ఆచార్య తిరుమల
సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే కాదు అక్షరాలతో కూడా ఆటలాడుకున్నారు.
పద్యాలతో పరమాద్భుతమైన విన్యాసాలు చేశారు.
ఒక పద్యంలో మరో పద్యం, ఆ పద్యంలో మరో పద్యం ఇమిడ్చి రాసే 'గర్భ' కవిత్వాలూ, ఎటు చదివినా ఒకేలా వుండే అనులోమ విలోమ పద్యాలు, నాగబంధం, ఖడ్గబంధం లాంటి 'బంధ' కవిత్వాలు, సర్వ లఘు పద్యాలూ - ఒకటేమిటి? ఎన్నెన్నో వింతలూ, విడ్డూరాలూ చేశారు.
బమ్మెర పోతన - భాగవతం గజేంద్ర మోక్షం కథలో
అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగడ నుడుగుడని వెడ నుడుగున్
వెడవెడ చిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!
అని వృత్త్యను ప్రాసాలంకారంతో సర్వ లఘు కందం రాసి, లక్ష్మీదేవి యొక్క గుం'డె' ద'డ'కి అక్షర రూప కల్పన చేశాడు.
ఒకే హల్లు పలుమారులు ఆవృత్తి అవ్వటం వృత్త్యనుప్రాసాలంకారం. అసలు, ఒక హల్లుతోనే వాక్యాలూ, పద్యాలు వుండటం చూస్తే- ఆశ్చర్యం వేస్తుంది. ఇది చూడండి:
“కా కీ కే కా కి కి కో క కా క కే కి కా?" - కాకి ఈక - కాకికి - కోక కాక- కేకికా (నెమలికా)? అని దీని అర్థం.
అలాగే 'న' గుణితంతో చూడండి:
నానా నన నా నున్న న
నూనను నిన్ననెను నేను నున్ను ని నివవై
నానీ నను నానా నను
నానూన యనంగ వొంటి యక్షరమయ్యెన్!!
అని లక్షణకారుడు చెబితే మరో మాటకారి-
నూనె(ఆయిల్) అనే మాటతో—
నా నూనె నీ నూనా? నీ నూనె నా
నూనా? నా నూనె నీ నూనని నే నన్నానా? అని గిలిగింతలు పెట్టాడు.
నేనోసారి నా మిత్రునితో మహా గాయకుడు మన్నాడే ని గూర్చి ముచ్చటిద్దామని “మన్నాడే”అనేసరికి ఆయనగారు వెంటనే-
“ఏ మన్నాడే? ఆ మన్నాడే రమ్మన్నాడే-” అని అడ్డుపడి నవ్వేశాడు.
శ్రీ శ్రీ - 'న' అనే అక్షరాన్ని 'అ్న' అనీ, 'గ' అనే అక్షరాన్ని 'అ్గ' అనీ యెందుకు రాయకూడదని అడుగుతూ - మ. న. స - అనే మూడక్షరాలతో త్ర్యక్షర కందం అందించాడు చూడండి:
మనసావి నిసిని సేమా
మసి మనిసి మనసు మాసిన సీవా
సినిమా నస మాసనమా
సినిమా నిసి సీమ సాని సిరిసిరి మువ్వా!!
సాని, రాత్రి సేమా (ఒకటేనా), మనసు ఒక మసి, మనిషి మనసు మాసిన సీనుతో సమానమా, సినిమా నస మా ఆసనమా, సినిమా,నిసి, సీమ, సాని అని మ,న,స అనే పదాలతో చమత్కారమందించారు. ఈ పద్యంలో శ్రీ శ్రీ మహాకవిగా కంటే 'సినిమా' కవిగానే బాగా కనిపిస్తాడు.
ఒక అజ్ఞాత కవి ఎవరో-
మా పని నీ పని గాదా
పాపమ మా పాపగారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పనిగానిమ్మా!!
అంటూ సప్త స్వరాలతో కంద పద్యాన్ని పని గట్టుకుని చెప్పి రసజ్ఞుల మెప్పులందుకున్నాడు.
ఎటునుండి చదివినా ఒకేలా వుండడమే కాకుండా అర్థభేదంతో వుండే అనులోమ, విలోమ పద్యాలు మరీ అద్భుతంగా వుంటాయి.
ఈ క్రింది అనులోమ పద్యాన్ని చివరి నుండి మొదటి వరకు చదివితే వేరే అర్థం వస్తుంది. చూడండి:
దామోదర సామ తనధ
రామా సరసాకర దశరథ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!
ఈ పద్యాన్ని చివరి నుండి
సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!
అని చదివితే వేరే అర్థం వస్తుంది.
పాదభ్రమకం పద్యంలో ప్రతి పాదాన్ని ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి చదువవచ్చును చూడండి:
ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!
ఇంక పద్య భ్రమకంలో ఏ పాదాని కా పాదం కాకుండా మొత్తం పద్యాన్నే చివరి నుండి మొదటికి చదవచ్చు. ఎటునుండి యెటు చదివినా ఒకేలా వుంటుంది. (ఆంగ్లంలో వీటినే Palindromes అంటారు). ఇది చూడండి :
రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!
ఇటువంటివి కవులు చేసే గారడీలని, కసరత్తులని, సర్కసులని, కవిత్వముండదని కొందరంటారు గానీ వీటిలో అర్థం ఉంటుందని, కవి యొక్క అపార శబ్ద బ్రహ్మోపాసన ఉంటుందని గ్రహించడం మంచిది.
అసమర్థులకి అల్లరి, విమర్శలు చేయటం ఎక్కువే కదా! కాబట్టి వారిని పట్టించుకోపోవటం బుద్ధిమంతుల లక్షణం.
చిత్ర కవిత్వాల్లో ఆరితేరిన గణపవరపు వేంకట కవి ప్రతి పద్యంలోనూ ఏదో ఒక చిత్రం ఉండేలా 883 పద్యాలతో "వెంకటేశ్వర విజయ విలాసం" అనే ప్రబంధం రాశాడు. ఆ కావ్యంలోని 808 పద్యంలో 64 రకాల విచిత్రాలున్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ పద్యం చూడండి:-
సారాగ్య సారస సమనేత్ర యుగళ నా
»రద రుచి కాంతి నరఘన వనిత
సారాగధీర విశదవీన తురగ భై
»రవ భవ జైత్ర భర శుభ కరణ సారతిహార విసర చారణ హరి సా »రసహిత చంద్ర శరజ జయనుత వారాశి నారద వర పూజిత పద గౌ
»రవ కటి ఖడ్గ గరళగళ సఖ
హరి నగ నిలయ గిరిధర యసుర దళన
మణిమయ మకుట సురమణి మధుర విశరణ
కరి వరద కువర రుచిరత రవ సనన
రహరి లసిత దర నిగమ విహరణ హరి!!
ఈ పద్యాన్ని గూర్చి ఈ పద్యంలో 41 గర్భ కవిత్వాలు, 20 దాకా బంధ కవిత్వాలు అనులోమ, విలోమ పద్యాలు మూడు ఉన్నాయని మా మిత్రులు డా. ద్వా.నా.శాస్త్రి గారు తమ 'సాహిత్య కబుర్లు' గ్రంథంలో తెలియజేశారు. వాటి వివరాలు తెలుసుకోవటం వేరే పరిశోధనతో కూడిన విషయం.
పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో తెనాలి రామకృష్ణునికి వికట కవిత్వమెలా వచ్చిందో చమత్కారంగా 'క' భాషలో చెప్పారు. చూడండి:
తే॥గీ॥ కవి కక కట కక కవి కగ కన కను క
దీ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!
ఈ పద్యంలో 'క'లు తీసివేస్తే-"వికట కవిగ నను దీవన లిడి కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె" అనే వాక్యం వస్తుంది.
అల్లంరాజు రంగశాయి అనే కవి 'మ' గుణింతం తో ఓ అందమైన కంద పద్యం చెప్పాడు.
మామా మీమో మామా
మామా! మి మ్మొమ్ము మామ మామా మేమా
మే మొమ్మము మిూ మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ఈ పద్యానికి ప్రతి పదార్థమిలా చూడాలి:-
మా=చంద్రుని, మా=శోభ, మోమౌ=ముఖముగాగల, మామా మా మాయొక్క, మా=మేధ, మిమ్ము, ఒమ్ము=అనుకూలించును, మామ మామా=మామకు మామా, ఆము=గర్వమును, ఏమి+ఒమ్మము=ఏమీ ఒప్పుకోము, మిమై=మీ శరీరము, మేము ఏమే=మేము మేమే, మమ్ము, ఓముము+ఓముము=కాపాడుము, కాపాడుము, ఇమ్ము+ఔము=అనుకూలమగుమా.
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ది మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం.
ఏకాక్షర నిఘంటువులు చూసిస్తే గానీ యిటువంటి పద్యాలు అర్థం కావు. గానీ చదువుతుంటే సరదాగా వుంటాయి. ఇలాగే సంస్కృతంలో ఉన్న ఏకాక్షర శ్లోకాన్ని పరిచయం చేస్తాను. చూడండి:
రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!
శ్రీ కృష్ణదేవరాయల భువన విజయ సాహిత్య సభకు ఒకనాడొక కవి వస్తే - ఆయన్ని తెనాలి రామ కృష్ణుడు
"మేక తోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక" అంటూ ఓ పెద్ద సీస పద్యం లో మేకల మందని సమస్యగా చెప్పి నిరుత్తరుణ్ని చేసి ఓడించాడు.
అయితే కృష్ణరాయల కీర్తిని వర్ణిస్తూ తెనాలి కవి చెప్పిన యీ పద్యమెంత అక్షర సౌందర్యంతో గంభీరంగా వుందో చూడండి:
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్దిరిభి
త్కరి కరిభిద్దిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తు రంగ కమనీయంబై!!
నరసింహరాయల కుమారుడైన శ్రీ కృష్ణదేవరాయల కీర్తి- కరిభిత్=గజాసుర సంహారియైన శివునిలా, గిరిభిత్కరి=ఇంద్రుని ఏనుగైన ఐరావతంలో, కరిభిద్దిరి=కైలాసంలా, గిరిభిత్=వజ్రాయుధంలా, కరిభిద్గిరిభిత్తురంగ=శివేంద్రుల వాహనానాలలైన నంది, ఉచ్ఛ అశ్వం (తెల్లగుర్రం)లా అందంగా, తెల్లగా ఉందని భావం.
చివరగా, కాళిదాసు పేరు మీద చలామణీలో వున్న చదవటానికి నోరు తిరగని, ఓ శ్లోకాన్ని మీకు పరిచయం చేస్తాను. శ్లోకాన్ని చూసి ఖంగారు పడకండి. జాగ్రత్తగా చదవటానికి ప్రయత్నం చేయండి.
షడ్జామడ్జ ఖరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్ఖాఖరే
జడ్జట్కిట్కి ధరాడ్జ రేడ్ఘన ఘనఃఖడ్జోత వీడ్యద్భ్రమా
వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్ట్రి యపదాడడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
పాదౌటేట్ప్రట టట్ప్రట ట్ప్రట రసత్ప్రఖ్యాత సఖ్యోదయః!!
ఈ శార్ధూల చంధో బద్ధమైన శ్లోకానికి అర్థమేమిటో మీలో ఎవరికైనా గనుక తెలిస్తే పంచుకోగలరు.
ఇక ఉంటానండి మరి!
హాస్య సభ....వికటకవి శ్రీనివాస్
సేకరణ 🌹
Comments
Post a Comment