గురువు పాత్ర - స్పెషల్ కధ



భారతీయ సాంప్రదాయంలో గురువు పాత్ర 

సాహితీమిత్రులారా! 
భారతీయ సాంప్రదాయం ఆచార్యులకు అగ్ర తాంబూలం ఇచ్చింది. గురువును లేక ఆచార్యుని త్రిమూర్త్యాత్మకంగా చిత్రించడం మన సంప్రదాయంలోనున్న మహోన్నత దృష్టాంతము. 'గు' అనగా అంధకార బంధురము. 'రు' అనగా ప్రకాశ వంతమైన తేజస్సు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన ప్రకాశాన్నందించడమే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. ఆధ్యాత్మికంగానూ , సామాజికంగానూ గురువు ప్రాధాన్యత ఎనలేనిది. 

విద్యార్థి , గురువు మఱియు గురుకులము భారతీయ సంప్రదాయంలో పెనవేసుకొన్న బంధాలు. ఇవే విద్యాభివృద్ధికి, సంస్కృత వికాసానికి ఆలంబనాలు. గురు శిష్యుల పరస్పర అన్యోన్యత, సౌజన్యత విద్యాభివృద్ధికి దిశానిర్దేశమయ్యాయి. ‘‘ అన్నదానం మహాదానం విద్యాదానమతః పరమ్ l అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవం తు విద్యయా ll “ అంటూ విద్యాదాన ఔన్నత్యాన్ని చాటిచెప్పిన దేశం మనది. అందుకే పంచమహాయజ్ఞాల్లో 'అధ్యాపనం బ్రహ్మవిద్యా' అంటూ పేర్కొన్నారు. విద్య వల్ల తాను మాత్రమే విరాజిల్లితే అతడు ఆచార్య స్థానానికి అనర్హుడు. విద్యార్థి స్థాయికి దిగివచ్చి ఆతనిని తీర్చిదిద్ది తనతో సమానంగా అంటే ఒక దీపం మరో దీపాన్ని ప్రజ్వలించినట్లు చేయడం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. ఆచార్యుడు, దేవుడు ఒకే సారి వస్తే అచార్యునికే అగ్రపీఠం అంటాడు కబీర్ దాసు (गुरु गोविन्द दोऊ खड़े काको लागूं पायं। बलिहारी गुरु आपने जिन गोविन्द दियो बताय). అందుకే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ 'శ్రీ గురు చరిత్ర' ప్రవచనం లో ఓ గమ్మత్తైన మాట అంటారు. దుష్ట సంహారం కోసం పొందిన భగవంతుని అవతారం చాలా తేలిక. గురువుగా అవతరించి కొన్ని తరాలను ఉద్ధరించడం అవతార ప్రక్రియ లో ఒక క్లిష్టమైన విషయమంటారు వారు. అందుకే గురుపరంపర ఆగకూడదంటారు. 

'సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ l 
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ ll ' 

ఈశ్వరుని మొదలుకొని , శంకరాచార్యులను మధ్యనిడి , మా గురువు వరకు ఎవరెవరు ఆచార్యులున్నారో వారందరికీ నమస్కారము అని ఈ శ్లోకార్థము.ఈ పరంపర సంప్రదాయమే లేకుంటే మన సంస్కృతి ఏమయ్యేది? మన విజ్ఞానం ఎలా పరిఢవిల్లేది? 
నిజమైన ఆచార్యుడు, సమాజ క్షేమాన్ని కోరే ఆచార్యుడు తాను కష్ట పడి సంపాదించిన జ్ఞానాన్ని అర్హత గల వారికి అందజేయడం కోసం హోమాలు సైతం చేస్తాడని తైత్తిరీయ ఉపనిషత్తు దృష్టాంతం చెపుతుంది. 

'ఆ మా యంతు బ్రహ్మచారిణః స్వాహా 
వి మా యంతు బ్రహ్మచారిణః స్వాహా 
ప్ర మా యంతు బ్రహ్మచారిణః స్వాహా 
ద మా యంతు బ్రహ్మచారిణః స్వాహా' 

అంటే మేధా శక్తి గల వారు, ఇంద్రియ నిగ్రహులు, కోపహీనులు (శాంత స్వభావులు ) అయిన అర్హులు విద్యార్థులుగా రావాలి. శిష్యులను వుద్ధరించాలనే ఈ తపన గురువులను అగ్రస్థానం లో కూర్చోపెడుతుంది. 
గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. అందుకే “गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः“ అంటుంది గురుగీత. విద్యకూ జ్ఞానానికీ బీజం నాటడం ద్వారా బ్రహ్మ, మనస్సు వికల్పం గాకుండా బ్రహ్మజ్ఞాన పరిష్వంగన అయి వుండడం కోసం మరియు సదా ప్రబోధన చేయడం ద్వారా విష్ణుత్వం గురువుకు ఆపాదించబడింది. బ్రహ్మజ్ఞానంలో భౌతికజ్ఞానం లయం చేయడమనే స్థితికి శిష్యుణ్ణి తీసుకొని రావడం శివతత్త్వానికి ప్రతీక. 
గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నది అతిశయోక్తి గాదు. కేవలం విషయ సేకరణ జ్ఞానాన్ని అందించటం లేదు. విద్యను ఒక సముద్రంతో పోలిస్తే గురువు మేఘం వంటి వాడు. సముద్రంలోని క్షారగుణాన్ని నిబద్ధించి స్వచ్చమైన జ్ఞానధారను శిష్యులకు ఉపాధిగా ఇస్తుంటాడు గురువు. బుద్ధి జ్ఞానాల ఆంతర్యాన్ని టి.ఎస్.ఇలియట్ అన్న ఆంగ్లకవి ఇలా చిత్రీకరిస్తాడు: 

Where is the Life we have lost in living? 
Where is the wisdom we have lost in knowledge? 
Where is the knowledge we have lost in information? 

Information నుండి knowledge లోతుల్లోకి వెళ్లి wisdom ను అందించడమే గురువు సమాజానికి చేసే మహోపకారము. 
ఇన్ని సత్ క్రియలు చేసే గురువు ఎలాంటి వాడై ఉండాలో కూడా మన సంప్రదాయం చెబుతుంది. శ్రోత్రియం మరియు బ్రహ్మ నిష్ఠ గురువుల కుండ వలసిన సద్గుణాలు. ప్రస్థానత్రయాల ప్రజ్ఞ శ్రోత్రియుల లక్షణం. విద్యార్థికి ఆత్మజ్ఞానప్రబోధం చేయడానికి కావలసిన వస్తుసామగ్రి శబ్ద రూపంలో గ్రహించి తేట తెల్లంగా చెప్పడానికి శ్రోత్రియం ఉపకరిస్తుంది. మరి బ్రహ్మనిష్ఠా? ఇది అత్యంత అవసరమైన గుణం. తాను స్వయంగా ఆత్మజ్ఞానానుభూతిని పొంది ప్రబోధించడం బ్రహ్మనిష్ఠకు పరాకాష్ట. నరేంద్రుడు 'దేవుణ్ణి చూచారా' అని ఎందర్ని అడిగినా ఒక్క రామకృష్ణ పరమహంస మాత్రం దేవుణ్ణి చూశానని, చూపించ గలనని భరోసా ఇవ్వగలిగాడు. ఈ రెండు గుణాలే కాక గురువు శాంతుడు, వినయశీలి, ఆచారశీలి, బుద్ధిమంతుడు అయి వుండాలన్నారు మన పూర్వీకులు. 

‘శాంతో దాన్తః కులీనశ్చ వినీతః శుద్ధ వేషవాన్l 
శుద్ధాచారస్సుప్రతిష్ఠః శుచిర్దక్షః సుబుద్ధిమాన్ ll 
అధ్యాత్మజ్ఞాననిష్ఠశ్చ తంత్ర మంత్ర విశారదః l 
నిగ్రహస్సు గ్రహీశక్తో గురురిత్యభిదీయతే ll ’ 
'బుద్ధి చెప్పు వాడు గ్రుద్దితేనేమయా ' అంటాడు వేమన. శిష్యుణ్ణి సన్మార్గంలో ఉంచడానికి ఒక దెబ్బ కొడితే అది మంచికే గాని చెడుకు గాదన్న సంగతి పెద్దలు గ్రహించాలి. 
సామృతైః పాణిభిర్ఘ్నన్తి గురవో న విషోక్షితై: l 
లాలనాశ్రయణో దోషాః తాడనా శ్రయణో గుణాః ll 

గురువు శిష్యులను తన అమృతహస్తాలతో కొడతాడే కానీ చెడు అక్షంతలతో కాదు. ఈ శ్లోకార్థమే “లాలనే బహవో దోషాః తాడనే బహవో గుణాః l తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేత్ న తు లాలయేత్ ll“ – లాలించడం వలన చాల దోషాలు ఉన్నాయి. కొట్టడం వలన చాల గుణాలు ఉన్నాయి. అందువలన పుత్రుని శిష్యుని కూడ కొట్టి మంచి మార్గంలో పెట్టాలి అని సుభాషితకారులన్నారు. అంతే కాక “లాలయేత్ పంచవర్షాణి దశ వర్షాణి తాడయేత్ l ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ll“ – పుత్రునికి అయిదు సంllలు వచ్చే వరకు లాలించాలి. తర్వాత పది సంllలు కొట్టి మంచి మార్గంలో పెట్టాలి. పుత్రునికి పదహారు సంllలు వచ్చిన తర్వాత మిత్రునివలె చూసుకోవాలి అని సుభాషితకారులన్నారు. ఇట్లా మన భారతీయ సంప్రదాయంలో పుత్రునికి , శిష్యునికి అభేదాన్ని చెప్పారు. పుత్ర, శిష్యులు ఇరువురూ గురువుకు పుత్రులే అని భారతీయ సంస్కృతి తెలియజేస్తున్నది. 

ఇంతగా గురువును గూర్చి చెప్పిన మన సంప్రదాయం ఇప్పటి విద్యా పద్ధతులకు అనుగుణంగా నిలబడుతుందా? అదేమో గురుకుల సంప్రదాయము. ఇప్పటిదేమో తద్భిన్నమైన సంప్రదాయము. అప్పట్లో గురువు నీడలో శిషులు విద్యాభ్యాసం చేసేవారు. గురుకులంలోనే వుండేవారు. నేడు అలా కాదు. గురు శిష్యుల మధ్య అంతరాలు పెరిగాయి. దూర శ్రవణ విద్య, అంతర్జాలం ద్వారా గురువుతో సంబంధాలు, వీడియో మరియు ఆడియో లాంటి సరికొత్త పోకడలు నేటి అంతర్జాతీయ విద్యా రంగలో క్రొత్త మలుపులు. విద్యా వస్తువు సైతం సమూలంగా మారింది. ఆత్మజ్ఞానమంటే ఏమో అవసరం లేదు. డబ్బెలా సంపాదించాలి? అవసరాల్ని సృష్టించి, పెంచి, అప్పులిచ్చి, వస్తువుల్ని ఎలా విక్రయించాలి? ఇలాంటి భావనలు (consumerism tendencies) ప్రబలంగా విద్యారంగం లో చోటు చేసుకొన్నాయి. 

ఇలాంటి జీవన యానంలో గురువు స్థానం ఎక్కడ? ఇది విశ్లేషించుకోవలసిన విషయము. మన సాంప్రదాయాన్ని నేటి పద్ధతులకు అన్వయంచుకొని ఎలా సంరక్షించుకోవాలి? నేటి గురువు ఈ కాలపు అవసరాల రీత్యా నిత్యం తన జ్ఞానాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతో వుంది. అలాగే శిక్షణా శైలి కనుగుణంగా శిక్షణా నైపుణ్యాన్ని(teaching skills) పెంపొందించుకోవాలి. నైతిక ప్రవృత్తి విద్యార్థులలో పెంపొందించడం కోసం తాను ధార్మికగ్రంథాధ్యయనం చేయాలి. విద్యాభ్యాసనా సమయంలో లోపించిన నైతిక ప్రమాణాలే నేటి సామాజిక రుగ్మతలకు కారణమన్న సత్యాన్ని గురువు దృఢంగా విశ్వసించాల్సిన సమయమిది. ‘Analytical knowledge, emotional knowledge and spiritual knowledge are the integral part of the overall education’ అన్న సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా శిష్యుణ్ణి తీర్చిదిద్ద గలిగే వాడే నేటి గురు స్థానానికి అర్హుడు. 'గూగుల్' కావలి హద్దుల్లోకి వెళ్లి విషయాలను విశ్లేషించి సారాన్ని సారవంతంగా శిష్యునికందించాల్సిన అగత్యం గురువుపైనుంది అనడంలో సందేహం లేదు. అతి కష్టమైన విషయాన్ని సూక్ష్మంగా అన్వయించి అఖండంలో అణువునూ, అణువులో అఖండాన్ని సాక్షీభూతం చేస్తూ సాగరాన్ని సైతం ఘటంలో ఇమిడ్చి ఇవ్వగల నేర్పరి నేటి నిజమైన గురువు. అతనే ఆచార్య స్థానానికి అర్హుడు. సదా సత్కారార్హుడు. 
-------------------------------------------------------- 
రచన- డా. కరణం నాగరాజ రావు, మధురవాణి సౌజన్యంతో 
----------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు




8. సేకరణ

చరవాణిి విమోచన వ్రతం
ఆచరించదగిన వారు : చరవాణి బాదితులు

వ్రత విదానము: ఉదయమునే స్నానాధికములు నిర్వర్తించుకొని ఖరీదైన ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌ని తీసుకొని ఒక బంగారు లేదా వెండి లేదా ఇత్తడి అథమం మట్టి పళ్లెమందు ఉంచవలయును

1. సెల్లాయనమః , 2. బిల్లుతో జేబు చిల్లాయనమః
3. ఇల్లు గుల్లాయనమః , 4. కొంప కొల్లేరాయనమః
5. సమయ చోరాయనమః, 6. సంసార ధ్వంసినేనమః.
ఇత్యాది అష్టోత్తర శతనామ మంత్రములతో చక్కగా పూజించి, ఆ సెల్‌ని, సెల్ కొనుక్కోలేని ఒక పేద వానికి, సెల్ నెత్తిన సత్తు రూపాయొకటుంచి, పళ్లెముతో సహా దానమీయవలెను.

వ్రత కథ : పూర్వం ద్వాపరయుగాంతమై కలియుగ ప్రారంభకాలమున మొబైలుష్మతీ రాజ్యమును సెల్భంజనుడు అను రాజు ప్రజానురంజకుడై పాలించుచుండెను. ఆ రాజ్యమందు కలి, తన కలి ప్రభావమును చూపనెంచినవాడై సెల్ఫోనురూపుడై ఉద్భవించెను. తొలుత ఆ సెల్లును జనులు కేవలం సంభాషణకు మాత్రమే ఉపయోగించుచుండిరి. ఇట్లు మాత్రమే ఉపయోగించిన, తన కలి ప్రభావం కనపడకయుండుట గమనించిన కలి పురుషుడు తన దుష్టాంశలైన ఇంటర్నెట్, ఆండ్రాయిడ్‌లను మొబైల్‌నందు ప్రవేశపెట్టి వాని జడలగు యాప్‌లను లెక్కకు మిక్కిలిగా విస్తరింపచేసెను. అట్టి యాప్‌లలో వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి వాటికి వ్యసనపరులై జనులు నిస్తేజస్కులైరి. ఈ సమాజ తిరోగమనమునకు కారణమైన కలినెట్లు నిలువరించవలెనని మిక్కిలి దుఃఖితుడైనాడు. లోక కల్యాణ కాంక్షా తత్పరుడైన నారదమునీంద్రులు ఏతెంచి ఆ రాజు చింతాక్రాంతుడగుటకు కారణమును తెలిసికొనినవాడై సెల్లు కలి నిర్మూలనము దుఃస్సాధ్యమనియు, సెల్లును నిలువరించుటకు ఆచరింపదగు ఏకైక, సెల్బంధ విమోచన వ్రతంగూర్చి నొక్కినొక్కి వక్కాణించెను. ఈ వ్రతమాచరించిన జాతి వికాసమును పొందునని ఆశీర్వదించి మరలిపోయెను.

ఫలశ్రుతి : ఈ కథ విన్నను, చదివిననూ సెల్ వ్యామోహం నుంచి ముక్తి కలిగి నెమ్మది నెమ్మదిగా బాహ్య ప్రపంచమున కార్యోన్ముఖులై సంసార తాపత్రయం పెంపొందించుకోగలరు, బందువులు, స్నేహితులు, హితులతో సత్సంబంధ భాందవ్యాలు సంపూర్ణంగా కొనసాగించగలరు!

స్వస్తి


7. చతుర్వేదాలు 

ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. 

వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. 

కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు. 

మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి(వేదాలను)ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. 

ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా విభజన చేసాడు. 

అలా నాలుగు వేదాలు మనకు లభించాయి. 

1. ఋగ్వేదము 
2. యజుర్వేదము 
3. సామవేదము 
4. అధర్వణవేదము 

1. ఋగ్వేదము : 

ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః | 
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః || 

ఋగ్వేదము తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు. 

ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు(మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. 

సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది. 

ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి. 

2. యజుర్వేదము : 

అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ | 
వామే కులిశపాణిస్తూ భూతిదో మంగళప్రదః || 

మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు. 

యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. 

౧. శుక్ల యజుర్వేదం 
౨. కృష్ణ యజుర్వేదం. 

శుక్ల యజుర్వేదం కాణ్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది. 
కాణ్వశాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి. 

3. సామవేదము : 

నీలోత్పలధళశ్యామోః సామవేదో హయాననః | 
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః || 

కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు. 

సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ,కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు. 

సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది. 
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది. 

ఉపనిషత్తులు ఛాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది. 

4. అధర్వణవేదము: 

ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః | 
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః || 

తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు. ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖం 

స్వస్తి !



6. ఐదు పిక్కలు, ఆరు స్తనాలువంటివి విడ్డూరంగా లేదూ ? 


ఈ పద్యాన్ని కస్తూరి రంగనాయకుడనే రసికుణ్ణి ఉద్దేశించి ఒక కవి చెప్పింది. తాను ప్రేమించిన కన్యది కన్యారాశి. అది తెలిసిన కవిగారు ఆ కన్యారాశిని ఆధారంగాచేసుకొనే ఈ పద్యాన్ని కవిసమయాలతో చమత్కారంగా అల్లారు. చివరగా ఆ కన్యతో నీకు వివాహమౌతుందని ఆశీర్వదించారు. అదెలాగో చూద్దామా మరి ? 

రాశిచక్రంలో ఆరవరాశి కన్య. అమ్మాయిది కూడా కన్యా రాశే. ఈ పద్యాన్ని ఆరవ రాశియైన కన్యతో సమన్వయపరచుకొని చదివితేనే అర్థమవుతుంది.
కన్యకు ఐదు జంఘాలు అంటే కన్య నుండి అయిదవ రాశి మకరం...అంటే కన్యపిక్కలు మొసలి ఆకారంలో ఉన్నాయని, ఆరు కుచంబులు అంటే కన్య నుండి ఆరవ రాశి కుంభం కనుక కుంభములవంటి కుచములు గలదని, అదే విధంగా కన్య నుండి నాల్గవ రాశి ధనుస్సు కనుక విల్లువంటి కనుబొమ్మలు గలదని, ఏడు విశాల నేత్రములంటే కన్య నుండి ఏడవది మీన రాశి కనుక చేపకన్నులవలె విశాలమైన కన్నులుగలదని, కన్య నుండి పన్నెండవది సింహరాశి కనుక సింహము నడుమువంటి నడుముకలదని కవిగారి భావం. ఇన్ని మంచి లక్షణాలుగల ఆ కన్యతో నీకు వివాహం జరుగుతుందని ఆశీర్వదించాడు. " కన్యకు నీకు పది కావలె...." అంటే కన్యనుండి పదవరాశి మిథునం కదా! మీరిద్దరూ దంపతులౌతారని అర్థం.మీరిద్దరూ దంపతులైతే చూడముచ్చటగా ఉంటుందని చమత్కరించాడు కవి. 

ఈ సింహమధ్య అనే పదాన్ని నాయికా నాయుకులకు ఇద్దరికీ సమానంగానే వాడారు మన ప్రబంధకవులు. పోకచెట్టు సన్నగా ఉంటుంది. మనుచరిత్రలో వరూధిని పోకచెట్టువెనకాల దాక్కొని ప్రవరుని చూచిందట. ఆమె నడుము అంత సన్నగా ఉండటం వలన ఆ చెట్టుబోదెతో కలిసిపోయి ఆమె కనిపించలేదట. సింహం నడుముకూడా అంత సన్నంగా ఉంటుంది. కనుకనే సింహమధ్య అంటారు. 

చేమకూర వేంకటకవి కూడా తన విజయవిలాస కావ్యంలో ఈ ప్రస్తావన తెచ్చాడు. తీర్థయాత్రల సందర్భంగా యతివేషంలోనున్న అర్జునుని సేవిస్తూ.... 

ఒకనాడు తన మేనబావ అర్జునుని గురించి తెలుసుకొనే ప్రయత్నంలో అతనిని వర్ణిస్తూ...." ఎగుభుజంబులవాడు మృగరాజమధ్యంబు పుడికిపుచ్చుకొను నెన్నడుమువాడు...." అంటుంది. 
మృగరాజమధ్యము అంటే సింహపునడుము అని అర్థం. 
ఇలాచెప్పుకొనిపోతూవుంటే నాకు అనేకం గుర్తుకొస్తాయి. 
రేపు సాయంత్రం మరొక చమత్కార పద్యంతో మిమ్మల్ని కలుస్తాను. 

భవదీయుడు 

డా!! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి 

--((**))--

5. ఆడవాళ్ళకు చదువు అవసరమా ?
    
ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయి, 
చిన్న కుటుంబాలుగా మన జీవన విదానం మార్పు చెందింది. 

అయితే దీని వలన ఏ విషయం ఎలా ఉన్నా, ముఖ్యంగా సంకట స్తితిలో నెట్టబడింది కుటుంబాలలోని వ్రుద్దుల పరిస్తితి. సాదారణంగా,ఉమ్మడి కుటుంబాలలో, పెద్దల చేతిలో పెత్తనం ఉంటుంది కాబట్టి, ముసలివాండ్ల పరిస్తితి బాగుండెది. 

మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు,కోడల్లు తో అంరూ ఉండటం వల్ల అదే ఒక చిన్న ప్రపంచం లాగ కళ కళ లాడుతూ ఉండేది. 
ఒకరు కాకపోతే మరొకరు,వ్రుద్దుల బాగోగులు చూడటానికి అవకాశం ఉండెది.కాబట్టి వారికి భద్రత ఉండేది. 

కాని ఇప్పట్టి చిన్న కుటుంబాలలో ఆ పరిస్తితి లేదు. 

ముసలి వాల్లను ఎవరు చూడాలి అనేది, 
ఒకరికి మించి కొడుకులు ఉన్న కుటుంబాల, 
ఆస్తుల పంపకాల సమయంలో పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. 
నీవు చూడు అంటే నీవు చూడు అని బాద్యతని తప్పించుకోవటానికే కొడుకులు కాని, వార్ని కట్టుకున్న కోడళ్లు కాని చూస్తున్నారు. అప్పటిదాక ఒకటిగా కుటుంబాన్ని నడిపిన కొంతమంది దంపతులు, కొడుకుల "బాద్యత పంపకాలు"లో బాగంగా "విడాకులు" తీసుకున్న జంటలాగ బర్త ఒక కొడుకి దగ్గర, బార్య ఇంకొక కొడుకు దగ్గర బ్రతకాల్శిన దౌర్బాగ్యం ఏర్పడుతుంది. 

ఇంకొక ముఖ్యమయిన విషయం ఏమిటంటే,ముసలి వారిని చూడాలంటే, చూసేవారికి కావాల్శింది, వారి పట్లప్రేమ లేకపోతే కనీసం కుటుంబ బాద్యత్ల పట్ల నిబద్దత . కాని ఈ తరం జంటలలో కరువైందే ఈ రెండు.నూటికి పదిమంది ఉంటారేమో అటువంటి పుణ్యతల్లులు.కాబట్టి వ్రుద్దులు పరిస్తితి డోలాయమాన స్టితి అని చెప్పవచ్చు. అందుకే చాలమంది వ్రుద్దులు తమ శేష జీవితాలు కూతుళ్ల వద్ద గడపటానికే ఇశ్టపడున్నారు. 

వృద్ధులైన తల్లితండ్రులను పుత్రులు చూడకపోతే పుత్రికలే చూడాలి . ఇక వీరు కూడ చూడకపోతే "వ్రుద్దాశ్రమాలే" గతి! అందుకే "భేటీ బచావో ! భేటీ పడావో " అనే పధకాన్ని నూటికి నూరుపాళ్లు సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లి తండ్రి మీద ఉంది . ఒకప్పుడు ఆడపిల్లను చదివించి ఉద్యోగస్తురాలిని చేస్తే , ఆమె సంపాదన అంతా అత్తింటివారి కె ఉపయోగపడుతుంది తప్పా , తమకు కాదు కదా అని కొంతమంది తల్లితండ్రులు స్వార్ధ పూరితంగా అలోచించి కొడుకులనే పై చదువులు కు పంపించి , ఈడు రాగానే ఆడపిల్లలకు పెండ్లి చేసి పంపించే వారు . అటువంటి వారు కూడా తమ ఆడపిల్లలను నిర్బయంగా పై చదువులు చదివించి మంచి ఉద్యోగాలలో స్థిరపడేలా చేయొచ్చు . ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు ప్రకారం వృద్ధులైన తల్లి తండ్రులును పోషించాల్సిన బాధ్యత కొడుకులకు ఎంత ఉందొ , కూతుళ్ళకు కూడా అంటే ఉంది కాబట్టి , ఆడపిల్లలను తల్లితండ్రులు "ఆడ-పిల్లలు " అని అనుకోవాల్సి న అవసరం లేదు . 
వారు కొడుకులు మాదిరిగానే ఎప్పటికి పుట్టింటికి అన్నింటిలో వారసులే! 

ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో పిల్లలు కట్టుదిట్టమైన క్రమశిక్షణతోనూ, వినయవదేయలతోనూ పెరిగేవారు, తాతగారి ఒడిలో నూ, గుండెలపై పడుక్కుని నేర్చుకున్న చదువుల ఖరీదు నేడు లక్షలలోనుంది! 

*********లోకాసమస్తాం సుఖినోభవంతు**********

--((**))_-

భాషాద్వయ సమ్మేళనమ్--( చిత్ర కవిత)
కం: మాయంమాన సు నీవే
రాయలవై కావ దేవరా! జే జే జే !

మాయాతుమ లానిన యది

పాయక సంతోసమున్న పల మిలసామీ !



4. కళాపూర్ణోదయము--6 ఆ : 161 పద్యం- పింగళి సూరన !

ఈపద్యము కళాపూర్ణోదయమున ప్రథమాగమాదులు పామరవేషధారులైవచ్చి కళాపూర్ణుని స్తుతించు సందర్భము లోనిది. ఇందు ఒకరీతి గా పదములను చదివిన తెనుగును, మరియొక రీతిగా చదువగా సంస్కృత మును మనకు అవగత మగుచుండును. ఇదియే భాషాద్వయ సమ్మేళనము.

తెలుగు: పదవిభాగము+ అన్వయము.

ఇలసామీ! --మాయమ్మ- ఆన- సు- నీవే - రాయలవై -కావన్- దేవరా - జేజేజే- మా ఆతుమలానినయవి- పాయక- సంతోషమున్న- పలము.

అర్ధము: దేవరా! ఓరాజా! ! జేజేజే- జయము జయము జయము;ఇలసామీ-ఓభూపతీ! నీవే- నీవే ;రాయలవై- రాజువై;
కావన్- రక్షింపగా ; సంతోసము- ఆనందము; పాయక- విడువక; మాయాతుమలను- మామనస్సులందు; ఆనినయది-పొందినది; ఉన్నపలము- ఇదిమాకు కల్గిన ఫలము; మాయమ్మఆన- మాతల్లిపై ఒట్టు;

భావము: ఓరాజా! నీకు జయమగుగాక! మాయమ్మపై నొట్టుపెట్టుకొని చెప్పు చున్నాము. నీవు రాజువై రక్షించుటచే మామనస్సులానందముతో నిండిపోయినవి;
సంస్కృతము:పదవిభాగము+ అన్వయము: మా-- ఆయమ్--మాన- సునీవే-- రాః - అలవా - ఏకా - అవత్- ఏవ -రాజే - అజేజే - మా - ఆయాతు- మలాని-- న- యది- పాయక- సంతః- అసముత్ - న- వల- మిల- సా- అమీ;
అర్ధము: హే సునీవే- చక్కని మూలధనముగల ఓరాజా! ; ఆయమ్- రాబడిని ; మామాన- లెక్కచేయకుము; అలవా--తరుగని;
రాః - ధనము; ఏవ- ఒక్కటియే; అవత్- రాజును కాపాడును ; అజేజే-- భగవంతుని పూజించు-- రాజే--రాజుకొరకు ; మా- లక్ష్మి; ఆయాతు- వచ్చునుగాక - మలాని- పాపములు-- న-- చేరవు; పాయక- ఓరక్షకుడా! ; సంతత్సు- పడితులైనచో (చూడవచ్చినవారు)
అసముత్--సంతోషరహితుడవై ; నవల- దూరముగా పోకుము; మిల-- వారిని కలువుము; అమీ-- ఆపండితులే- సా లక్ష్మీ -- ఆ లక్ష్మియని యెఱుంగుము;
భావము: ఓరాజా! రాబడిని నమ్మి మూలధనమును వమ్ముచేయకుము. తరుగని సంపదయే రాజునకు సంతసమును గూర్చును. భగవదారాధనచే సకల సంపదలు కలుగును. పాతకములు దరిజేరవు. ప్రభూ! పండితులను గాంచినంతనే పరాఙ్ముఖుడవుగాక ,వారిని సంభావింపుము. వారే లక్ష్మికి ప్రతిరూపములని భావింపుము.
ఇది పాఠకులకు కొంత కష్ట సాధ్యమేయైనను రహస్య సమాచారాదులకొరకు వేగులు ,మంత్రులు ,ప్రభువులు, తమతమ
కార్యకలాపములకు ఇట్టివి వాడుచుండెడివారు.
స్వస్తి!! శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో.


3. సేకరణ

ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.*

 *ఎక్కడ ఉంటారు?* *ఎలా ఉంటారు?* *అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.* *సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.*

 *ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..*

*కశ్యప అత్రి భరద్వాజ*
*విశ్వామిత్రోథ గౌతమః!*
*వశిష్టో జమదగ్నిశ్చ*
*సప్తైతే ఋషయః స్మృతాః!!*

*భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.*
*ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.*

1. *కశ్యపుడు,*
2. *అత్రి,*
3. *భరద్వాజుడు,*
4. *విశ్వామిత్రుడు,*
5. *గౌతముడు,*
6. *జమదగ్ని,*
7. *వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులే.*
*రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.*

 1. *కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.*

 2. *అత్రి మహర్షి:-*
*సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.*

 3. *భరద్వాజ మహర్షి:-*
*భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.*

 4. *విశ్వామిత్ర మహర్షి*:-
*విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.*

 5. *గౌతమ మహర్షి:-*
*తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.*

 6. *వశిష్ఠ మహర్షి:-*
*ఇతని భార్య అరుంధతి.* *వసిష్ఠుడు బ్రహ్మమానస* *పుత్రుల్లో ఒకడు. వైవస్వత* *మన్వంతరాన సప్తర్షుల్లో* *ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు* *గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు,* *గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.*
*సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.*

 7. *జమదగ్ని మహర్షి:-*
*జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.*

 *మరణం ఆసన్నమైన వారికి అరుంధతీ దర్శనం, సప్తర్షి మండల దర్శనం కాదట.*
 *మీరంతా మీకు వీలున్న సాయంత్రపు వేళ "సప్తర్షి మండల దర్శనం" చేసుకుంటారు కదూ...*


 *సప్తర్షి మండల దర్శన ఫల ప్రాప్తిరస్తు* ........

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు