ఓం శ్రీరామ
అత్యంతం సుకుమారీ నారీ, మూర్తి విచారే!!
భావము: - దేవీ! నీవు, తత్త్వముగ విచారించగా సర్వవ్యాపక తేజస్సు గా ప్రజ్వరిల్లు శక్తిస్వరూపిణివి. మూర్తి భావమున విచారించగా అత్యంత కోమల గాత్రివి.
*ఎవరు సకల దేవతలకు ఆదికారణుడో,సర్వప్రపంచమునకు పరిపాలకుడగుచున్నాడో, మహర్షిగా సర్వజ్ఞుడగు చున్నాడు. అద్వితీయుడగు ఆ పరమాత్మయే మాయా విశుష్టుడై తన శక్తితో సర్వమును నియమించుచున్నాడు.ఆ పరమాత్మయే యీ సమస్త ప్రపంచమును మాయాశక్తితో పుట్టించుచు,పోషించుచు,సంహరించుచున్నాడు.ఈ విషయము నెవ్వరెరుంగుదురో వారు మరణరహితులై ముక్తులగుదురు.
*శ్లోకము:- క్వజ్యోతిర్మహతోస్మా దాకాశాదపి భూయః?
తత్సర్వం వినయంతీ తన్వంగీక్వనునారీ!!
భావము:-తల్లీ! నీవు, సర్వవ్యాపకమగు ఆకాశము కంటెను ప్రజ్వరిల్లు మహత్తర తేజస్సు కలదానవి.ఆ రూప మున జగన్నిర్మాణము చేతువు.ఆ అసంభవ కార్య నిర్వహణలో నీ సుకుమార దేహము. కృశించినట్లున్నది
*సతీదేవి శక్తి స్వరూపము. జగత్తును నడిపించు శక్తి. శక్తి నుండి ప్రకృతియు, సృష్టియు వ్యక్తమై శక్తి చేతనే నడచు చున్నది. శక్తి అయినా శివునితో అనుసంధానము చెంది ఉన్నంతసేపు శివుని గూర్చి అనుభూతిని పొందవచ్చు. శక్తి మరొక ప్రక్క చూస్తే శివుడు శక్తి వైపు చూడడు. ఆమె పంచభూతాత్మకమైన సృష్టిని ఏర్పరుస్తూ, సహస్రారము నుంచి మూలాధారం వరకు శివుడిని తనతో పాటు తెచ్చుకుంటుంది.
అందుకనే అన్నిటి యందు శివుడున్నాడని చెప్తారు. కాని దేని యందు ఆయనకి సంబంధము ఉండదు. సంబంధమంతా ఆమెదే. శివుడితో ఉన్ముఖడమైతే శివుడు మనకు ఉన్ముఖుడవుతాడు. మనము మరిచిపోతే అతను వదిలివేస్తాడు.
*శ్లోకము:- విద్యానామసి భావో హృద్యానామసి హావః!దేవనామసి లీలా దైత్యానా మసి హేలా!!
భావము:-తల్లీ! నీవు చతుర్దశ విద్యల తాత్పర్య భావానివి. మనస్సు రంజింప చేయు సకల రమణీయతకు హావభావవు. దేవతల అందలి గుర్తించదగ్గ విలాస లీలవు. దైత్యుల తిరస్కరించు విలాసవు.
*బంధాల వలన భాధలు, లోభత్వం వస్తాయి.
*సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు.
*శ్లోకము:- గంతౄణా మసి చేష్టా స్థాణూ నామసి నిష్ఠా!
లోకానామసి మూలమ్ లోకాదే రసి జాలమ్!!
భావము:-తల్లీ! నీవు, చరించు సకల ప్రాణుల అందలి చలనమవు, అచరముల అందలి స్థాణు స్థితివి. సర్వలోకములకు మూల భూతవు. లోకుల జన్మమునకు కారణ మాయవు.
