసత్తి మణిస్తంభుడి గాను, మణిస్తంభుడు సుముఖాసత్తి గాను రూపాంతరాలు చెందుతారు. ఇక చదవండి.)



“అలా మారిన సుముఖాసత్తీ మణిస్తంభులు సింహవాహనం మీద ఆకాశంలో తిరుగుతూ ఒక అద్భుతమైన నగరాన్ని చూశారు. అప్పుడు సుముఖాసత్తి (రూపంలో వున్న మణిస్తంభుడు) “ఇది ఎంతో మనోహరమైన పురం, నేనిదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్దామని అనిపిస్తున్నది” అన్నది. అని తన సింహవాహనాన్ని నేలకు దించింది. వాళ్ళిద్దరూ ఊరిబయట నడుస్తున్నారు.

సరిగ్గా అప్పడే ఆ పట్టణానికి రాజైన సత్వదాత్ముడు వాహ్యాళికి వెళ్ళి వస్తూ ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు.

మన్మథుడి ప్రభావంతో రకరకాల వికారచేస్ఠలు చేస్తూ అతను ఆమె వంక చూస్తే,

ఆమె కూడ జారుతున్న పైటను సవరించుకుంటూ తలవాల్చింది.



అప్పుడతను తన గుర్రం దిగి ఆ సిద్ధుడి దగ్గరకు వెళ్ళి “మహాత్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి కెళ్తున్నారు? మీ పేరేమిటి? ఈ సుందరి మీకేమౌతుంది?” అనడిగాడు.

ఆ సిద్ధుడు అవసరం ఐనంతవరకు తన విషయం చెప్పి ఆమె తన భార్య అని వివరించాడతనికి.

“ఎలాగోలా ఈమె నా కళ్ళముందు ఉండేట్టు చూస్తే ఆ తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు” అని దొంగవినయంతో అతను “మిమ్మల్ని కొన్నాళ్ళు నా ఇంట్లో ఉంచుకుని సేవలు చేసే భాగ్యం నాకు కలిగించండ”ని వేడుకున్నాడు. మణిస్తంభుడు సుముఖాసత్తి వంక చూస్తే, ఆమె “అలాగే, ఎక్కడైతే మనకేం?” అంది.

అప్పుడు వాళ్ళని కొత్తపల్లకి మీద ఎక్కించి తన ఇంటికి తీసుకెళ్ళాడు సత్వదాత్ముడు.

అన్ని సౌకర్యాలు సమకూర్చాడు.

స్వయంగా ఎన్నో సార్లు తనే వెళ్ళి వాళ్ళకి పరిచర్యలు చేసాడు.

తగినవాళ్ళ చేత ఆమె తనదగ్గరకు వస్తుందేమో అడిగించాడు.

అందుకామె “ఇప్పుడు నాకు గర్భచిహ్నాలు కనిపిస్తున్నాయి. సిద్ధుడి సంతానాన్ని అతనికి ఇవ్వకుండా ఇంకొకరితో కలవను నేన”ని బదులుచెప్పి పంపింది.



అప్పుడామెకు ఒక శుభముహూర్తంలో ఈ మహారాజు కళాపూర్ణుడు జన్మించాడు.

అలా బ్రహ్మ అమోఘవాక్కు, సరస్వతి వరమూ నిజమయ్యాయి.

ఆ తర్వాత వాళ్ళిద్దరు తమతమ తొలిరూపాల్ని ధరించారు సుముఖాసత్తి రూపంలో వున్న మణిస్తంభుడు అలా మారుదామని చెప్తే మణిస్తంభుడి రూపంలో ఉన్న సుముఖాసత్తి అలాగేనని అలా అనడంతోనే.

ఇప్పుడు యోగాభ్యాసం చేసుకుంటూ వాళ్ళిద్దరూ కాసారపురంలోనే ఉంటున్నారు. వాళ్ళనే అడిగి ఈ విషయం అంతా తెలుకోవచ్చు కావాలంటే!



ఇతను ఎప్పుడు జన్మించాడో అప్పుడే విచిత్రంగా ఇతనికి యౌవనం ప్రాప్తించింది.

యౌవనం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే స్వభావుడనే సిద్ధుడు వచ్చి ఇతనికి ఒక మణిని, అమ్ముల్ని, వింటిని ఇచ్చాడు.

ఈ రెంటిలో ఏది ముందో ఏది వెనకో ఎవరికీ తెలీదు.

ఆ సిద్ధుడే ఇతనికి కళాపూర్ణుడనే నామకరణం చేశాడు.

ఇతని సద్యోయవ్వనాన్ని గురించి విన్న సత్వదాత్ముడు “ఇతనెవరో మహాపురుషుడు; ఇతని తల్లిని నేను కామించి పాపం చేశాను; ఏమిచ్చి ఐనా సరే దీన్ని వాళ్ళు మరిచేట్టు చెయ్యాల”నుకుని తన రాజ్యాన్ని ఇతనికి ఇచ్చి తను మంత్రిగా వుండి సేవిస్తున్నాడు.” అని చెప్పిందా బాలిక.



అప్పుడు అలఘువ్రతుడు మళ్ళీ అడిగాడామెని “ఈ స్వభావుడనే సిద్ధుడెవరు? అతను మణిని, శరచాపాల్ని కళాపూర్ణుడికి ఎందుకిచ్చాడు?” అని.

దానికి ఆ బాలిక ఇలా అంది “ఆ స్వభావుడనే సిద్ధుడు సుముఖాసత్తికి తండ్రి. ఆమె పుట్టిన తర్వాత అతను దేశాంతరాలకు పోయి తిరుగుతూ మాహురీపురం చేరాడు. అక్కడ అన్ని యోగరహస్యాలూ తెలిసిన దత్తాత్రేయుడిని తన తపస్సుతో ప్రసన్నుడిని చేసుకున్నాడు. సకల యోగాలు తెలుసుకున్నాడు” అంటూ యోగవిద్య గురించి విస్తరంగా వివరించింది.



“ఆ తరవాత ఆ స్వభావసిద్ధుడు తన యోగసాధనకి అనుకూలమైన స్థలం కోసం చూస్తూ తిరుగుతూ తన ఊరు చేరుకుని అక్కడి శతతాళదఘ్న సరస్సులో నివాసం ఏర్పరుచుకున్నాడు.

అంతలో తన అల్లుడైన శాలీనుడు ఆ మడుగులో దూకినప్పుడు అతన్ని కాపాడి వయస్‌స్తంభన మణి మొదలైన వాటిని అతనికిచ్చి పంపాడు. ఐతే పోయిన బంధాల్ని మళ్ళీ తగిలించుకోవడం ఎందుకని తమ బంధుత్వాన్ని గురించి అతనికి చెప్పలేదు.



తర్వాత కొంతకాలం గడిచాక విధివశాత్తు అతను సరస్సులో నుంచి బయటకు వచ్చి శ్రీశైలానికి వెళ్ళాడు.

అక్కడి వింతలకు ఆశ్చర్యపడుతూ, ఆ శ్రీపర్వతాన్నెక్కి, మల్లికార్జుడికి పూజలు చేసి ఆ ప్రాంతాలలో విహరిస్తుంటే

భృగుపాతానికి సిద్ధమౌతోన్న మణికంధరుడు కనిపించాడతనికి.

“ఎవర్నువ్వు? ఈ సాహసానికి ఏమిటి కారణం?” అని అడిగాడతన్ని.

అప్పటివరకు జరిగిన తన కథంతా అతనికి వినిపించాడు మణికంధరుడు.



అందులో వినపడిన తన అల్లుడూ కూతుళ్ళ విషయాలు విని ఆశ్చర్యపడ్డాడు. తనకు వాళ్ళతో ఉన్న సంబంధం గురించి అతనికి చెప్పాడు.

“నారదశిష్యుడివి, కృష్ణుడి మెప్పు పొందావు, గంధర్వజాతి వాడివి. ఇవి చాలు నీకు మరో గొప్ప జన్మ కలగటానికి. ఇంకా ఏంకావాలని ఈ భృగుపాతానికి సిద్ధమయ్యావు?” అని అడిగాడతన్ని.

“ధనవంతులు, శుచివర్తనులూ ఐన తల్లిదండ్రులకు జన్మించాలని నా కోరిక” అన్నాడు మణికంధరుడు.

“అలా ఐతే, నా కూతురూ అల్లుడు తల్లిదండ్రులు కావాలని కోరుకో. దాని వల్ల నాకు తృప్తిగా వుంటుంది. అప్పుడు నీకు నచ్చే మహోపకారం కూడ చేస్తాను.” అన్నాడా సిద్ధుడు.

“ఇదివరకు ఒకసారి నేను ఆత్మరక్షణ కోసం మా గురువు గారిని ఒక ఖడ్గం కావాలని అడిగితే ఆయన ఒక దివ్యఖడ్గాన్ని సృష్టించి ఇచ్చాడు. ఇస్తూ, ఇకనుంచి నీ వంశం క్షాత్రవంశం కాబోతోంది అని సెలవిచ్చాడు. దాన్ని బట్టి కూడ నువ్వు నాకు మనవడివై పుట్టటం అనుకూలమౌతుంది. రాజువై ప్రపంచాన్ని పరిపాలిస్తావు. ఇది తథ్యం” అన్నాడు సిద్ధుడు.

“నిజమే. వచ్చే జన్మలో నేను రాజును కావటానికి ఇంకా కారణాలున్నాయి. అంతకన్నా పవిత్రులైన వాళ్ళ ఇంట పుట్టటం కోసమని ఈ భృగుపాతానికి నిశ్చయించుకున్నాను. అయితే, ఇంకా ఒక బాధ నాకు మిగిలి వుంది. అదేమిటంటే, రాజ్యమనే మహాభూతం పట్టినవాళ్ళకు ఎవరికైనా అప్పటివరకూ లేని గుడ్డితనం, మూగతనం, చెవుడూ వస్తాయి. వేదశాస్త్రవిదుల గోష్టుల్తో వాటిని పోగొట్టుకోవచ్చుననుకుంటే భోగాల మీద ఆశ లేనందువల్ల అలాటివారు రాజుల దగ్గర చేరరు. ఈ నా బాధ నివారించటానికి మీరే ఏదైనా మార్గం ఆలోచించండి” అన్నాడు మణికంధరుడు.

“అలా ఐతే, నీకెప్పుడూ విజయాన్ని కొనితెచ్చే విల్లంబుల్ని సృష్టించి ఇస్తాను. అలాగే ఓ అద్భుతమైన మణిని కూడ ఇస్తాను. అది వేదశాస్త్రవిదుల్ని ఆకర్షిస్తుంది” అంటూనే తన ప్రభావంతో వాటినన్నిటినీ సృష్టించాడా సిద్ధుడు. “నువ్వు వచ్చే జన్మలో ఎప్పుడైతే జన్మిస్తావో అప్పుడే ఇవి నీకు అందించే బాధ్యత నాది” అని చెప్పాడతను.



వీళ్ళిలా మాట్లాడుకుంటూండగా శివరాత్రి పూజలకు అక్కడికి వచ్చి వున్న మదాశయుడు, అతని భార్య రూపానుభూతి, అతని పురోహితులు ఆ పక్కనే వెళ్తూ అక్కడికి వచ్చారు. ఆ సిద్ధుని పేరడిగి తెలుసుకుని అతనికి సాష్టాంగ ప్రణామాలు చేశారు.

మదాశయుడు వినమ్రుడై, “నేను దత్తాత్రేయుడిని తలచి ఎన్నో ఆరాధనలు చేశాను. ఒకరోజు ఆయన నాకలలో కనిపించి తన భక్తుడు స్వభావసిద్ధుని వల్ల నా కోరిక తీరుతుందని చెపాడు. అప్పటినుంచి నేను మీ గురించి వెతుకుతూ తిరుగుతున్నాను. ఇప్పటికి నా పుణ్యం ఫలించింది” అన్నాడు.

“ఇదంతా ఆ దత్తాత్రేయుడి మహిమ. నీ కోరిక ఏమిటో చెప్పు” అన్నాడా సిద్ధుడు.

“అందర్నీ జయించటం, మంచి సంతానాన్ని పొందటం నా కోరికలు” అన్నాడతను.

“ఓహో, అలానా! ఈ మణికంధరుడికి వచ్చే జన్మలో విజయసిద్ధి కోసం ఈ విల్లుబాణాల్ని సృష్టించాను. అందువల్ల ఇతన్ని తప్ప మిగిలిన రాజులందర్నీ నువ్వు జయిస్తావు”

“అంతే చాలు. అప్పటికి ఈ మణికంధరుడి సంగతి చూడటానికి నేనొక్కణ్ణి చాలులే” అన్నాడతను గర్వంగా.

దాంతో సిద్ధుడికి కోపం వచ్చింది. “ఈ ధనుర్బాణాలతో అతను నిన్ను జయించటం నిశ్చయం. అంతేకాదు, నువ్వూ నీ భార్యా కూడ ఇతనికి బానిసలై సేవలు చేస్తారు” అని శపించాడతన్ని.



మదాశయుడి పురోహితులు సిద్ధుణ్ణి బతిమాలారు. ఐనా అతను “నా మాటకు తిరుగులేదు. ఈ మణికంధరుడు మళ్ళీ పుట్టేవరకు మీ రాజు అందర్నీ జయిస్తాడు. ఆ తర్వాత మాత్రం అతనికి సేవ చెయ్యటం తప్పదు. ఐతే ఆ రాజు దగ్గర వుండే ఒక మణిమహిమ వల్ల ఈ మదాశయుడికి సంతానప్రాప్తి కలుగుతుంది. అంతే కాదు, మీకు కూడ ఆ మణి ఆనందాన్నిస్తుంది” అని ఆ స్వభావసిద్ధుడు తన దారిన వెళ్ళాడు. మదాశయుడు కూడ సకల రాజుల్నీ జయించాడు” అని వివరించింది మధురలాలస.



“మరి సిద్ధుడి నుంచి వరాలు పొంది వెళ్ళిన మణికంధరుడు ఏం చేసాడో కూడా చెప్పు తల్లీ!” అని అడిగాడు అలఘువ్రతుడు మధురలాలసని.



“మణికంధరుడు భృగుపాతానికి అవసరమైన విధులన్నీ నిర్వర్తించాడు. కొండ మీద నుంచి కిందికి దూకటానికి సిద్ధమయ్యాడు.

ఐతే ఇంతలో హఠాత్తుగా అక్కడ ఉత్సవానికి వచ్చిన వాళ్ళంతా ప్రాణాలు అరచేత పట్టుకుని తలో దిక్కు పరిగెత్తసాగారు.

అతను ఆశ్చర్యంతో చూస్తుండగా ఒక స్త్రీ అతని దగ్గరికి పరుగెత్తుకు వచ్చి ఓ ఖడ్గం అతని చేతిలో పెట్టింది, “నీ భృగుపాతానికి సమానమైన ఫలితం వస్తుంది, ముందు ఈ జనాన్ని రక్షించు” అని అతన్ని తొందర పెడుతూ.



ఇంతలో భీకరంగా ఏదుముళ్ళ వాన కురిసింది! వెండిగునపాలో, వెండి కట్లతో వున్న ఇనప గునపాలో అన్నట్లున్నాయా ముళ్ళు!

మణికంధరుడికి ఏమీ అర్థం కాలేదు. ఆమెనే అడిగాడు “ఏమిటీ ఏదుముళ్ళ వాన? ఏం చెయ్యమని ఈ కత్తిని నాకిచ్చావు? ఇంతకూ నువ్వెవరివి?” అని.

దానికామె “అదుగో వస్తున్నాడు రాక్షసుడు ఏదుపంది రూపంలో! వాడు ఇటురాకముందే చంపెయ్యి” అని చెప్పింది హడావుడిగా.

మణికంధరుడికి మహోత్సాహం కలిగింది. కత్తితో విచిత్రవిన్యాసాలు చేస్తూ ముందుకు కదిలాడు. “ఇదెంత పని? ఇప్పుడే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తా. నువ్వు మిగిలిన వాళ్లకి ధైర్యం చెప్పు” అంటూ తన విన్యాసాల్తో ముళ్ళని ఖండిస్తూ ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. “ఓరి మాయావీ, నిన్నిప్పుడే యముడికి కానుక చేస్తా చూడు” అని అతనంటే, “వీడెవడో వెర్రివాడిలా వున్నాడు, తనెవరో నేనెవరో తెలుసుకోకుండా నా మీదికి వస్తున్నాడు” అని నవ్వుకున్నాడా రాక్షసుడు. ఇద్దరూ భయంకరంగా పోరాడారు. మణికంధరుడు తన కత్తితో అతని తలని ఖండించాడు, అదే సమయంలో ఆ రాక్షసుడి ముళ్ళు రక్షణ లేని అతని శరీరంలోకి దూసుకుపోగా తనూ మరణించాడు”.



అలఘువ్రతుడికి ఇంకా కుతూహలం కలిగింది “ఎవడా రాక్షసుడు? అతన్ని చంపించిన ఆ స్త్రీ ఎవరు?” అని అడిగాడు.



“ఆ రాక్షసుడు మహిషాసురుడి మేనమామ కొడుకు శల్యాసురుడనే వాడు. దుర్గ మహిషాసురుణ్ణి చంపినందువల్ల ఎలాగైనా ఆమెకు కీడు చెయ్యాలని సంకల్పించాడు. ఐతే, అందుకు జాగ్రత్తగా పథకాలు ఆలోచించాడు. సరైన పథకం దొరికేవరకు చాలా సాధువులాగా నటిస్తూ ఒకసారి ఒక వనంలో తిరుగుతుండగా అభినవకౌముది అనే అప్సరస కనిపించిందతనికి. ఆమెను చూసి మోహించాడు. ఆమెకి తన కోరిక తెలిపాడు.

ఐతే అభినవకౌముది అందుకు అంగీకరించలేదు. వాడికి కోపం వచ్చి “నన్ను కాదన్న నిన్ను ఇంకెవడూ చేరకుండా చూస్తాను నేను, నా ప్రియురాలి దగ్గరకు రావటానికి ఎవడికి గుండెలుంటాయి?” అని బెదిరిస్తే, “అలా ఐతే, నిన్ను చంపిన వాడినే నేను వరిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ” అని ఎదురుచెప్పింది అభినవకౌముది.

ఎంతో కోపం వచ్చినా అణుచుకున్నాడు వాడు, “ఎప్పటికైనా మనసు మారకపోతుందా!” అని.



ఆమె “వీడిని చంపే వీరుడు ఎవరా?” అని వెదుకుతుంటే, “నన్ను చంపదలుచుకున్న వాడు చచ్చే మార్గం ఏమిటా?” అని వాడు వెదకసాగాడు.

అలా వాడు ఒకసారి మృగేంద్రవాహన ఆలయానికి వెళ్ళి, అక్కడ రాసి ఉన్న వాటిలో, “ఇక్కడ గండకత్తెర వేసుకునే సాహసికుడు మళ్ళీ బతకటమే కాకుండా తనని చంపబోయే వాడిని చంపుతాడు” అని చదివి అలా చేసి ఇక తనకు ఎదురులేదని గర్వంతో ఆ ఆలయాన్నే నాశనం చేశాడు వాడు.

అభినవకౌముది కూడ ఆ మహాశక్తి మహిమలు విని ఆ గుడి దగ్గరకే వచ్చింది. అప్పుడు అక్కడే వున్నాడు శల్యాసురుడు కూడ.



“ఇంకెక్కడికి వెళ్ళగలవు? ఇక్కడ రాసిన ప్రకారంగా చేసి నన్ను చంపదలుచుకున్న వాడిని చంపే వరం సంపాయించాను. ఇక నీ ప్రతిజ్ఞ నెరవేరటం కల్ల!” అన్నాడు వాడు. ఏం చెయ్యాలో తోచలేదామెకు. ఆ శిధిలాయలంలో వున్న దేవి దగ్గరకు పరుగెత్తింది, తనకో దారి చూపమని ప్రార్థించింది. ఆ దేవి కూడ వాడు తన ఆలయాన్ని పడగొట్టానికి కోపగిస్తూ ఆమెకు వెంటనే ప్రసన్నురాలై, “వీడి వరం జరగక తప్పదు. ఐతే, తనని చంపదలుచుకున్న వాడు చస్తాడని తప్ప తను చావడని కాదు ఆ వరం. మణికంధరుడనే గంధర్వకుమారుడు ఒకడున్నాడు. ఒక కారణం చేత శక్తివంతమైన ఒక కత్తిని ఇక్కడ వదిలి వెళ్ళాడు. దాన్ని నువ్వు తీసుకెళ్ళి అతనికిచ్చి అతని చేత ఈ రాక్షసుణ్ణి చంపించు. అప్పుడు అతను కూడ చావకతప్పదు కాని ఆ తర్వాతి జన్మలో నువ్వు అతన్ని వరించి నీ ప్రతిజ్ఞ చెల్లించుకో. ఇప్పుడతను శ్రీశైలంలో భృగుపాతానికి సిద్ధమౌతున్నాడు. త్వరగా వెళ్ళి ఈ రాక్షసుణ్ణి చంపితే అతనికి భృగుపాతఫలం వస్తుమ్దని చెప్పు” అని ఉపాయం చెప్పింది దేవి.



పైట బిగించి, జుట్టు ముడివేసి, ఖడ్గాన్ని చేత బట్టి బయటకు వస్తున్న అభినవకౌముదిని చూసి శల్యాసురుడు భయపడ్డాడు ఆమె తనని చంపటానికి వస్తుందేమోనని! అలా ఐతే ఆమె మరణించాలి కదా!

“వద్దు, వద్దు. నువ్వు నామీదికి యుద్ధానికి వస్తే నీ ఇష్టదేవతల మీద ఒట్టు! అలాటి తెలివి తక్కువ పని చెయ్యకు” అని కంగారుగా చెప్పాడు.

“ఆపాటి తెలీదా నాకు? అలా చెయ్యనులే” అంటూ మంచి మాటల్తో వాడిని తన వెంట తీసుకుని శ్రీశైలానికి బయల్దేరింది అభినవకౌముది. కామాతురుడై వాడు కూడ వేరే ఆలోచన లేకుండా ఆమె వెంట వెళ్ళాడు.

కొంతదూరం వెళ్ళాక వాడికి అనుమానం వచ్చింది. “ఇలా ఇంక ఎంతదూరం వెళ్ళాలి? నా శక్తి నీకు తెలీదు, చూడు” అంటూ ముళ్ళు కురిపించి ఆ చుట్టుపక్కల వున్న చెట్లనీ, జంతువుల్నీ నాశనం చేశాడు. “నా మాట వినక పోయావంటే ఇలా అందరూ చస్తారు. అప్పుడా పాపం నీదే!” అని బెదిరించాడు. ఇంక ఆలస్యం మంచిది కాదని త్వరత్వరగా శ్రీశైలానికి చేరిందామె. ఆమె వెనకనే తన ముళ్ళని కురిపిస్తూ సాగాడు వాడు.



శ్రీశైలానికి చేరి, అక్కడ శివరాత్రి మహోత్సవానికి వచ్చిన భక్తులకు వాడి గురించి చెప్పి, “ఇక్కడి నుంచి పారిపొండ”ని హెచ్చరించి మణికంధరుడి దగ్గరికి వెళ్ళి అతని చేత వాడిని చంపించి, ఆ మణికంధరుడు మళ్ళీ కళాపూర్ణుడిగా జన్మిస్తే అతన్ని వెదుక్కుని వచ్చి అతన్ని వరించి స్వర్గానికి వెళ్ళకుండా అతనితోనే ఉండేట్టు ఒప్పుకుని అతన్ని గాంధర్వవివాహం చేసుకుంది.



మదాశయుడు కూడ స్వభావసిద్ధుడు చెప్పినట్లుగా రాజులందర్నీ జయించి గర్వంతో కాసారపురం మీదికి దండెత్తి వచ్చి ఈ రాజు చేతిలో ఓడిపోయి అప్పట్నుంచి అతనికి సేవకుడిగా వుంటున్నాడు తన భార్యతో సహా. వాళ్ళకు ఈ మణి దర్శనం వల్ల నేను పుట్టాను. తర్వాత వాళ్ళు సరస్వతీబ్రహ్మల కథలో చెప్పిన విధంగా (ఒక పురోహితుడు మణిని గట్టిగా నొక్కిన కారణాన) ఈ క్రముకకంఠోత్తరపురం నుంచి వెళ్ళి కొంతకాలం అంగదేశంలోనే ఉండి ఆ ప్రయాణం వల్ల నేను చిక్కిపోతే మళ్ళీ తిరిగివచ్చి నన్నిక్కడికి తీసుకువచ్చారు. ఈ మణిదర్శనం వల్ల నేను ఆరోగ్యవంతురాలి నయ్యాను. ఇంతకుముందే నా తల్లిదండ్రులు ఈ విచిత్రం కళాపూర్ణుడికి వివరించారు. పురోహితులు నలుగురూ కూడ ఈ మణి మహిమ వల్ల తిరిగి ఇక్కడికే వచ్చారు, అదిదో వాళ్ళే ఆ నలుగురు!” అని చూపించింది మధురలాలస.



“ఓ వింత బాలికా! మరి ఆ పురోహితులెవరు? వాళ్ళ కథ ఏమిటి?” అని అడిగాడు అలఘువ్రతుడు.

“వాళ్ళ కథ చెప్పేదేముంది? వాళ్ళు నలుగురూ నీ కొడుకులే!” అంది ఆ బాలిక నవ్వుతూ.



దానికి మహాశ్చర్యపోయాడతను. “అదెలా సాధ్యం? నా భార్యల్ని యౌవనంలోనే పొగొట్టుకుని అదీ నా కళ్ళ ముందే సముద్రంలో పడి మునిగిపోతుంటే చూసి అప్పట్నుంచి ఇంకెవరితోనూ సంబంధం పెట్టుకోని నాకు కొడుకులేమిటి? ఈ వింతకథల తల్లి ఏ విధంగా బట్టతలలకి మోకాళ్ళు ముడి పెడుతుందో గాని ఈ మాట మాత్రం నేను నమ్మలేను” అన్నాడతను రాజుతో.

(ఇంకా ఉంది)

----------------------------------------------------------

రచన: కె. వి. ఎస్. రామారావు,





--((**))--

కొలను – మొదటి భాగం(అనువాదకథ) 

సాహితీమిత్రులారా! 
ఆంగ్లం నుండి అనువదించిన కథను ఆస్వాదించండి- 
ఏపియా పట్టణంలోని మెట్రోపోల్ హోటలుకు యజమాని అయిన చాప్లిన్ నన్ను లాసన్ కు పరిచయం చేసినప్పుడు, లాసన్ పట్ల ప్రత్యేకమైన ధ్యాసను పెట్టలేదు నేను. అప్పుడు మేము హోటల్ లాంజ్ లో కూచుని కాక్టెయిల్ తాగుతున్నాము. ఆ ద్వీపానికి సంబంధించిన విషయాలమీద లోకాభిరామాయణం కొనసాగుతుంటే, వినోదం నిండిన ఉల్లాసంతో దాన్ని వినసాగాను. 

చాప్లిన్ తన సంభాషణ ద్వారా నాకు ఉత్సాహాన్నీ ఆనందాన్నీ కలిగించాడు. అతడొక మైనింగ్ ఇంజినీరు. తను సాధించిన వృత్తిపరమైన విజయాలకు అంతగా విలువ లేని ప్రాంతంలో స్థిరపడటాన్ని అతని ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చునేమో. ఆయన చాలా తెలివిగల మైనింగ్ ఇంజినీర్ అని చెప్పుకుంటారు అక్కడి వాళ్లందరూ. అతడు చిన్నగా వుంటాడు. శరీరం లావుగా కాకుండా సన్నగా కాకుండా మధ్యరకంగా వుంటుంది. వెంట్రుకలు నల్లగానే వుంటాయి. కాని, తలమీద మాత్రం అక్కడక్కడ జుట్టు నెరిసిపోయి కొంత పలుచగా వుంటుంది. మీసాలు చిన్నగా, కొంచెం కొక్కిరిబిక్కిరిగా ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎండ తగలడం చేతా, మద్యం తాగడం చేతా అతని ముఖం బాగా ఎరుపు రంగును కలిగి వుంటుంది. ఆ హోటలు పేరులో అట్టహాసం ఉన్నా దాని భవనం కేవలం రెండంతస్తులదే. దాన్ని అతని నలభై ఐదేళ్ల భార్య చక్కని అజమాయిషీతో పర్యవేక్షిస్తుంటుంది. సన్నగా పొడవుగా ఉండే ఆమె, ఆస్ట్రేలియా దేశస్థురాలు. చాప్లిన్ తరచుగా ఉద్రేకంతో, నిషాలో, భార్యపట్ల భయంతో ఉంటాడు. ఆ ద్వీపానికి కొత్తగా వచ్చినవారు కొద్ది రోజులు కాగానే చాప్లిన్ కూ అతని భార్యకూ మధ్య జరిగే కుటుంబ కలహాల గురించి వింటారు. భర్తను ఎప్పుడూ తన స్వాధీనంలో ఉంచుకోవటం కోసం ఆమె తన పిడికిలినీ పాదాన్నీ ఉపయోగిస్తుంది. అప్పుడప్పుడు భర్త బాగా తాగి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే, ఆమె అతణ్ని ఇరవై నాలుగు గంటలపాటు గదిలో బంధించడం, మరునాడు అతడు వరండాలో దీనాతిదీనంగా భార్యతో వేడుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్లకు అది వినపడటం మామూలే. 

చాప్లిన్ ఒక వింతైన, ఆసక్తికరమైన మనిషి. తన జీవితంలో చాలా ఎత్తుపల్లాలతో కూడిన వైవిధ్యం ఉందని చెప్తుంటాడతడు. అది నిజమో అబద్ధమో తెలియదు కాని, అతడు చెప్పేది వినాలనిపిస్తుంది. ఒకసారి అట్లా చెప్తున్నప్పుడు మధ్యలో లాసన్ రావటం నాకు అంతరాయం అనిపించి లోలోపలే విసుక్కున్నాను. చాప్లిన్ అప్పటికే బాగా తాగి వున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. నాకు ఇష్టం లేకున్నా అతని బలవంతం మీద మరో పెగ్గును తాగటానికి ఒప్పుకున్నాను నేను. చాప్లిన్ మెదడులో అప్పటికే మందకొడితనం ఆవహించిందని గ్రహించాను. మర్యాద ప్రకారం, ఆనవాయితీ ప్రకారం తరువాతి రౌండులో మద్యానికి నేనే ఆర్డరివ్వాలి, నాకిష్టం ఉన్నా లేకపోయినా. అప్పుడు చాప్లిన్ లో వదరుబోతుతనం ప్రవేశిస్తుంది. తర్వాత అతని భార్య చూపులు కోపంతో నిండిపోవటం ఖాయం. 

చాప్లిన్ ఆకారంలో లాగే లాసన్ ఆకారంలో కూడా ఎటువంటి ఆకర్షణా లేదు. అతడు కూడా సన్నగా చిన్నగా వుంటాడు. ముఖం కోలగా, చుబుకం చిన్నగా, ముక్కు పెద్దగా, కనుబొమల వెంట్రుకలు నల్లగా దట్టంగా వుంటాయి. ఈ ఆకార విశేషాలన్నీ అతని రూపానికి ఒక రకమైన వింత తరహాను ఆపాదించాయి. అతని కళ్లు చాలా నల్లగా పెద్దగా ఉంటాయి. ఆయన ఉల్లాసంగా కనిపిస్తాడు కాని, అది నిజమైన ఉల్లాసం కాదనిపిస్తుంది నాకు. అది ప్రపంచాన్ని మోసగించటం కోసం పైపైన అతడు ధరించే ముసుగు. అది అతనిలోని అల్పత్వాన్ని దాస్తున్నదనిపించింది. అతడు ఆహ్లాదంగా కనిపించినప్పటికీ, ఎందుకో కాని ఆ మనిషిలో కపటత్వం ఉందనుకునేవాణ్ని. తన బొంగురు కంఠంతో చాలా మాట్లాడేవాడు. చాప్లిన్, లాసన్ ఇద్దరూ తమ మందుపార్టీల గురించి చెప్పుకోవడంలో ఒకరినొకరు మించిపోతారు. ఇంగ్లిష్ క్లబ్ లో బాగా తాగిన రాత్రుల గురించీ, విపరీతంగా విస్కీ తాగుతూ వేటాడటం గురించీ, సిడ్నీకి వెళ్లినప్పుడు ఆ నగరంలో కాలు మోపిన దగ్గర్నుంచి తిరిగివచ్చే దాకా పూర్తిగా నిషాలో ఉండటం గురించీ వాళ్లు చెప్పుకునే ముచ్చట్లు అందరి నోళ్లలో గాథలుగా మారిపోయి ఇద్దర్నీ తాగుబోతులుగా మిగిల్చాయి. నాలుగు పెగ్గులు తాగింతర్వాత ఇద్దరికీ నిషా ఎక్కింది. కాని, ఇద్దరి తీరుల మధ్య చాలా భేదం వుంది. చాప్లిన్లో మొరటుతనం, నీచత్వం కనిపించగా, లాసన్ లో నిషా ఉన్నా సభ్యత కనిపించింది. 

ఆఖరుకు లాసన్ కొంచెం తూలుతూ కుర్చీలోంచి లేచి, “నేను ఇంటికి వెళ్తున్నాను. సాయంత్రం మళ్లీ కలుస్తాను” అన్నాడు. 
“మీ ఇంటావిడ బాగుందా?” అని అడిగాడు చాప్లిన్. 

“ఆఁ”, అని వెళ్లిపోయాడు లాసన్. ఆ ఏకాక్షర సమాధానం కొంచెం వింతగా అనిపించడంతో నేను తలెత్తి చూశాను. 

“మంచివాడు. నిజానికి చాలా మంచివాళ్లలో ఒకడు. కాని, పాపం బాగా తాగుతాడు. అతని మీద జాలి కలుగుతుంది” అన్నాడు చాప్లిన్, ఎటువంటి ఉద్వేగాన్నీ కనబరచకుండా. 

చాప్లిన్ చేసిన ఈ వ్యాఖ్యలో కొంత హాస్యం లేకపోలేదు. తర్వాత మళ్లీ, “తాగిన మత్తులో వున్నప్పుడు లాసన్ ఎదుటివాడితో పోట్లాడాలనుకుంటాడు” అన్నాడు చాప్లిన్. 

“అతడు తరచుగా నిషాలో వుంటాడా?” అని అడిగాను. 

“విపరీతంగా. వారంలో మూడునాలుగు రోజులు చిత్తుగా తాగుతాడు. అతడట్లా మారటానికి ఈ ద్వీపమే కాక ఎతెల్ కూడా కారణం” 

“ఎతెల్ ఎవరు?” 

“ఆమె అతని భార్య. రెండు జాతుల మిశ్రమంగా పుట్టింది. ముసలి బ్రెవాల్డ్ కూతురు. భర్త ఆమెను తీసుకు పోయాడు కాని, అక్కడి పరిస్థితిని ఆమె తట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ భార్యాభర్తలిద్దరూ కలిసి వుంటున్నారు. ఏదో వొకరోజు తాగుడు మూలంగా కాకపోయినా మరే ఇతర కారణం చేత ఐనా ఉరేసుకుని చస్తాడు లాసన్. అతడు మంచివాడే కాని, తాగినప్పుడు మాత్రం భరించలేనంత అరాచకత్వం నిండుతుంది అతన్లో” అని చప్పుడు వచ్చేలా త్రేన్పు తీశాడు చాప్లిన్. 

తర్వాత, “నేను పైకి వెళ్లి షవర్ కింద స్నానం చేస్తాను. ఆ చివరి పెగ్గును నేను తాగకుండా వుండాల్సింది. ఎప్పుడూ ఆ ఆఖరి పెగ్గే మనను బోల్తా కొట్టిస్తుంది” అన్నాడు. పైన వున్న స్నానాల గదిలోకి పోవాలని నిశ్చయించుకున్న అతడు కొంచెం సంశయిస్తూ మెట్లవైపు చూశాడు. తర్వాత అసహజమైన గాంభీర్యంతో లేచి నిలబడ్డాడు. మళ్లీ, “లాసన్ తో స్నేహం చేస్తే లాభమే. అతడు చాలా పుస్తకాల్ని చదివాడు. నిషాలో లేనప్పుడు ఎంత నెమ్మదిగా వుంటాడో! తల్చుకుంటే అది ఆశ్చర్యంగా వుంటుంది. చాలా తెలివైనవాడు కూడా. అట్లాంటి వాళ్లతో మాట్లాడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది” అన్నాడు. 

ఈ విధంగా లాసన్ గురించిన దాదాపు మొత్తం కథను కొన్ని వాక్యాల్లో నాకు చెప్పాడు చాప్లిన్. 

సాయంత్రం నేను సముద్రతీరం వెంట వాహ్యాళికి పోయి హోటలుకు తిరిగివచ్చి చూస్తే, అక్కడ లాసన్ కనిపించాడు. ఏ ఉద్వేగమూ లేని కళ్లతో లాంజ్ లోని పేముకుర్చీలో బాగా లోపలికి కూరుకుపోయినట్టుగా కూర్చుని వున్నాడు. మధ్యాహ్నం నుండి మద్యం తాగుతూనే వున్నట్టు అనిపించింది అతని వాలకం చూస్తే. అతనిలో మందకొడితనం కనిపించింది. చూపుల్లో వ్యాకులతా, ప్రతీకారభావంతో కూడిన కోపమూ ఉన్నాయని గ్రహించాను. ఒక్క క్షణం నా మీద దృష్టిని నిలిపాడతడు. కాని, నన్నతను గుర్తు పట్టినట్టు లేదు. అక్కడ పక్కనే డోమినో అనే పాచికల ఆట ఆడుతున్న ఇద్దరుముగ్గురు పురుషులు అతణ్ని చూడనట్టుగా తమ పనిలో మునిగిపోయారు. అతని వాలకంలోని ఆ సాదాసీదాతనమే అందుకు కారణం. నేను కూడా వాళ్లతో కలిసి ఆ ఆట ఆడటం మొదలు పెట్టాను. 

“మీరు చాలా కలుపుగోలు మనిషి” అన్నాడు నా పక్కన వచ్చి కూచున్న లాసన్ అకస్మాత్తుగా. 

అతడు కుర్చీలోంచి లేచి, వంగిన మోకాళ్లతో కొంచెం కుంటుతున్నట్టుగా తలుపువైపు నడిచాడు. మా ఆటా, ఆ వాతావరణం అతనికి హాస్యాస్పదంగా కనించాయా అనిపించింది. లాసన్ అక్కణ్నుంచి కదలగానే, ఆటాడుతున్నవారిలో ఒకడు కిసుక్కున నవ్వి “ఇవ్వాళ్ల బాగా తాగి వున్నాడు ఆయన” అన్నాడు. 

మరొకడు, “తాగి కూడా అతనిలాగా నింపాదిగా ఉండలేకపోతే అసలు తాగకపోవడమే మంచిదనిపిస్తుంది” అన్నాడు. 

ఆ నిర్భాగ్యుడు నిజానికి ఒకరకంగా ప్రేమ నిండిన వాడిలాగానే ఉన్నాడనీ, కాని విషాదాన్ని తలపింపజేయడానికి అవసరమైన దీనత్వమూ భయమూ అతని జీవితంలో ఉన్నాయనీ ఎవరూహిస్తారు? 

తర్వాత రెండుమూడు రోజుల వరకు లాసన్ కనపడలేదు. 

ఒకరోజు సాయంత్రం వేళ నేను హోటల్ మొదటి అంతస్తులోని వరండాలో కూచుని వున్నాను. అక్కణ్నుంచి హోటల్ ముందరి వీధి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు లాసన్ వచ్చి నా పక్కన వున్న కుర్చీలో కూర్చున్నాడు. అతనిలో నిషా వంటిది ఎంతమాత్రం లేదు, చాలా నెమ్మదితనం వుంది. యధాలాపంగా నాతో యేదో అన్నాడతడు. నేను కొంచెం ఉపేక్షతో జవాబిచ్చేసరికి సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా నవ్వుతూ “మొన్న నేను విపరీతంగా తాగి నిషాలో వున్నాను” అన్నాడు. 

నేను జవాబివ్వలేదు. నిజానికి అనటానికి ఏమీ లేదు కూడా. చుట్ట తాగుతున్న నేను దోమల్ని తరమటం కోసం పొగను నోటితో చుట్టూ ఊదాను. అక్కడి స్థానిక కూలీలు పని ముగించుకుని హోటలు ముందరి రోడ్డు మీదుగా తమ యిళ్లకు తిరిగి వెళ్తుండటం చూశాను. వాళ్లు పెద్దపెద్ద అంగలతో మెల్లగా, జాగ్రత్తగా, హుందాగా నడుస్తున్నారు. చెప్పులు లేని పాదాలతో వాళ్లు నడుస్తుంటే వింతైన శబ్దం వస్తోంది. వాళ్ల వెంట్రుకలు సాధారణంగా మెలితిరిగి కాని, వంపు లేకుండా కాని నల్లగా ఉంటాయి. అప్పుడు మాత్రం వాళ్ల వెంట్రుకలు తెల్లని పొడితో నిండి ఒక అసాధారణమైన ప్రత్యేకతను కనబరుస్తున్నాయి. వాళ్లు దృఢమైన శరీరాలతో పొడవుగా ఉన్నారు. వాళ్ల తర్వాత సాల్మన్ ద్వీపానికి చెందిన కాంట్రాక్టు కూలీల గుంపొకటి పాటలు పాడుకుంటూ వెళ్లింది. వాళ్లు బొగ్గులాంటి కారు నలుపుతో, ఎర్రరంగు వేసుకున్న వెంట్రుకల్తో, పెద్దపెద్ద తలలు కలిగిన సమోవా ద్వీపవాసులకన్న పొట్టిగా, చిన్నగా ఉన్నారు. మధ్యమధ్య తెల్ల జాతీయులు తమ గుర్రపు బగ్గీల్లో రోడ్డు మీదుగా పోవటమో లేక హోటలు ప్రాంగణంలోకి రావటమో చేస్తున్నారు. ఎదురుగా వున్న ప్రశాంతమైన సముద్రపు నీళ్లలో నిలిచి వున్న రెండుమూడు ఓడలు తమ సొగసును కనబరుస్తున్నాయి. 

“ఇట్లాంటి ప్రదేశంలో ఫుల్లుగా తాగటం తప్ప చేయటానికి పనేమి ఉంటుందో తెలియదు నాకు” అన్నాడు ఆఖరుకు లాసన్. 
ఏదో అనాలి కదా అనుకుని “సమోవా ద్వీపం మీకు నచ్చలేదా?” అన్నాను. 

“ఈ ద్వీపం అందంగానే వుంటుంది” అన్నాడతడు. 

ఆ వాక్యం సమోవా ద్వీపపు అద్భుతమైన అందాన్ని వర్ణించడానికి ఎంతమాత్రం సరిపోలేదనిపించింది. నేను నవ్వి అతనివైపు తిరిగాను. అతని కళ్లలో భరించలేనంత ఆవేదన కనిపించింది. వాటిలో అనంతమైన విషాదపు లోతులున్నాయి. అటువంటి భావోద్వేగాన్ని అతడు చూపగలడని నేను అసలే ఊహించలేదు. కాని, అతని ముఖంలోని ఆ భావం వెంటనే మాయమై అతడు నవ్వాడు. ఆ నవ్వు సాదాసీదాగా, కొంచెం అమాయకంగా వుంది. దాన్తో అతని ముఖకవళిక మారింది. దాని మూలంగా నాలో అతని పట్ల మొదటిసారిగా కొంత విముఖత ఏర్పడింది. 

“నేనిక్కడికి వచ్చిన కొత్తలో ఊరంతా తిరిగేవాణ్ని” అని ఒక్క క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు లాసన్. తర్వాత మళ్లీ, “మూడు సంవత్సరాల పాటు ఈ ద్వీపాన్ని వదిలి దూరంగా ఉన్నాను. కాని, తర్వాత తిరిగివచ్చాను” అన్నాడు. ఆ పైన కొంచెం తటపటాయించి “మళ్లీ ఇక్కడికే రావాలని నా భార్య పట్టుబట్టింది. ఆమె ఇక్కడే పుట్టిందని మీకు తెలుసు కదా” అన్నాడు. 

“ఔను, తెలుసు” అన్నాను. 

అతడు మళ్లీ మౌనం వహించాడు. తర్వాత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ గురించి ఏదో వ్యాఖ్య చేశాడు. “మీరు వైలిమాకు వెళ్లారా?” అని అడిగాడు. ఏదోవిధంగా నాతో కలుపుగోలుగా వుండాలని ప్రత్నం చేస్తున్నాడతడు. స్టీవెన్సన్ పుస్తకాల గురించి మాట్లాడాడు. తర్వాత సంభాషణ లండన్ నగరం మీదికి మళ్లింది. 

“అక్కడి కావెంట్ గార్డెన్స్ ఇంకా అట్లానే ఉత్తేజకరంగా ఉన్నాయనుకుంటాను. ఆ సంగీత నాటకాలను నేనిక్కడ యెంతగానో మిస్సవుతున్నాను. ట్రిస్టాన్ అండ్ ఐలోడ్ అనే నాటకాన్ని చూశారా మీరు?” అని అడిగాడు. 

ఆ ప్రశ్నకు జవాబు తనకెంతో ముఖ్యమైనది అన్నట్టుగా అడిగాడు. “చూశాను” అని నేను ముక్తసరిగా చెప్పగానే సంతోషాన్ని కనబరిచాడు. వాగ్నర్ సంగీతం గురించి మాట్లాడాడు. ఒక సంగీతపరుడిలా కాక, మామూలు మనిషిలా మాట్లాడాడు. వాగ్నర్ సంగీతం ద్వారా ఒక రకమైన మానసిక తృప్తిని పొందాననీ, కాని దాన్ని వివరించలేననీ అన్నాడు. 

“నాకు అంతగా డబ్బూ అదృష్టమూ లేవు కాని, బేర్సూత్ నిజంగా చూడాల్సిన ప్రదేశం. కాని, అది కావెంట్ గార్డెన్సంత బాగా ఉండదనుకోండి. ఆ సంగీత నాటకశాలలో అద్భుతమైన తళతళల వెలుతురూ, మెడకింది దాకా దుస్తుల్ని ధరించిన స్త్రీలూ, ఇంకా ఆ శ్రావ్యమైన సంగీతమూ ఎంతో బాగుంటాయి. వాక్యూర్స్ నాటకంలోని మొదటి అంకం చాలా బాగుంటుంది కదా. ఇక ట్రిస్టాన్ నాటకంలోని చివరి ఘట్టమైతే అద్భుతం. ఆహా, ఎంత దివ్యంగా ఉంటుందో!” అన్నాడు. 

ఈ మాటలు చెప్తుంటే అతని కళ్లలో మెరుపు కనిపించింది. ముఖం దీప్తితో వెలిగిపోయి, అతడు అంతకుముందు కనిపించిన మనిషి కాదనిపించింది. తెల్లని చెక్కిళ్లు ఎరుపు రంగును పులుముకున్నాయి. అంతకు ముందు అతని గొంతు బొంగురుగా, కొంచెం వికృతంగా ఉండిన సంగతి మరచిపోయాను. కొంత ఆకర్షణీయంగా కూడా కనపడ్డాడతడు. 

“దేవుని తోడు, ఈ రాత్రి లండన్లో ఉండాలనిపిస్తోంది నాకు. అక్కడి పాల్ మాల్ రెస్టారెంట్ మీకు తెలుసు కదా. అందులోకి నేను చాలా సార్లు పోయేవాణ్ని. ఇక పికాడిలీ సర్కస్ దగ్గర దుకాణాలన్నీ వెలుగుతో నిండిపోయి, అక్కడ జనంతాలూకు రద్దీతో యెంతో కోలాహలంగా వుంటుంది. అక్కడ నిల్చుని ఒక్క క్షణం కూడా తెరిపి లేకుండా వచ్చే పోయే బస్సులనూ టాక్సీలనూ చూస్తుంటే ఆనందంతో దిమ్మ తిరిగిపోతుంది. భగవంతుని గురించీ, చేరింగ్ క్రాస్ గురించీ రాయబడిన ఆ పంక్తులు గుర్తున్నాయా మీకు?” అని అడిగాడు లాసన్. నాకు చెప్పరానంత ఆశ్చర్యం కలిగింది. 

“థామ్సన్ రాసిన పంక్తులా?” అని అడిగాను. తర్వాత ఆ పంక్తుల్ని చదివాను ఇలా - 

‘అంతులేని విషాదం నిన్ను ఆవరించినప్పుడు 
అప్పుడు - 
స్వర్గానికీ చేరింగ్ క్రాస్ కూ మధ్య వున్న జనాల జేకబ్ నిచ్చెన 
ఆ ప్రజాసమూహం వెల్తురుతో తళతళా మెరుస్తుంది’ 

లాసన్ చిన్నగా నిట్టూర్చాడు. 

“దహౌండ్ ఆఫ్ హెవెన్ చదివాను నేను. అది బాగుంది” అన్నాడు. 

“సాధారణంగా అందరూ అట్లానే అంటారు” అని గొణిగాను. 

“ఇక్కడ పుస్తకాలు చదివేవాళ్లెవరూ కనపడరు. చదవటం అనేది అట్టహాసం అనుకుంటారు వీళ్లు” 

అతని ముఖంలో బెంగ నిండిన చూపు కనపడింది. నా దగ్గరికి రావాలని అతడెందుకనుకున్నాడో ఊహించాను. తాను కోల్పోయిన ప్రపంచాన్ని, మళ్లీ అనుభవించలేని జీవితాన్ని నాకూ తనకూ మధ్య వున్న లంకెగా భావించాడు. ఎందుకంటే అప్పటికి కొంత కాలం క్రితమే నేను లండన్లో ఉండి వచ్చాను. అందుకు గాను నాపట్ల సంభ్రమం నిండిన ఆశ్చర్యం, అసూయా కలిగాయి అతనికి. ఐదు నిమిషాల వరకు అతడు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఉద్రేకం నిండిన తీవ్రతతో “నేనిక్కడ విసిగిపోయాను, బాగా విసిగిపోయాను” అన్నాడు. ఆ మాటలకు నేను చలించిపోయాను. 

“అయితే మరి నువ్వెందుకు ఇక్కణ్నుంచి వెళ్లిపోవు?” అని అడిగాను. 

“నా ఊపిరితిత్తులకు చిన్న వ్యాధి వచ్చింది. ఇంగ్లండులోని చలికాలాన్ని నేనిప్పుడు తట్టుకోలేను” 

ఆ సమయంలో మరొక వ్యక్తి ఆ వరండాలోకి రావడంతో లాసన్ మళ్లీ మౌనంలోకి కూరుకుపోయాడు. 

“ఇది మందు తాగాల్సిన సమయం. ఎవరు నాతో కలిసి కొంచెం విస్కీ తాగుతారు? నువ్వేమంటావు లాసన్?” అన్నాడు అప్పుడే వచ్చిన వ్యక్తి. 

లాసన్ వేరే లోకంలోంచి బయటికి వచ్చినట్టనిపించాడు. అతడు కుర్చీలోంచి లేచి, “కింద వున్న బార్లోకి పోదాం పద” అన్నాడు. వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. 

లాసన్ పట్ల నాకు సానుభూతి భావం కలిగింది. అతడంటే ఆసక్తి, కలవరం ఏర్పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత నేనతని భార్యను కలిశాను. వాళ్ల పెళ్లి జరిగి ఐదారేళ్లు కావస్తుందని తెలిసింది. కాని, ఆమె యింకా చాలా చిన్న వయసున్న స్త్రీలాగా కనిపించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. లాసన్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు పదహారేళ్లకన్న యెక్కువ లేదు. 
అప్పుడామె అద్భుతమైన అందంతో వెలిగిపోయేది. చామనచాయతో, చిన్నచిన్న చేతులతో, పాదాలతో, తీగలాంటి అతి సన్నని శరీరంతో చాలా ముద్దొచ్చేది. మిశ్రమ జాతికి చెందిన స్త్రీలు సాధారణంగా లావుగా, మోటుగా వుంటారు. కాని, లాసన్ భార్యలోని కోమలత్వం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ సౌకుమార్యాన్ని చూస్తుంటే ఊపిరి తీసుకోవడం మానేసి నోరు తెరుస్తాము. చాలా నాగరికంగా కనిపించే ఆమె అటువంటి ప్రాంతంలో ఉండటం ఆశ్చర్యకరమే. మూడవ నెపోలియన్ దర్బారులోని అందాల రాశులు గుర్తుకొస్తారు ఆమెను చూస్తే. ఫ్రాకు, హ్యాటు ధరించే ఆమెలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తుంది. లాసన్ ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు ఆమెలో కళ్లు మిరుమిట్లు గొలిపే అందం, మనోహరత్వం ఉండివుంటాయి. 

లాసన్ ఈ మధ్యనే సమోవా ద్వీపంలోని ఒక బ్యాంకులో మేనేజరుగా పని చేయడానికి ఇంగ్లండు నుండి వచ్చాడు. అది వేసవి కాలపు ప్రారంభం. అతడు హోటల్లో ఒక గదిలో ఉంటున్నాడు. వచ్చిన కొత్తలో వెంటనే అక్కడి మనుషులందరితో పరిచయం చేసుకున్నాడు. ఆ ద్వీపపు వాతావరణం హాయిగా వుంటుంది. అక్కడి జీవితంలో నెమ్మదితనం ఉండటం ఒక విశేషం. ఆ హోటల్లోని లాంజ్ లో తీరికగా, బద్ధకంగా సాగే పిచ్చాపాటీ అన్నా, సాయంత్రాల్లో కొందరు వ్యక్తులు ఇంగ్లిష్ క్లబ్ లో ఆడే బిలియర్డ్స్ ఆటను చూడటమన్నా అతనికి యెంతో ఇష్టం. సముద్రతీరం వెంబడి పొడవుగా వ్యాపించి వున్న ఏపియా పట్టణాన్నీ, అక్కడి బంగళాలనూ, పక్కనే వున్న గ్రామ వాతావరణాన్నీ అతడు ఇష్టపడతాడు. వారాంతపు రోజుల్లో ఊరిబయట కొండల మీద రైతుల ఫామ్ హౌజులకు పోయి, ఒకటిరెండు రాత్రులు అక్కడ గడిపి వస్తాడు లాసన్. ఇంగ్లండులో వున్నప్పుడు తీరిక, స్వేచ్ఛ అన్నవి తెలియవు అతనికి. సమోవా ద్వీపంలో పుష్కలంగా సోకే సూర్యరశ్మి అతణ్ని ముగ్ధుణ్ని చేసింది. ఊరిబయటి పొదల మధ్యలోంచి పోతున్నప్పుడు చుట్టుపక్కల వున్న ప్రకృతి అందాన్ని చూసి అతని తల ఆనంద పారవశ్యంతో ఊగుతుంది. ఆ ద్వీపంలోని భూమి వర్ణించలేనంత సారవంతమైనది. ఒకదానితో మరొకటి పెనవేసుకున్న రకరకాల వింతవింత చెట్లతో, నేల నిండా దట్టంగా పరచుకున్న చిన్నచిన్న మొక్కలతో తీగలతో అడవి స్వచ్ఛంగా, మనోహరంగా ఉంటుంది. అవన్నీ అగోచరత్వంతో కూడి, హృదయాన్ని కదిలించి ఇబ్బంది పెట్టే దృశ్యాలు. 

ఇంకా ఉంది… 
----------------------------------------------------------- 
ఆంగ్ల మూలం: The Pool - సోమర్సెట్ మామ్ 
అనువాదం: ఎలనాగ 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో 
----------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు








-
సేకరణ ప్రభ  

వెన్నెల రేయి(అనువాదకథ)

సాహితీమిత్రులారా!
ఈ ఫ్రెంచి అనువాదకథను ఆస్వాదించండి-
పాస్టర్ మారిగ్నాన్ అన్న పేరులో మొదటి భాగం మాత్రమే సరిగ్గా సరిపోతుందతనికి. పొడుగ్గా వుంటాడు. మూఢ భక్తి, చిరచిర లాడే గుణం వున్నా నీతి బద్ధంగా వుండే మనిషి. దేవుడి మీద అతని నమ్మకం స్థిరమైనది. దేవుడి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ తనకి అర్థంమౌతాయని అతని విశ్వాసం

తన ఇంటి దగ్గర తోటలో, అప్పుడప్పుడు వడివడిగా అడుగులేసుకుంటూ నడుస్తూ తనలో తను చర్చించుకుంటాడు – “దేవుడు ఇదంతా ఎందుకు చేసినట్లు?” అని.

అదే విషయం గురించి తీవ్రంగా ఆలోచించి, దేవుడి స్థానంలో తననే వుంచుకోని చివరికెలాగో సమాధానం తెలుసుకుంటాడు. ఏనాడు అతను భక్తితో, వినయంతో “దేవా నీ అద్భుతాలు అర్థం కావు కదా” అనడం జరగలేదు.

“దేవుడి సేవకుణ్ణి నేను. దేవుడు చేసే పనులు నాకు తెలియకుండా ఎలా వుంటాయి. తెలియకపోయినా ఊహించగలను కదా” అని తనకి తాను చెప్పుకుంటాడు.

సృష్టిలో వున్న ప్రతిదీ ఒక నిర్దిష్టమైన అవసరం కోసం ఆలోచించి చేయబడ్డదే అని నమ్ముతాడు. “ఎందుకు” అన్న ప్రశ్నకు “ఎందుకంటే” అన్న సమాధానం వుంటుందని నమ్ముతాడు. సూర్యోదయం ప్రశాంతంగా ఎందుకుంటుంది? మనం మేల్కొనగానే ఆనందించేందుకు. అలాగే పగలు ఎండ కాయల్ని పండ్లుగా పండించడానికీ, వాన వాటిలో తేమ నింపడానికి, సాయంత్రాలు నిద్రకు సిద్ధమవడానికి, చీకటి రాత్రులు నిద్రపోవడానికి సృష్టించబడ్డాయని అంటాడు.

నాలుగు కాలాలు సరిగ్గా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వుంటాయి అని నమ్ముతాడు. అసలు ప్రకృతి ఒక ఉద్దేశ్యాన్ని అనుసరించి ఎలా పని చేస్తుంది? ప్రపంచంలో ఏదైనా ప్రకృతికి నియమాలకు లోబడి వుండాలి కదా? కానీ అలాంటి అలోచన అతనికి ఎప్పుడూ రాలేదు.

ఆడవాళ్ళంటే పడదతనికి. అసహ్యించుకునే వాడు. వాళ్ళని దూరంగానే వుంచేవాడు. క్రీస్తు చెప్పిన మాటలు – “అమ్మా, నాతో మీకేమి పని?” అంటుంటాడు. పైగా – “బహుశా దేవుడికి అతని సృష్టిలో నచ్చనిది ఆడదేనేమో” అంటాడు. మొగవాణ్ణి తప్పుదోవ పట్టించే మోసగత్తెలు మగువలేననీ, అలా దారి మళ్ళించాక ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తూ వుంటారని అతని నమ్మకం. చూడటానికి సుకుమారంగా కనిపించే అత్యంత ప్రమాదకారులనీ అనుకుంటాడు. పాపానికి దోహదంచేసే వాళ్ళ శరీరాలకన్నా ప్రేమకు కారణమయ్యే వాళ్ళ హృదయాలని ఎక్కువగా ద్వేషించేవాడు.

స్త్రీల మృదుస్వభావం చాలాసార్లు ఆయన అనుభవంలోకి వచ్చేది. అతనెప్పుడూ వాటికి లొంగిపోలేదు. పైగా అలాంటి అనుభవాలు, ప్రకంపనకు గురి చేసే ప్రేమలాంటి అనుభూతులు అతనిలో కోపాన్ని పెంచేవి.

మొగవాణ్ణి మభ్యపెట్టి, పరీక్షలకు లోను చేసేందుకే దేవుడు ఆడదాన్ని సృష్టించాడని అతని నమ్మకం. మగవాడు తనని తాను సంరక్షించుకోడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుండా, ఆడవారిని బంధించే ఉచ్చు లాంటిదేదీ లేకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళనేకూడదంటాడు. అసలు ఆడదంటేనే ఒక ఉచ్చు. చేతులు చాపి, పెదవులను ఎరగా వేసి బంధించే ఉచ్చు. ఇదీ అతని అభిప్రాయం.

ఆయనతో పాటు వుండే సన్యాసినులైన నన్స్ తో తప్ప వేరే ఏ స్త్రీలతోనూ ఆయనకు చనువు లేదు. వాళ్ళంతా చేసిన ప్రతిజ్ఞల కారణంగా నిరపాయకరంగా వుండే వాళ్ళు. అయినా కూడా వాళ్ళతో చాలా తీవ్రంగా ప్రవర్తించేవాడు. ఎందుకంటే నిర్బంధంగా బ్రతికే వాళ్ళ జాలి గుండెల్లో కూడా ఏదో ఒక మాయ చేసే మృదుత్వం వుంటుందని. అది ఫాదర్ గా వున్న తన మీద కూడా ప్రదర్శిస్తారేమో అన్న అనుమానం ఆయనకి వుంది.

అలాంటి మాయ చేసే మృదుత్వాన్ని ఆయన తరచుగా గుర్తించేవాడు. వాళ్ళ విధేయతలోనూ, ఆయనతో మాట్లాడేటప్పుడు మంద్రంగా పలికే వాళ్ళ గొంతులోనూ, కిందకు దించిన కళ్ళలోనూ, ఆయన చీవాట్లు పెట్టినప్పుడు వాళ్ళు పెట్టే కన్నీళ్లలోనూ ఆ మాయ చేసే మృదుత్వాన్ని చూడగలడాయన. అలాంటి సందర్భంలో ఆయన తన నల్లటి గౌనుని విదిలించుకుంటూ, పెద్ద పెద్ద అంగలువేసుకుంటూ ఆ మఠం బయటికి ఏదో ప్రమాదం నుంచి పారిపోతున్నట్లు పరిగెత్తేవాడు.

ఆయనకి ఒక మేనకోడలు వుంది. ఆమె వాళ్ళమ్మతో కలిసి దగ్గర్లోనే వుంటుంది. ఆమెను ఎలాగైనా సిస్టర్స్ ఆఫ్ ఛారిటీలో సన్యాసినిగా చెయ్యాలని ఆయన ప్రయత్నం.

ఆ అమ్మాయి చక్కగానే వుంటుంది కానీ ఆమెకు కాస్త తిక్క వుంది. పాస్టర్ ప్రసంగాలలో ఆమె నవ్వుతుంటుంది. ఆయన కోప్పడితే గట్టిగా హత్తుకుంటుంది. అలాంటప్పుడు వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అతనిలో ఎక్కడో దాగి వున్న వాత్సల్యం ఆ అమ్మాయి పట్ల పొంగుకొచ్చేది.

ఎప్పుడైనా ఆ ఊరి వీధుల్లో ఆమెతో కలిసి నడిచేటప్పుడు ఆమెతో దేవుడి గురించి మాట్లాడేవాడు. తన దేవుడి గురించి. ఆమె ఎప్పుడూ అతను చెప్పేది వినేది కాదు. ఆకాశం వైపు చూసేది, గడ్డి వంక, పూల వంక చూసేది. గమనిస్తే ఆమె కళ్ళ మెరుపులో జీవితపు ఆనందం అంతా కనిపించించేది. ఒకోసారి గాల్లో ఎగురుతున్న ఏ కీటకాన్నో అందుకోవాలని ముందుకి ఉరికేది. దాన్ని పట్టుకోని తిరిగి వచ్చేటప్పుడు – “చూడు మామయ్యా ఎంత ముద్దుగా వుందో ఇది. చూస్తే గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తోంది” అనేది.

ఇలా పురుగుల్ని ముద్దు పెట్టుకోవడం, విరబూసిన పూలని హత్తుకోవడం అతనికి చికాకుని, కోపాన్ని తెప్పించేవి. అలాంటి చర్యలలో కూడా ఒక ఆడపిల్ల మనసులో వుండే ఆ మృదుత్వాన్ని గుర్తించేవాడు.

ఒకరోజు చర్చిలో శవాల పనిచేసే అతని భార్య వచ్చి ఫాదర్ తో, భయపడుతూనే ఒక విషయం చెప్పింది. ఆయన మేనకోడలు ఎవర్నో ప్రేమిస్తోందని.

ఆ వార్త అతనిలో రగిల్చిన ఒత్తిడి, భయం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనప్పుడు షేవింగ్ చేసుకునేందుకు ముఖానికి సోప్ రాసుకున్నాడు. అది అలా వదిలేసి శిలలా నిలబడిపోయాడు.

కాస్సేపటికి తేరుకున్నాక ఆలోచన, మాట రెండూ వచ్చాయి. “పచ్చి అబద్ధం చెప్తున్నావు నువ్వు మెలైన్” అంటూ అరిచాడు.

కానీ ఆమె మాత్రం తన చేతిని గుండె మీద వేసుకోని చెప్పింది – “అయ్యగారూ, నేను గానీ అబద్దం చెప్తే ఆ ప్రభువే నన్ను దండిస్తాడు. చెప్తున్నా వినండి. రోజూ రాత్రిపూట మీ చెల్లెలు పడుకోగానే ఈమె గారు వెళ్తున్నారు. నది ఒడ్డున కలుస్తారు ఇద్దరూ. మధ్యరాత్రి పదిపన్నెండు గంటలకు వెళ్ళి చూడండి కావాలంటే”.

గడ్డం చేసుకోవడం సంగతి మర్చిపోయాడతను. మెట్లపైకీ కిందకీ వడివడిగా తిరిగాడు. బాగా ఆలోచించేటప్పుడు అలాగే చేస్తాడతను. తిరిగివచ్చి గడ్డం చేసుకుంటూ ముక్కు నుంచి చెవి దాకా మొత్తం మూడుసార్లు గాట్లు పెట్టుకున్నాడు.

రోజంతా మౌనంగా వుండిపోయాడు. కోపం. అపనమ్మకం. ఆయనకు మొదటి నుంచి ప్రేమలంటే వున్న కోపం కారణంగా తన పెంపకం విఫలమైందన్న భావన మరింత తీవ్రమైంది. తండ్రి లాంటి వాడిగా, పెంచిన వాడిగా, ఒక చర్చి ఫాదర్ గా ఆ పిల్ల చేత మోసగించబడ్డాడన్న భావన కలిగింది. ఎవరైన తల్లిదండ్రులకు తమ కూతురు తమ ప్రమేయం లేకుండానే భర్తని ఎంచుకుంటే కలిగే భావనే అతనికి కూడా కలిగింది.

రాత్రి భోజనం అయిపోయిన తరువాత ఏదైనా చదువుదామని అనుకున్నాడు కానీ కోపం అంతకంతకూ పెరుగుతుండటంతో ఏమీ చదవలేకపోయాడు. రాత్రి పది గంటలు అవుతూనే తనకి బాగా అలవాటైన చేతికర్రని అందుకున్నాడు. రోగగ్రస్థులు వుండే ఇంట్లో ప్రార్థనలు చెయ్యడానికి రాత్రిళ్లు వెళ్ళాల్సివస్తే ఆ టేకు కర్ర తీసుకెళ్ళడం ఆయనకు అలవాటు. దృఢంగా వున్న ఆ కర్ర వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, తన పిడికిలితో బలంగా పట్టుకున్నాడు. ఉన్నట్టుండి దాన్ని పైకెత్తి పళ్లు కొరుకుతూ కుర్చీని కొట్టాడు. ఆ దెబ్బకి ఆ పాత కుర్చీ వెనుక భాగం విరిగి నేల మీద పడింది.

వాకిలి తలుపులు తెరిచి బయటికి అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అద్భుతమైన వెన్నెల. అతనికి ఎప్పుడో అరుదుగా తప్ప ఆ సౌందర్యాన్ని చూసే అవకాశం రాదు కదా!

కవులకు వున్నట్లే ఆయనకి కూడా అలాంటివి చూసి స్పందించే గుణం వుంది. అందుకే ఆ చర్చి ఫాదర్ మనసు అద్భుతమైన, ప్రశాంతమైన ఆ దృశ్యం వైపు కాస్సేపు మళ్ళింది.

ఆయన తోట మొత్తం సన్నని వెన్నెల వెలుగులో స్నానం చేస్తున్నట్లు వుంది. పండ్లచెట్లు తమ పొడుగాటి నీడలని నేల పైన పరుస్తున్నాయి. వాటికి వున్న కొమ్మలు, ఆ కొమ్మలకు పల్చగా వున్న ఆకులు కలిసి వెలుగు నీడల బొమ్మలు గీస్తున్నాయి. గోడమీదకి పాకిన పూల తీగ తీయటి వాసనలని వెదజల్లుతూ ఆ వెన్నెల వెలుగుకి అత్తరు సొబగులు అద్దుతోంది.

ఆయన గట్టిగా గాలి పీల్చడం మొదలుపెట్టాడు. ఒక తాగుబోతు వైన్ తాగినట్లు ఆ గాలిని ఆయన తాగడం మొదలుపెట్టాడు. నడక సాగించాడు. నెమ్మదిగా, ఆశ్చర్యపోతూ, ఆహ్లాదాన్ని అనుభవిస్తూ – దాదాపుగా తన మేనకోడలిని మర్చిపోయినట్లుగా నడవసాగాడు.

తోట బయటకు వచ్చి చూస్తే నిర్మలమైన రాత్రిలో వెన్నెలతో అభిషిక్తమౌతున్న నేల కనిపించింది. కనుచూపుమేరలో వున్న భూమంతా వెలుగుతో సరసాలాడుతూ, రమణీయమైన ఆ కాంతిలో లీనమైనట్లు కనిపించింది. కీచురాళ్ళ శబ్దం ఒక నిర్దుష్టమైన నాదంతో పలికినట్లు ఆగి ఆగి వినిపిస్తోంది. దూరంగా ఎక్కడో చకోర పక్షి తన సంగీత జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటోంది. అదంతా కలిసి ఒక మధురమైన కచేరిలా వుంది. కలల్లోకి జార్చగలిగిన సంగీతం. చంద్రుడి వెన్నెలనే మరులుగొల్పగలిగిన సుమధుర గానం.

పాస్టర్ ముందుకే నడిచాడు. అతని హృదయంలో అలజడి ఎందుకు కలుగుతోందో అతనికే తెలియలేదు. ఉన్నట్టుండి నీరసించిపోయాడు. శరీరంలో శక్తి మొత్తం ఆవిరైపోయినట్లు అనిపించింది. ఎక్కడైనా కూర్చోని, కాస్త సేదతీరి భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచం గురించి ఆలోచించాలని అనిపించింది.

అక్కడికి కాస్త దూరంలో నది వెంబడే నిలబడి వున్నాయి బూరుగు చెట్లు. సన్నటి మంచు తెల్లటి పరదా కప్పుతుంటే అందులో నుంచి ప్రసరిస్తున్న చంద్ర కాంతి ఆ మంచుని వెండి రెంగులోకి వెలిగిస్తోంది. దూరంగా వున్న పర్వతాలను, వాటి పైనెక్కడో మొదలైన నది కిందకి జారే కఠినమైన మార్గాన్ని, పల్చటి పత్తి కప్పినట్లుగా, తెల్లటి కాంతి కమ్మేసింది.

పాస్టరు మళ్ళీ ఆగిపోయాడు. అతని అంతరాంతరాలలో క్రమంగా ఒకలాంటి మృదుత్వం అనివార్యంగా విస్తరిస్తోంది.

ఒక అనుమానం, అర్థం కాని కలవరం అతనిని ఆక్రమించింది. అతను తరచుగా ప్రశ్నించుకునే విషయం మళ్ళీ జ్ఞప్తికి వచ్చింది.

“దేవుడు ఇదంతా ఎందుకు సృష్టించాడు? రాత్రి వున్నది నిద్రకోసమే కదా? స్పృహ లేకుండా, ప్రపంచాన్ని విస్మరించి విశ్రమించడానికే కదా? మరి రాత్రిని పగటికన్నా మనోహరంగా ఎందుకు చేశాడు? సంధ్యాసమయాల కన్నా ఆహ్లాదకరంగా ఎందుకు కూర్చాడు? సొగసుగా వుంటూనే నిగూఢమైన ఈ ప్రపంచాన్ని వెలుగులతో నింపడానికే కదా సూర్యుడు వున్నాడు? ఎంత టక్కరిదీ భూమి? వెలుగుని కాదని పారదర్శకంగా వున్న ఈ నిశీథిసుందరిని ఎందుకు ప్రేమించింది?

రెక్కలున్న అద్భుత గాయకుడు అందరిలా ఎందుకు నిద్రపోవటంలేదు? ఎందుకు తన కుహుకుహు రవాల గళాన్ని నిగూఢ నిశీధిలోకి వొంపుతున్నాడు?

“ప్రపంచం పైన ఈ మేలి ముసుగు ఎందుకు? హృదయం ఇలా కంపించడం ఎందుకు? ఆత్మకు భావుకత ఎక్కడిది? శరీరానికి ఎందుకు ఈ దౌర్భల్యం కలుగుతోంది? అందరూ నిద్రలో జోగుతూ కనీసం వీటి వైపు చూడనైనా చూడలేని సమయంలో ఇంత ఇంద్రజాలం ఎందుకు జరుగుతోంది? ఈ మనోహరమైన అద్భుతం, ఈ అద్వితీయమైన కవితాఝరి ఎవరికోసం దివి నుంచి ఇలకు జాలువారుతోంది?”

ఆయన అర్థం చేసుకోలేకపోయాడు.

అదిగో, అక్కడ చూడు. ఆ పచ్చిక నేల చివర, చెట్లు చిత్రంగా కల్పించిన పైకప్పు కింద, మెరుస్తున్న మంచులో తడుస్తూ ఎవరో ఇద్దరు పక్కపక్కనే నడుస్తున్నారు.

అతను ఆమె కన్నా పొడగరి. తన ప్రియురాలి మెడ చుట్టూ చేతిని వేసి పదే పదే ఆమె కనుబొమ్మల మధ్య ముద్దు పెడుతున్నాడు. ఐహికమైన జీవితంలో నుంచి వారిద్దరినీ మాయం చేసి కళాకృతిలా కనిపిస్తున్న ఆ దృశ్యంలోకి ఏ దైవ హస్తమో చేర్చినట్లుగా అనిపిస్తోంది. వారిద్దరూ ఇద్దరిలా కాక ఒకే ఆత్మలా కనిపిస్తున్నారు. ఆ ఆత్మ కోసమే ఈ ప్రశాంతమైన, నిశబ్దమైన రాత్రి సృష్టించబడిందా అన్న భావన కలుగుతోంది. ఇద్దరూ పాస్టరు వైపుగా వస్తుంటే, ఆయన ప్రశ్నలకు భగవంతుడు పంపిన సమాధానంలా వున్నారు.

ఆయన స్థాణువులా వుండిపోయాడు. గుండె వేగం హెచ్చింది. కంగారుగా అనిపించింది. కళ్ళ ముందు బైబిల్ నుంచి బోయజు రూతులు వచ్చి నిలబడ్డట్లు అనిపించింది. పవిత్ర గ్రంథాలలో భగవంతుడి ఇచ్ఛ ప్రకారం జరిగే అద్భుతకథలన్నీ గుర్తుకువచ్చాయి. సాల్మన్ గీతం అతని చెవులలో ప్రతిధ్వనించింది. ఆ గీతంలో వున్న సౌకుమార్యమంతా అతని గుండెల్లో మృదువుగా వ్యాపించింది.

“బహుశా ఇలాంటి ప్రేమికుల ప్రేమను అజరామరం చేసేందుకే దేవుడు ఇలాంటి రాత్రులను సృష్టించాడేమో” అనుకున్నాడాయన.

ఆ జంట జత కలిసిన చేతులతో ముందుకు వస్తుంటే తనకు తానుగా వైదొలిగాడు. ఆమె అతని మేనకోడలే. కానీ భగవంతుడి ఆజ్ఞను తిరస్కరించాలా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. దేవుడి అంగీకారమే లేకపోతే ఈ ప్రేమ చుట్టూ ఇంతటి అద్భుతాన్ని ఎందుకు వ్యాపింపచేస్తాడు?

తనకు అనుమతిలేని ఒక మందిరంలోకి చొరబడినందుకు అపరాధ భావన కలుగుతుండగా వెనక్కి మళ్ళాడాయన.
-----------------------------------------------------------
మూలం: ‘Moonlight, or In the Moonlight’, by ‘Guy de Maupassant’, French, అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో
-------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు


--((**))--

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
శ్రావణ సోమవారం
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు
శ్రావణ మంగళవారం
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.
శ్రావణ శుక్రవారం
ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం
శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.
శ్రావణ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు
రక్షా బంధనం
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.

శ్రీ వల్లూరి పవన్ కుమార్ గారికి నమస్కృతులతో...
పదమాలిక నిడెద నొకటి
ముదమిచ్చెడి రీతిలోనఁ బొంగించి నుడుల్
పదిలముగా దాచుకొనఁగ
హృదయము దలఁచెడి విధమగుఁ, దృప్తికరంబై
--
సూక్తి సంచయము
================
--
మాత్రాబద్ధము (12)
--
గిరిగీచుక కూర్చొనఁ బోకు
సరి లేరని నాకెవరెట్లు
మరియాదగనుండుట మేలు
ధరనెచ్చట నున్నను గాని
--
గురుపాదము గొలుచుకొమ్ము
గురుసేవల సలుపుచుండి
కరుణన్ గని సకల జనుల
తరుణమ్మున సాయమిడుము
--
అమలమ్ముగ నుంచి యెడఁద
సమభావముఁ బెంచుకొమ్ము
గమనించుచు సృష్టి రచన
ప్రముదమ్మునఁ బ్రణతులిడుము
--
నిరుపేదల నిరసించకు
ఒరులెవ్వరి దూరఁబోకు
గరిమమ్మిడు గుణముఁ బెంచు
సరసంబగు బాసలాడు
--
అతిగానెటఁ బల్కఁ బోకు
మతినుంచుము మాతనెపుడు
స్తుతిసేయకు దుష్టజనుల
గతిమార్చకు మాశమీఱి
--
ప్రాప్తమైనదానితోడఁ
దృప్తి గలిగి బ్రతుకనగును
ఆప్తవాక్యమంచునెంచి
జ్ఞప్తినుంచ సూక్తి మేలు
--
వెంటరావు కాసులేవి
జంటయగును గర్మమొకటె
మంటలోన బూడిదగుచు
మంటిలోనఁ గలయఁ దనువు
--
పాపభీతిఁ గలిగి యుండు.
ఆపలేని వాఁడననుచు
వేపఁబోకు పెచ్చుమీఱి.
తాపమిడును యముఁడు పిదప
--
మర్మముంచఁబోక మదిని
ధర్మమార్గమందె సాగి
కర్మఫలము విభునికిడుము
వర్మమగును దైవమతఁడె
--
ఆశలెన్ని యున్నఁగాని
నాశనమునుజేయకొరుల.
పాశమెపుడొ తగులుకొనును
క్లేశమొదవ నీకుఁ గూడ
--
మోసగించి బ్రతుకఁబోకు
హాసములను బయికిఁ జిమ్మి
దాసజనము మెచ్చఁబోరు
మాసిపోవునున్న పేరు
--
పిల్లపాపలందఱలర
మెల్లఁగాను దరికిఁ దీసి
చల్లఁగాను గాయుచున్న
నిల్లె స్వర్గమగును జూడ
--
కల్లలాడఁ గాదు ముద్దు
చెల్లదెపుడు దాట హద్దు
అల్లరవఁగ నెమ్మి రద్దు
తల్లి చెప్పుదొకటె కద్దు
--
చల్లనైన తల్లి యగుట
నెల్లరొకటె కనఁగఁ దలికి
తల్లడిల్లుఁ దగవులాడ
నుల్లసిల్లు నేకమయిన
--
12:25 PM
08-08-2018
--
** కందపద్యముతో పలికి, లోనున్న వారందించిన సూక్తిసంచయము. మొదటి రెండు పాదములు రాగానే "నాకు సాటిలేరని ఎప్పుడైనా,ఎవరితోనయినా అన్నానా? నేనొక గరికపూవునని, నీ శక్తి , ప్రేరణ వలననే వ్రాస్తున్నానని
చెప్పుకొంటున్నానుగదా!" అన్నాను. నీ గురించి కాదు.ఇవి అందఱి కొరకు, జనరల్ గా నిస్తున్నవని సమాధానమిచ్చారు.

ఛందశ్శాస్త్రం..43...సీసపద్యము నియమములు

సీస పద్యం.....
మనం పాట లాగా పాడుకోవడానికి బాగా వీలుండే పద్యం సీసమే! పూర్వం పౌరాణిక నాటకాలలో, ఇలాంటి సీస పద్యాలు ఎక్కువ గా ఉండేవి. ఇంకా వ్రాయడం సులువు. , ఇంటి పేర్లు, పేర్లు కష్టమైన గురు లఘువులు ఉన్నవి, అన్నీ ఇందులో సులభంగా ఇమిడి పోయే పద్యం ఇది. బాగా సాదన చేసుకుంటే అన్ని విధాల ఉపయోగ పడుతుంది. ఇది కూడా సూర్యేంద్ర గణాలతో ఉండేదే కాబట్టి, ఆటవెలది, తేట గీతి లాగ ఆడుకుంటూ పాడుకుంటూ వ్రాసెయ్యొచ్చు.

ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి.

ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.దీని స్వరూపం ఇలా ఉంటుంది.

ఒకటో పాదం :-- ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర -..... పెద్ద పాదం. 
రెండో పాదం:-- ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య-.... చిన్న పాదం.

మూడు..,.. నాలుగూ... .......పాదాలు

ఐదూ..,,,,, ఆరూ.. .పాదాలు

ఏడు........ ఎనిమిదీ.. పాదాలు

వరుసగా ఒకటీ రెండూ పాదాల వలెనే ఉంటాయి.

ఇలాగే..ప్రతి పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి.

ప్రాస యతి కూడా చెల్లుతుంది.

ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.

అక్షర నియతి లేదు

సీస పద్యం పూర్వ భాగం వ్రాసిన తర్వాత దాని కింద ఒక తేటగీతి లేక, ఒక ఆట వెలది గానీ వ్రాయాలి. అప్పుడే.. సీసం పూర్తి అయినట్టు లెక్క. ఇలా వ్రాయడాన్ని "ఎత్తు గీతి" అంటారు.

ఇక మనకందరకూ బహుగా పరిచయమున్న ఒక పద్యానికి గణ విభజన చేసి చూద్దామా..
సీ,,
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేష శాయి కి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము 
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

పై పద్యానికి గణ విభజన చేసినచో.,,,

ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర
| | U | U U | | | | | | | | I
కమలాక్షు- నర్చించు - కరములు-కరములు
ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
U U | U U | U | U |
శ్రీనాధు -వర్ణించు- జిహ్వ -జిహ్వ 
ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర 
| | U | | | U | U | | U | |
సురరక్ష -కునిజూచు - చూడ్కులు -చూడ్కు లు
ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
U | U | | U | | | | | | | 
శేషశా- యికిమొక్కు- శిరము -శిరము 
ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర 
UIU UUI UII UII 
విష్ణునా -కర్ణించు -వీనులు - వీనులు
ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
| | U | | | | | | | | | | |
మధువైరి - దవిలిన -మనము- మనము
ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్ర
| | U | | | | | | | | | | | | | 
భగవంతు -వలగొను - పదములు -పదములు
ఇంద్ర------- ఇంద్ర -----సూర్య-- సూర్య 
| | U | | | U | U | U |
పురుషోత్త -మునిమీది- బుద్ధి - బుద్ధి

దీనిని సీస పద్యం పూర్వ భాగం అంటారు...దీని తరువాత తప్పని సరిగా ఆటవెలది గాని..,,తేటగీతి గాని వ్రాసి సీస పద్యం ముగించాలి

""నల, నగ, సల, భ, ర, త"" లు. ఇంద్ర గణాలు.

"గల లేక హగణం" మరియూ "న "గణాలు సూర్య గణాలు

ఇవి ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉంటేనే మనం ఆట వెలది తేటగీతి సీస పద్యాల్ని సమర్ధవంతం గా వ్రాయగలము అనే విషయాన్ని గుర్తుంచు కోవాలి.

ఈ రోజుతో ఛందశ్శాస్త్రం పాఠాలు ముగించ బడినవి వాస్తవానికి పద్య రచనకు ఛందస్సుతోపాటు, సంధులు, సమాసములు,అలంకారములు నేర్చుకొనట తప్పనిసరి..,అయినప్పటికీ మిత్రులందరు కొంత అవగానకు వచ్చినారని ఇంతటితో విరమించు చున్నాను .,


సమాప్తం.,,,





Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు