*శ్రీమద్ భగవద్గీత... పురుషోత్తమ యోగము... 15వ అధ్యాయము*
శ్రీమద్ భగవద్గీత...
పురుషోత్తమ యోగము... 15వ అధ్యాయము*
ఉ. మూలముగాను బ్రహ్మ యగు ముఖ్యము నీశ్వర భావమందునన్
కాలవిలీన వృక్షతతి ఖాయము, శాశ్వత మర్మ మేయగున్
నాలుగు వర్ణ వేదములు నాశము లేనివి నీకుటుంబముల్
మూల ప్రభావమై పరమ ముక్తిని బొందెడి పూజ్యుడేయగున్ (01 )
ఉ. మానవ జన్మ కొమ్మలగు మానస స్థావరమైన వృక్షముల్
మానవ కర్మలే త్రిగుణ మార్గ సమర్థము వ్యాప్తి చెందుటన్
ప్రాణుల వృద్ధిజేసెడి సమాంతర జీవుల మూలమూలలన్
వైనము క్రిందిపైకి గలవైనవి శాఖల బంధనమ్ము లన్ (02 )
శా. నీమాయా వటవృక్షమే యెరుగకన్ నీమార్గమే దిక్కుగన్
నీమాధుర్యములే విధాన కళలై నీభావ వైనమ్ముగన్,
ఏమార్పై నను త్యాగమే యగుటగా నేమార్చు వైరాగ్యముల్,
సామాన్యమ్మగు రీతి వర్ణణ కథేసంజాత వైనమ్ముగన్ (03 )
ఉ. ఏ పరమాత్మపాదములు నెంచ మనస్సగు భక్తి తత్త్వమున్
నేపురుషుండుసామ్య ముగ నేరుగ దైవముఁ జేర నుండగన్,
ఈ పుడమీ ప్రభావమున నీశ్వర నేత్రము తిర్గు జుండగన్,
ఆ పురుషుణ్ణి నేరుగ యుగాల నుపాసన జేయగా నగున్ (04 )
మ. మమతాశక్తిని వీడ ధర్మ మను సన్మార్గమ్ము నిత్యమ్ము గా,
సమతా భావములందు సఖ్యతల భాష్యమ్ముల్ విచారించగన్
మమకారమ్మన పంతమీశ్వరు నిగా మార్గమ్ము సర్వమ్ముగన్
సుమనోశక్తిగ జ్ఞాన శాశ్వతమగున్ సూత్రమ్ము నేస్తమ్ముగన్ (05 )
మ. అదియే నాదు ప్రకాశముల్ జగతి నానాపుణ్య మార్గమ్ముగన్
పదమోత్సాహ మదీయసూర్య శశి గా పారాడు విశ్వమ్మునన్
వెదజల్లే విధమగ్నియున్ ప్రకృతిలో విద్యోన్నతీసేవలున్
పద పుణ్యాత్ముల సామ్యవాదములుగాపర్వాల నేస్తమ్ముగన్ (06 )
శా. జీవాత్మే పరమాత్మ రూపముగనే చేకూర్చు ప్రేమమ్ముగన్
నావైపే కదలాడు శక్తి గమనా నవ్యమ్ము మోక్షమ్ము గన్
జీవమ్మే వివిధమ్ము లై వినతి సంజీవించ నీమాయలన్
నీవేతప్ప నివేదనా తలపులన్ నిష్ఠల్ వివాదమ్ము లే. (07 )
ఉ. వాయువు గంధమై నటుల వాసన మార్చు విధానమేవిధిన్
మోయు మనస్సు నింద్రియము మోక్షముఁ గోరశరీరమేఁ గనున్
కాయము నెంచి యోగముగఁ గాలముఁ దీరునఁ గ్రొత్త జన్మగన్
మోయును తల్లియేవిధిగ ముక్తముఁ బొందెడి దేహమందునన్ (08 )
చం. కనులును, నాసికమ్ములును, కాలమనే శ్రుతులెల్ల రక్షగన్
మనసున నాదరమ్మమరి చర్మమయమ్మున జిహ్వలే యనన్
ననుభవమేధ సాధ్యము వినమ్ర సమూహ మనోజ వాంఛలన్
తనువుల తప్తఁ దీర్చెడి విధాన ప్రయోగ తపో ధనమ్ములన్ (09 )
ఉ. జీవుడు దేహమే శివము జీవ శరీరము నందు పాశమున్
జీవ రహస్యమెల్ల విధిఁ జేష్టల భోగము లన్ని వేడుకల్
జీవమె జ్ఞానమై కదిలె జీవన శైలియు జ్ఞాన నేత్రమున్
జీవుడు కేవలమ్మున వివేకము శాంతిగ సత్య ధర్మమున్ (10 )
ఉ. సాధన చేయుటందు పరమార్థము తోడుగ గాలి, నీరముల్
సాధనలో ప్రయత్నములు సాగిన వశ్యము స్ఫూర్తిగాయగున్
సాధన లాత్మ సాక్షిగను మానస తృప్తియు యున్నతమ్ముగన్
సాధన నిత్య సత్యమగు సాధ్యము శుద్ధియు యోగ లక్ష్యమున్ (11 )
ఉ. తేజము సూర్యదేవకళ తీవ్రత నున్నను సర్వ క్షేమముల్
తేజము చంద్రదేవకళ తీక్షణ వెన్నెల నీడలేయగున్
తేజము యగ్ని దేవకళ నేలుచు నుండుట భక్తి శక్తిగన్
తేజము నాదియే యనుచు నెమ్మది శాంతికి నేస్తమేయగున్ (12 )
ఉ. పుష్టిగ నాదు శక్తియును పున్నమి వెన్నెల మాదిరేయగున్
స్పష్టతతోను భూతములుగా కళ పోషణ నేనుఁ గూర్చెదన్,
ఇష్ట రసస్వరూపమగు నిచ్ఛయు చంద్రుని ఔష ధమ్ముగన్,
ఇష్టము వృద్ధిజీవులకు నీశ్వర లీలలు నేను నేనుగన్ (13 )
మ. జఠరాగ్నీ తిను భక్ష్యమే కరిగియే జాడ్యమ్ము పోగొట్టుగన్
జఠరాగ్నీ తిను భోజ్యమే కరిగియే జాడ్యమ్ము తీర్చేందుగన్
జఠరాగ్నీతిను దోహ్యమే కరగియే జాతస్య లేహ్యమ్ముగన్
జఠరాగ్నీ యుపకార ప్రాణిగనుమా జ్ఞానమ్ము సర్వాంతరల్ (14 )
శా. నేనేహృద్యముగా నివాసిని కళా నేస్తమ్ముగా నెప్పుడున్
నానుండే జననమ్ము జ్ఞానముగనన్ నామాయ లెల్లన్ వలే
నేనేవేదముకర్తనైన విధిగా నీరాజ నారాధ్య ముల్
నేనేవేద్యము నేనుగా సకలమున్ నిత్యమ్ము సాధించగన్ (15 )
చం. క్షరముయు నక్షరమ్ముయు సకార మకార సుఖమ్ము రెండుగన్
పురుషులు ద్వంద్వ బుద్ధుల ప్రపూర్ణ జగాన పరాకు జేయగన్
క్షరమగుదేహమేవిధిగ క్షారమునంద యనంత మార్గముల్
క్షరమగుజీవమేఁ గనిన గమ్యము పార్ధ సమమ్ము నేనుగన్ (16 )
మ. సకలమ్మున్ గుణ హీనుడై నిలిచి దాస్యాసాధ్య ధర్మమ్ము నన్,
ఇక తానెవ్వరనంగఁ దెల్పు మన నేనిచ్ఛా పరంధాముడన్,
ఇక కైవల్యము నందు సర్వముగ నేనేగమ్య మార్గమ్ము నన్,
ఇక కాలమ్మున నవ్యయమ్ములను నేలించన్ సకాలమ్మునన్ (17 )
చం. క్షరపురుషుండు నశ్వరము కాంతి కతీతము కంటె నుత్తమున్
క్షర రహితుండు సర్వమగు కాల యశంబుభరించు యోగ్యతన్
సరియగువేదమార్గమున శాంతి సహాయ సమర్ధతేయగున్
పరమ పవిత్ర మేయగుట పాఠ్యముగానువివేక్త నేనుగన్ (18 )
శా. ఏభావమ్ముగ నన్నుగాను నెరిగీయేమంత్ర మైనాజపమ్
ఆభాగ్యమ్ముగ నాతడేమనసుగా నాకర్పణా చేయుటన్
యీ భాష్యమ్మునగీతమాట మనసా నేస్తమ్ము నేనేయగున్
హేభాగ్యోదయ పార్థ, నిన్నుపరమాత్మీయమ్ముగా జూడగన్ (19 )
ఉ. పావన శాస్త్రమెల్ల మది పాఠముగానెరిగించి మోక్షమున్
సేవల తత్త్వమే సహన సీఘ్రమనస్సున తధ్యమే యగున్
జీవులలోనశక్తిగను చేతన సాధన నేనె సర్వమున్,
ఈ పుడమిన్ తరించగల నెల్లవిముక్తిని నేనుఁ జేయగన్ (20)
శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ యోగము 15వ అధ్యాయము సమాప్తమ
pranjali prabha .. Mallapragad Ramakrishna
******
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి .. (15 )
సర్వపాపములు నుండీ విముక్తిని ప్రసాదించే భగవద్గీత పదిహేనవ అధ్యాయం .
జీవుల త్రిగుణాల గురించి వివరించేది భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయం గుణత్రయవిభాగ యోగము . దాని తర్వాత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ అధ్యాయంలో పరమాత్మ జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముని పొందడం పురుషోత్తమ ప్రాప్తి యోగము అనిపించుకుంటుంది అని పరమాత్మ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలో చెప్పారు . ఈ అధ్యాయాన్ని నిత్యమూ పఠించడం ,పారాయణగా చేయడం వలన ఒనగూరే ప్రయోజనాల గురించి పరమేశ్వరుడు ఈశ్వరికి ఇలా తెలియజేస్తున్నారు.
“ఈశ్వరి! పరమ పవిత్రమైన పంచదశాధ్యాయాన్ని వివరిస్తున్నాను. సావధానంగా విను. పూర్వము గౌడదేశాన్ని నరసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని దగ్గర గొప్ప పరాక్రమశాలి అయిన శరభేరుండుడు అనే సేనాధిపతి ఉండేవాడు . ఆటను యెంత శౌర్యవంతుడంటే, యుద్ధములో దేవతలు సైతం అతని ముందర తలా వంచాల్సిందే . ఆ శౌర్య పరాక్రమాలే అతనిలో దుర్భుద్ధిని కలిగించాయి . రాజుగారిని అతని సంతానంతోపాటు మట్టుపెట్టి , ఆ రాజ్యాన్ని తాను ఆక్రమించాలని పన్నాగం పన్నాడు .
కానీ అతని కోరిక తీరకుండానే కాలం కాటువేశింది . అకాలమృత్యువు పాలిపోయాడు . పూర్వకర్మానుసారంగా ఆ సేనాధిపతి సింధు దేశంలో మిక్కిలి ఒక గొప్ప ఉత్తమజాతి అశ్వమై జన్మించాడు. అక్కడికి వెళ్లిన ఒక గౌడదేశ వర్తకుడు ఆ అశ్వాన్ని చూసి ముచ్చటపడి బోలెడంత దానం వెచ్చించి కొనుక్కొచ్చాడు . మరో జన్మ పొంది కూడా తిరిగి గౌడదేశానికి వచ్చిన ఆ అశ్వాన్ని ఆ వర్తకుడు రాజుగా ఉన్న నరసింహునికి విక్రయించాడు .
ఇదిలా ఉండగా, ఒకరోజు ఆ మహారాజు అదే అశ్వాన్ని ఎక్కి వేటకి వెళ్ళాడు . చాలా వేగంగా పరిగెత్తి , సైన్యాన్ని దాటి మహారాజుని ఒక దట్టమైన అటవీ ప్రదేశానికి తీసుకెళ్ళిందా అశ్వం . అప్పటికే ఆ రాజు వేటలో అలసిపోయారు . ఒక చెట్టుకింద అశ్వాన్ని విడిచి, సమీపంలో ఉన్న జలాశయంలో నీళ్లు తాగేందుకు దిగారు . అలా నీళ్లు తాగి అక్కడ ఉన్న ఒక పాకుడు పట్టిన రాతిమీద కాలు వేశి జారి పడ్డారు . ఆ రాతి దగ్గర ఒక ఆకు మీద శ్రీమద్భగవద్గీతలోని పంచదసాధ్యాయములోని ఒక సగం శ్లోకము రాసి ఉన్నది. ఆ ఆకుని తీసుకొని ఏం రాసుందా అని చదివారు . ఆ పరమాక్షరములని రాజుగారు చదివినప్పుడు వినడంవలన ఆ అశ్వము వెంటనే తన జంతు దేహమును విడిచి దివ్య రూపాన్ని ధరించింది. రాజుగారు చూస్తూ ఉండగానే, దివ్య విమానాన్ని అధిరోహించి విష్ణు లోకాన్ని పొందింది.
ఆ తర్వాత రాజు ఆ శిలా వేదిక పైన కూర్చుని తనకి సమీపంలోనే ఒక దివ్య మైన ఆశ్రమము ఉన్నట్టు గమనించారు . వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తున్న విష్ణుశర్మ అనే బ్రాహ్మణున్ని కలిశారు . ఆయనకీ భక్తితో నమస్కారం చేసి, “ ఓ విప్రోత్తమా ! నేను చూస్తూ ఉండగానే నా అశ్వం తన దేహాన్ని విడిచి దివ్యదేహాన్ని ధరించి వైకుంఠాన్ని పొందింది. అందుకు గల కారణం ఏమిటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను” అని అడిగాడు.
అప్పుడు త్రికాల వేదియైన ఆ విష్ణుశర్మ ఈ విధంగా చెప్పసాగారు . “ఓ రాజా! పూర్వము నీ దగ్గర శరభేరుండుడు అనే సేనాధిపతి ఉన్నాడు కదా ! అతడు ఒక సమయంలో దుర్బుద్ధి చేత పుత్ర సహితముగా నిన్ను చంపి నీ రాజ్యాన్ని గ్రహించాలని తలపోశాడు . కానీ నాకోరిక తీరకుండానే మృతిచెందాడు. ఆ దురాలోచన దోషము చేత, ఈ విధంగా అశ్వమై జన్మించాడు. ఇప్పుడు నువ్వు చదివిన భగవద్గీత పంచదశాధ్యాయములోని అర్థశ్లోక భాగాన్ని వినడం చేత ఆ దోషం తగిలి , అశ్వదేహం విడిచి స్వర్గాన్ని పొందాడు.” అని చెప్పాడు .
ఇదంతా విని ఆ రాజు తన పరివారముతో కూడా విష్ణుశర్మకు నమస్కారము చేసి, గీతా పంచదశ ఆధ్యాయాన్ని ఉపదేశము పొందారు . తిరిగి అతని అనుమతిని పొంది తన రాజ్యానికి వెళ్లారు . ఆ తర్వాత రాజ్యమును తన కుమారుడైన సింహబలునకి పట్టముగట్టి, తాను ప్రతిరోజూ గీతా పంచదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ, చివరికి మోక్షాన్ని పొందారు. కాబట్టి ఈ పంచదశాధ్యాయాన్ని పారాయణ చేసేవారు, వినేవారు కూడా సర్వపాప విముక్తులై తరిస్తారు. చివరికి పశువులు విన్నా కూడా వాటికి మోక్షం కలుగుతుంది .” అని పరమేశ్వరుడు ఈశ్వరికి వివరించారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
ప్రాంజలి ప్రభ
Comments
Post a Comment