జ్ఞానము అజ్ఞానము చేత ఆవరింపబడి యుండునని, అందుచేత జీవులు భ్రమను చెందుచున్నారని, పరమాత్మ తటస్థుడు, సాక్షీభూతుడని ముందు శ్లోకమున తెలుపబడినది. జ్ఞానము కలుగుచున్న కొలది ప్రతి ఒక్కనికి తన స్వరూప స్వభావములు స్పష్టమగు చుండును. క్రమముగ 'తాను' అను అహంకార పురుషుడు నశించి పరతత్వమే ఉన్నదని తెలియును. 'నేను' అను అంతర్యామి తత్త్వము 'నేను' అను అహంకార పురుషుని ద్వారా ప్రకాశించును. నిజముగ జ్ఞానము కలిగినవాడు తానున్నానను భ్రమను చెందడు. దైవమే తానుగ నున్నాడని తెలిసియుండును. నిజముగ దైవమే యున్నాడని తెలిసియుండును. ఇట్లు తెలిసినవారే సద్గురువులు. నిరహంకారులు. పూర్ణ జ్ఞానులు.
శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
మాయాచేయం తమోరూపా తాపనీయే తదీరణాత్ ౹
అనుభూతిం తత్రమానం ప్రతిజజ్ఞే శ్రుతిః స్వయమ్ ౹౹125౹౹
125. నృసింహ ఉత్తర తాపనీయోపనిషత్తు(9)మాయను తమోరూపముగ అంధకారముగ చెప్పుచున్నది.శ్రుతి స్వయముగనే ఎల్లరయనుభవమునే ప్రమాణముగ జూపుచున్నది.
జడం మోహాత్మకం తచ్చేత్యనుభావయతి శ్రుతిః ౹
ఆబాలగోపం స్పష్టత్వాదానంత్యం తస్య సాఽ బ్రవీత్ ౹౹126౹౹
126. మాయ యొక్క స్వరూపము జడము భ్రమాత్మకము అని శ్రుతి చెప్పును.బాలురు మందబుద్ధులకు కూడా దీనిని ప్రకటింతురని శ్రుతియనును.
నృసింహ ఉత్తర తాపనీయ ఉప.9.
అచిదాత్మఘటాదీనాం యత్స్వరూపం జడం హి తత్ ౹
యత్ర కుంఠీభవేద్బుద్ధిః స మోహ ఇతి లౌకికా ౹౹127౹౹
127. చైతన్యరహితములైన ఘటము మొదలగువాని స్వరూపమే జడస్వరూపము. దేనిన్థము చేసికొనలేక బుద్ధికుంటుపడునో అది మోహము అని లోకవ్యవహారము.
ఇత్థం లౌకిక దృష్ట్యా ఏతత్ సర్వైరప్యనుభూయతే ౹
యుక్తి దృష్ట్యా తనిర్వాచ్యం నాసదాసీదితి శ్రుతేః ౹౹128౹౹
128. ఈ విధముగ లౌకిక దృష్ట్యా మాయ ఎల్లరచేతను అనుభవింపబడుచున్నది.
తర్కదృష్ట్యా మాయను నిర్వచించి చెప్పుటకు వీలులేదు.అది అనిర్వచనీయమనియే అనవలెను.దానికి శ్రుతి ప్రమాణము నాసదీయ సూక్తమే.(ఋగ్వేదము.10.129)
వ్యాఖ్య:-
"సాచ మాయాన విధ్యతే,మాయేత్య విద్య మాన స్యాఖ్యా"
---(మాండూక్య-ఉ-భా-4-58)
మాయ అసలు లేనిదే యధార్థమున లేని దానికి మాయ అని,అవిద్యయని మాత్రము నామ మొసంగబడినది. ఆత్మ నృసింహుడు,చిద్రూపుడు, అవికారుడు,అంతటను కన్పడు వాడు (ఉపలబ్ధుడు) ఎక్కడను ద్వైతసిద్ధిలేదు(రెండవవాడు లేడు)ఆత్మయే ఉన్నది.మాయ రెండవదిగా ఉన్నది. అందుచే మరొకడువలె ఉండును. ఈ పరమాత్మయే యీ సర్వమును,అప్పుడే ఈ ప్రజ్ఞ (జ్ఞానము) అవిద్యా స్వరూపమే జగత్తు సర్వమును.ఇదియు ఆత్మయే.
పరమాత్మ యొక్కడే స్వప్రకాశుడు, జ్ఞానవిషయముకాడు.అంతయు తెలిసియే మరొకచోట మరొకరిని తెలసికొనడు.అనుభూతి అట్లున్నది. మాయయున్నదే అది తమోరూపానుభూతి,అదే ఈ జడము,మోహాత్మకము, అనంతమునైనది. ఈ రూపము ఈ ఆత్మకు వ్యంజకము(ఉన్నట్లు తెలుపునది) మాయత్రిగుణములైన సత్త్వ రజస్తమో మయమై యున్నది. కార్యమును బట్టి కారణం ఊహించి నట్లు ఆయాకార్యములను బట్టి ఈ త్రిగుణములను ఎఱుగవలయును.
తమోగుణము మాయ యొక్క"ఆవరణ శక్తి" యైయున్నది.ఇది వస్తువు యొక్క యదార్థరూపమును తెలియనివ్వక కప్పిపుచ్చగా,అనగా ఈ ఆవరణ శక్తి సత్యవస్తువును కప్పిపుచ్చగా విక్షేపశక్తి అసద్వస్తువులందు మోహమును కలిగించి సంసార దుఃఖమున ముంచును.
ఈ మాయ లేక అవిద్య ఒక్కటిగానే యున్నది.ఏ అంతః కరణమునందు అజ్ఞానమున్నదో అది జ్ఞానము వల్ల నివర్తి అగును. ఏ అంతః కరణమునందు జ్ఞానము కలుగుట లేదో అందు అజ్ఞానాంశమును బంధమును గలదు. మాయకు కారణమేది అనే ప్రశ్న అసంగతము.ఏలన కార్యకారణ సంబంధమే మాయా కార్యము కనుక మాయకేది కారణమని తగువాడుట కొడుకు తల్లిని
"నీ పెండ్లికి నన్నేల పిలవలేదు?" అని నిర్బంధించినట్లే ఉండును.
***
153) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
నాసదాసీద్విభాతత్వాన్నో సదాసీచ్చ బాధనాత్ ౹
విద్యా దృష్ట్యా శ్రుతం తుచ్ఛం తస్య నిత్య నివృత్తితః ౹౹129౹౹
129. మాయ యొక్క ఫలితములు స్పష్టముగ ఇంద్రియగోచరములు అగుచుండుట చేత అది లేదనలేము.జ్ఞానోదయమైనపుడు నశించుట చేత నిజముగ ఉన్నదనీ అనలేము.బ్రహ్మజ్ఞానపు దృష్ట్యా మాయ పనిచేయదు కనుక అది ఉపేక్షణీయమే అగును. బృహదారణ్యక ఉప.4.4.19
కఠ ఉప.4.11.
తుచ్ఛాఽ నిర్వచనీయా చ వాస్తవీ చేత్యసౌ త్రిధా ౹
జ్ఞేయా మాయా త్రిభిర్భోధైః శ్రౌతయౌక్తిక లౌకికైః ౹౹130౹౹
130. మాయ తుచ్ఛమనీ అనిర్వచనీయమనీ వాస్తవమనీ మూడు విధములుగ గ్రహింపబడుచున్నది.
అస్య సత్త్వమస్త్వం చ జగతో దర్శయత్యసౌ ౹
ప్రసారణాచ్చ సంకోచాద్యథా చిత్రపటస్తథా ౹౹131౹౹
131.ఈ ప్రపంచము ఉన్నట్లుగను (జాగ్రదవస్థ యందు),లేనట్లుగను
(సుషుప్తియందు),
మాయ చూపించును.తైల చిత్రమును విప్పిచూపుచు చుట్టివేసి చూపునట్లుగనే.
వ్యాఖ్య:- శ్రుత్యానుసారము మాయ తుచ్చము,తార్కాకముగ అనిర్వచనీయము,లోక వ్యవహారమున వాస్తవము.అవిద్యను(అజ్ఞానమును)ఉపాసించువారు తమస్సును (అంధకార బంధురమైన సంసారమును) పొందుదురు.వేదమునందు ఆసక్తిగలవారు ఆ పూర్వజ్ఞానము కంటె మిక్కిలి అధికమైన అజ్ఞానమును పొందుచున్నారు. విద్యకు అవిద్యకు అతీతమైనది ఆత్మజ్ఞానమని తెలియవలెను.ప్రపంచము ఉన్నట్లుగా జాగ్రదవస్థ యందు,లేనట్లుగా సుషుప్తి యందు మాయ(అజ్ఞానము) చూపించును.తైల చిత్రమును విప్పిచూపుచు, చుట్టివేసి చూపుతున్నట్లుగా,తెరపై చలనచిత్రము ఆడునట్లుగా అది ఆగినపుడు కాళీతెరలా కూడా కనపడునది మాయే(అజ్ఞానమే).జనన భావన అజ్ఞాన భూమికకు మాత్రమే చెందినది.సత్యాన్ని చూడనివ్వని ఆవరణ విక్షేపాలే (అగ్రహణ-అన్యధాగ్రహణాలు) అజ్ఞానమని పిలవబడుతున్నాయి.ఈ అజ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి నిశ్చయంగా యీ జగత్తంటకీ చైతన్యమే(తెలుసుకునే తెలివే)మూలమని తెలుస్తొంది.
ఈ చరాచర జగత్తంతా నీలో ఒక భాగం మాత్రమే!
సమిష్టి కారణ శరీరం(అందరి వాసనల సమిష్టి రూపం) దర్శించే స్వప్నమే సృష్టి సర్వమూ కూడా.అజ్ఞానం నశించినప్పుడు దాని ఫలితమయిన ఆవరణ విక్షేపాలు కూడా నశిస్తాయి.జగత్ భ్రమ తొలగిపోతుంది.
సర్వవ్యాప్తము, నిత్యశుద్ధము,చైతన్య రూపము అయిన పరమసత్యాన్ని "తాను"గా గ్రహించిన వారికి ద్వంద్వానుభవ స్థితి ఏ విధంగా వుండగలదు?
విజ్ఞానియగు బ్రహ్మవిదుడైన బ్రాహ్మణుడు ఆత్మతత్త్వమును దెలిసి తన్నిష్ఠావంతుడు కావలెను.
బహుళకమగు ఇతర అనాత్మ శబ్దములను(విషయములను)అభ్యసించరాదు.కారణమేమన అట్టి వృథా శబ్దములు శ్రమను కలుగజేయును.
ఆత్మను గురించి వేదఋక్కుచే స్పష్టముగా చెప్పబడియున్నది.
ఆ ఆత్మ నిత్యమైనది.పుణ్యకర్మచే వృద్ధినిగాని,పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుట లేదు.దాని మహిమ నెఱింగినవాడే "పదవిత్"అనబడును.ఆ మహిమ నెఱిగిన వానికింక కర్మముతో సంబంధము లేనేలేదు.అతడు శాంతుడు,ఇంద్రియ నిగ్రహము కలవాడు.ఉపరతుడు,తితిక్షువు,
ఏకాగ్రచిత్తుడు.
ఇట్టి సల్లక్షణములతో నిండి ఆమహానీయుడు తనయందే పరమాత్మను దర్శించుచున్నాడు. సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు.
***
*సంకల్ప సూక్తమ్
. మనస్సుకు సత్సంకల్పము కలిగేలా చేసే సూక్తము 🌻
మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పము ఉండాలి. అన్య మనస్కంగా పని మొదలు పెడితే పని నెరవేరదు. ఆ సంకల్పము కూడా సత్సంకల్పమై యుండాలి. అలా సంకల్పం కలగాలన్న కోరికతో పఠించేదే యీ సూక్తము. ఇది శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత లోనిది. 6 మంత్రాలు కలది. యిలాటిదే మహన్యాసంలో 36 మంత్రాలు కలిగినది ఉన్నది.
దీనిని ప్రతి రోజూ నిద్రకు ముందు, లేచిన తర్వాత కూడా చదువుకోవచ్చు.
ఓం! యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవేతి |
దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు || 1
జ్యోతి స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థలో బయటకు వెళ్లి, నిద్రావస్థలో అంతర్ముఖమౌతుంది. అనంత దూరాలకు వెళ్లేదీ, యావత్ప్రపంచానికి ప్రకాశమైనది, అద్వితీయమైన ఆ ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.
యేన కర్మాణ్యపసో మనీషిణో యఙ్ఞే కృణ్వన్తి విదథేషు ధీరాః |
యదపూర్వం యక్షమన్తిః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు || 2
మేధావులు యఙ్ఞ కర్మలలో ఆపస్సు వంటి కర్మలను ఎందుకు చేస్తారో, బుద్ధి మంతుల ప్రార్థన లో ప్రాధాన్యమైనదేదో, ఆరాధనీయమైనదేదో ఏదైతే ప్రాణులలో నెలకొని ఉన్నదో అటువంటి ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.
యత్ ప్రఙ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్జ్యోతి నరన్తనరమృతం ప్రజాసు|
యస్మాన్న ఋతే కించ న కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు || 3
ఏ ఆత్మైతే ప్రఙ్ఞానం, ఙ్ఞాపక శక్తి, మనో స్థైర్యములకు ప్రాప్తి స్థానమో, ఏ ఆత్మైతే ప్రాణులలో నశించని జ్యోతి స్వరూపంగా ఉంటున్నదో, ఏ ఆత్మైతే లేకుంటే ఏ పనీ చేయజాలమో అట్టి ఆత్మ నా మనసును సత్సంకల్పం కలిగేలా ప్రేరేపించు గాక.
యేనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహియమమృతేన సర్వమ్|
యేన యఙ్ఞస్తాయతే సప్త హోతా తన్మే మనః శివ సంకల్పమస్తు|| 4
ఏ ఆత్మైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటినీ గ్రహించుచున్నదో, ఏ ఆత్మైతే హోమం చేస్తున్న ఏడుగురికీ దానిని గురించి వివరిస్తుందో ఆ ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పం కలిగే లాగా ప్రేరేపించు గాక.
యస్మిన్ ఋచః సామ యజూగ్ంషి యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభావివారాః|
యస్మింశ్చిత్తగ్ం సర్వమత ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు|| 5
రథ చక్రంలో ఆకులు ఎలాగైతే అమరి ఉంటాయో అలాగే ఋక్, యజుస్, సామ వేదాలు దేనిలో నెలకొని ఉన్నవో, పడుగు పేకలా జనుల మనస్సులు అన్నీ దేనిలో నెలకొని ఉన్నవో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పాన్ని కలిగేలా ప్రేరేపించు గాక.
సుషారథిరస్వానివ యన్మనుష్యాన్ నేనీయతే౽భిశుభిర్వాజిన ఇవ |
హృత్ప్రతిష్ఠం యదజిరం ఇవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు || 6
ఓం శాంతిః శాంతిః శాంతిః
నేర్పరియైన సారథి అశ్వాలను క్రమశిక్షణతో ఉంచినట్లు, మానవులు గుర్రాలను పగ్గాలతో ముందుకు నడిపినట్లు, హృదయస్థానంలో ప్రతిష్ఠితమైన ఏ ఆత్మైతే మానవులను నియంత్రిస్తుంటుందో, నిత్య యౌవనంగా ఉంటుందో, అన్నిటికన్న వేగవంతమైన దో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః|
***
శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ఇదంత్వరూప్యతే భిన్నే సత్వాహన్తే తథేష్యతామ్ ౹ సామాన్యం చ విశేషశ్చ ఉభయత్రాపి గమ్యతే ౹౹38౹౹
38. "ఇది" "రజితము" అనే భావనలు రెండు విభిన్న భావనలు.అట్లే స్వత్వము అహంత అనునవి రెండు భిన్నములైన భావములని తెలియుము. ఇది, స్వత్వము అనునవి రెండును సామాన్యాంశములు.రజితము అహంత అనునవి విశేష భావములు.
దేవదత్తః స్వయం గచ్ఛేత్త్వం వీక్షస్వ స్వయం తథా ౹ అహం స్వయం న శక్నోమీత్యేవం లోకే ప్రయుజ్యతే ౹౹39౹౹
39. దేవదత్తుడు స్వయముగ పోవుగాక,నీవు స్వయముగ చూడుము,నేను స్వయముగ చేయజాలను,ఇట్లు లోకమున ప్రయోగమున్నది గదా. (స్వయం శబ్దపు సామాన్యత్వము చూపబడినది.)
ఇదం రూప్య మిదం వస్త్రమితి యద్వదిదం తథా ౹ అసౌత్వ మహమిత్యేషు స్వయమి త్యభిమన్యతే ౹౹40౹౹
40. ఇది వెండి,ఇది వస్త్రము మొదలగు వానిలో "ఇది" సామాన్యమైనట్లే
ప్రథమ మథ్యమ ఉత్తమ పురుషులు మూడును స్వయమని అభిమానించును.
అహంత్వద్భిద్యతాం స్వత్వం కూటస్థే తేన కిం తవ ౹ స్వయం శబ్దార్థ ఏవైష కూటస్థ ఇతి మే భవేత్ ౹౹41౹౹
41. (ఆక్షేపము)స్వత్వము అహంత కంటె భిన్నమగు గాక.దాని వలన కూటస్థమున కేమి లాభము? (సమాధానము)స్వయం శబ్దమునకు అర్థమే ఈ కూటస్థము.
*****
శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాం జగుః ౹ లోకాయతాః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః ౹౹60౹౹
60. లోకాయుతులు (భౌతికవాదులు)పామరజనులు ఇంద్రియ గోచరమైన ప్రత్యక్షమును, మిథ్యను,మాత్రమే ఆశ్రయించి కూటస్థము మొదలు శరీరము వరకు గల సంఘాతమును ఆత్మ అందురు.
శ్రౌతీకర్తుం స్వపక్షౌ తే కోశమన్నమయం తథా ౹ విరోచనస్య సిద్ధాంతం ప్రమాణం ప్రతిజిజ్ఞిరే ౹౹61౹౹
61. తమ వాదము వేదసమ్మతమని చెప్పుటకు వారు అన్నమయ కోశమును
(తైత్తిరీయ ఉప.2.1)విరోచన సిద్ధాంతమును
(ఛాందోగ్య ఉప.8.8)ప్రమాణముగ ఊటంకింతురు.
జీవాత్మనిగమే దేహమరణస్యాత్ర దర్శనాత్ ౹ దేహాతిరిక్త ఏవాత్మే త్యాహుర్లోకాయతాః పరే ౹౹62౹౹
62. మరికొందరు లోకాయుతులు,జీవాత్మ శరీరమును వదలినపుడు శరీరము మరణించుట వలన,ఆత్మ నిశ్చయముగ శరీరము కంటె భిన్నమని తీర్మానింతురు.
ప్రత్యక్షత్వేనాభిమతాహం దీర్దేహాతిరేకిణమ్ ౹ గమయేదింద్రియాత్మానం వచ్మీత్యాదిప్రయోగతః ౹౹63౹౹
63. వారు
"నేను మాటలాడుచున్నాను" మొదలగు ప్రయోగముల వలన దేహము కంటె భిన్నమగు అహం బుద్ధిని సూచించు ఇంద్రియములే ఆత్మయని చెప్పుదురు.
Comments
Post a Comment